
చేతులు చాస్తేచాలు!
– కందుకూరి శ్రీరాములు
సూర్యుడు ఒక దినచర్య
ఎంత ఓపిక ! ఎంతప్రేమ !
భూమిపాపాయిని
ఆడించేందుకు
లాలించేందుకు
నవ్వులవెలుగులు నింపటానికి
పొద్దున్నే బయల్దేరుతాడు
భానుడు తల్లిలా –
ఆత్మీయత
ఒక వస్తువు కాదు
ఒక పదార్థం అంతకంటే కాదు
లోలోన రగిలే ధగధగ-
వేల వేలకిరణాలతో
నేలను ఒళ్లోకి తీసుకొని
నేలను ఆడించి పాడించి
లాలించి
బుజ్జగించి ముద్దాడి
తినిపించి నిద్రపుచ్చి
కూలికి వెళ్లిన తల్లిలా
మళ్లీవస్తా అంటూ వెళ్లిపోతుంది పొద్దు!
అరచేయి చేతివేళ్లు
ఒకటవటమూ విడివిడిగా ఉండటమూ
ముడివడి ఒకటై పిడికిలవటమూ
ఒక నైపుణ్యం!
ఒక అనురాగం!
అవెంతో హాయిగా
ఐక్యంగా ఉంటాయి!
హృదయంతో పలికినప్పుడు
గుండె
విషాన్నియ్యదు!
మనసువిప్పి మాట్లాడినప్పుడు
ప్రేమ కయ్యానికి
కాలుదువ్వదు!
చెట్టు పెరుగుతూ
కిరణాల వైపు మొగ్గుతూ వంగుతూ పైకి సాగుతుంది !
సాదుకున్న
దాన్నెప్పుడూ
నీచంగా పెంచరు !
పెంచి పోషించుకున్నదాన్నెప్పుడూ
నికృష్టంగా తెంపెయ్యరు !
ఒక పద గుభాళింపుతోనో
ఒక వాక్య విన్యాస
సౌందర్యం వల్లనో
మాటలనిర్మలప్రేమ
సౌకుమార్యం చేతనో
స్నేహభావార్థాలు పెనవేసుకు
పోతుంటాయి
భానుని
మబ్బుతమ్ముళ్లు
భూమిని
ఎప్పుడూ కాపలా కాస్తుంటాయెప్పుడు !
చుక్కలస్నేహితులు
అప్పుడప్పుడైనా
హలో !హలో ! అంటూ
చేస్తుంటాయి
చప్పుడు!
కిటికి రెక్క తెరిస్తే
గాలిస్పర్శ
గదిని
పులకికాంకితున్ని చేస్తుంది!
చేతులు చాస్తే చాలు!
నవ్వుతూ అంబాడుతున్న బుజ్జాయి అమాంతం
ఒళ్లోకి వాలుతాడు!
పరిశుద్ధమైన ఆత్మకు దిగులు లేదు
పరిశుభ్రమైన హృదయానికి
చావులేదు
****

కందుకూరి శ్రీరాములు సిద్ధిపేట జిల్లా రావురూకల గ్రామంలో జన్మించారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ఇబ్రహీంపట్నం డిగ్రీకాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నారు. 1995లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును గెలుచుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా కవిత్వం అల్లుతున్నారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు, సి.నా.రె. కవితా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం వంటి అనేక అవార్డులు అందుకున్నారు.
వీరి కవితా సంపుటులు: దివిటీ (1974), వయోలిన్ రాగమో వసంత మేఘమో (1994), సందర్భం (2001), కవ్వం (2002), దహన కావ్యం (2003), పీఠభూమి (2005), వెన్నెల బలపం (2008), రావురూకల (2009), తెలంగాణ రథం(2013), అలుకు పిడుచ (2014).
