
యాత్రాగీతం
బహామాస్
-డా||కె.గీత
భాగం-3
మయామీ నగర సందర్శన – విన్ వుడ్ వాల్స్
మర్నాడు రోజంతా మయామీ నగర సందర్శన చేసాం.
హోటలులోనే బ్రేక్ ఫాస్టు కానిచ్చి కాస్త స్థిమితంగా 11 గంటలకు బయలుదేరాం.
మయామీ డే టూరులో ఏవేం ఉంటాయో అవన్నీ మేం సొంతంగా తిరుగుతూ చూద్దామని నిర్ణయించుకున్నాం. ముందుగా చూడవలసిన మొదటి ప్రదేశం అని ఉన్న ట్రినిటీ కేథెడ్రల్ చర్చికి వెళ్లాం.
అయితే చర్చి మూసి ఉన్నందువల్ల బయట్నుంచే చూసి ఫోటోలు తీసుకుని అక్కణ్ణించి విన్ వుడ్ వాల్స్ (Wynwood Walls) సందర్శనకి వెళ్ళేం.
మయామీ నగర డౌన్ టౌన్ నించి చాలా దగ్గర్లో ఉంటుంది ఈ విన్ వుడ్ వాల్స్ అనే ప్రదేశం.
ఇక్కడ కనిపించే ప్రతి గోడా ఒక కళాకుడ్యమే.
గ్రఫిటీ కళాకారులు, యువ కళా కారులు, ప్రసిద్ధి చెందిన మ్యూరల్ (mural) ఆర్టిస్టులు ఒక్కరేవిటి అంతా ఒక్కచోట చేరారా అన్నంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ.
ఒక గొప్ప స్వేచ్ఛ తాండవిస్తూ ఉంటుంది.
ప్రత్యేకించి మధ్య ఉన్న పెద్ద ఆవరణలోని ఆర్ట్ ఎగ్జిబిషన్ తప్పక చూడవలసిందే.
ఒకప్పుడు అంటే 1970 ల ప్రాంతంలో ఈ ప్రదేశం సరుకులు భద్రపరిచే వేర్ హౌస్ ల నిలయమట. 2000 వ సంవత్సరంలో టోనీ గోల్డ్మన్ అనే కళాకారుడికి ఇక్కడ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ గ్యాలరీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అయితే ఆయన బాగా డబ్బున్న వ్యాపారస్తుడు కూడా కావడంతో ఆలోచన వెంటనే కార్యరూపం దాల్చింది.
దాదాపు 2010 నాటికి ఈ ప్రదేశం ఒక కళాత్మక నిలయం అయిపోయింది. స్వేచ్ఛని కోరుకునే ప్రతి కళాకారుడికీ ఆహ్వానం పలుకుతుంది ఈ ప్రదేశం.
నెలనెలా ఇక్కడ విభిన్నమైన ఆర్ట్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి.
ఇక్కడ ‘ఉమన్ ఆన్ ద వాల్స్’ ఆర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించిన జపనీస్ కళాకారిణి ఐకో, న్యూయార్క్ సబ్వే రైళ్లని కళామయం చేసిన ప్రఖ్యాత గ్రఫిటీ కళాకారిణి లేడీ పింక్, ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ లో సిద్ధహస్తురాలైన మాయా హయూక్ మొ.న వారి పెయింటింగ్స్ ని చూడొచ్చు.
ఇక్కడ ప్రపంచ వ్యాప్త కళాకారుల విభిన్నతని గమనించొచ్చు.
నెలలో ప్రతి రెండవ శనివారం ఇక్కడ ఆర్ట్ వాక్ జరుగుతుంది. రాత్రి పూట విందులు, చిందులతో ఇదొక పెద్ద వేడుక ఇక్కడ.
ఈ చుట్టుపక్కల విన్ వుడ్ వాల్స్ కి సంబంధించిన ఆర్ట్ లతో గిఫ్ట్ షాపులు, రెస్టారెంట్లు కూడా ఉంటాయి.
ఉదయం 11 గంటల నించి మాత్రమే తెరిచి ఉంటుంది ఈ ప్రాంతం.
కాలినడకన తిరుగుతూ దాదాపు రెండు, మూడు గంటల పాటు గడపగలిగిన ఒక గొప్ప అవుట్ డోర్ మ్యూజియం విన్ వుడ్ వాల్స్. ఇక్కడ గైడెడ్ టూర్స్ కూడా ఉంటాయి. నాకైతే మరో ప్రపంచంలోకి వెళ్లిన అత్యద్భుతమైన అనుభూతి కలిగింది.
****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
