యాదోంకి బారాత్-15

-వారాల ఆనంద్

          నా జీవితంలో 80 వ దశకంలోని మొదటి సంవత్సరాలు అంత్యంత ముఖ్యమయి నవి. వ్యక్తిగత జీవితంలోనూ సృజనాత్మక జీవితంలో కూడా. సాహిత్యమూ, ఉద్యమాలూ, అర్థవంతమయిన సినిమాలూ ఇట్లా అనేకమయిన విషయాలు నా జీవితంలోకి అప్పుడే వచ్చాయి. ముఖ్యంగా కళాత్మక సినిమాల గురించి నాకున్న “చిటికెడంత అవగాహన పిడికెడంత” కావడమూ అప్పుడే జరిగింది.

          కరీంనగర్ ఫిలిం సొసైటీ కార్యక్రమాలూ, వేములవాడలో ఫిలిం సొసైటీ స్థాపన, తర్వాత క్రమంగా సిరిసిల్లా, జగిత్యాల, హుజురాబాద్ లలో ఏర్పాటు ఇదే సమయంలో జరిగాయి. ఎన్నో మీటింగులు,సెమినార్లు, అనుభవాలు.

          నిజానికి అప్పటికి తెలుగులో సమాంతర సినిమా విస్తరించలేదు. కొన్ని విలక్షణ ప్రయత్నాలు మాత్రం జరిగాయి. బి.ఎస్.నారాయణ రూపొందించిన ‘నిమజ్జనం’, ఊరుమ్మడి బతుకులు’, గౌతం ఘోష్ ‘మా భూమి’, మృణాల్ సేన్ ‘ఒక ఊరికథ’, శ్యాం బెనెగల్ ‘అనుగ్రహం’ లాంటివి కొంత ముందూ వెనకా అప్పుడే వచ్చాయి. ఇక వాస్తవిక దోరణిలో టి.మాధవ రావు దర్శకత్వం వహించిన ‘చిల్లర దేవుళ్ళు’ లాంటి సినిమాలూ వచ్చాయి. వీటికి తోడు ఆ కాలంలోనే మిడిల్ సినిమాగా చెప్పుకునే కే.విశ్వనాథ్ సినిమా లు ( శంకరాభరణం, సిరివెన్నెల, సాగర సంగమం), ఇంకా బాపు సినిమాలు, మరో వైపు కే.బాలచందర్ సినిమాలు వచ్చాయి.

          వీటన్నింటి నేపధ్యంలో కరీంనగర్ జిల్లాలో భారతీయ ప్రధాన స్రవంతి సినిమాకు సమాంతరంగా వచ్చిన బెంగాలీ, మలయాళీ, కన్నడ తదితర భాషా చిత్రాల ప్రదర్శన, అధ్యయనం కోసం ఫిలిం సొసైటీలు పని చేయడం ప్రారంభించాయి, కేవలం దేశీయ చిత్రాలే కాకుండా బైసికిల్ థీవ్స్, రషోమాన్, లాంటి అంతర్జాతీయ సినిమాల్నీ అప్పుడే ఈ సొసైటీలు ప్రదర్శించాయి. కేవలం ప్రదర్శించడమే కాకుండా వాటి పైన చర్చలు, సెమినార్లు నిర్వహించాయి. వాటి నిర్వహణలో నేను ప్రధాన భూమికను పోషించడం నాకెంతో ఉపకరించింది.   

సెమినార్లు, సమావేశాలు:

వేములవాడ ఫిలిం సొసైటీలో మేము ప్రధానంగా నిర్వహించిన రెండు సమావేశాల గురించి ప్రస్తావిస్తాను. ఒకటి సుప్రసిద్ధ కవి కే.శివారెడ్డి గారితో జరిగింది. ప్రత్యూష సినిమా నిర్మాణంలో రచయితగా ఆయన పాలుపంచుకున్నారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీ జట్ల వెంకట స్వామి నాయుడు పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చదువుకుని వచ్చారు. సమాంతర ప్రయోగాత్మక సినిమా గురించి తనకు గొప్ప పట్టు అభినివేశమూ ఉండింది. నిజామాబాద్ కు చెందిన కొందరు యువకులు ముందుకు వచ్చి సినిమా నిర్మాణానికి ఉపక్రమించారు. ఆ జిల్లాలో పాదుకుని వున్న “జోగిని” ఆచారం పైన రూపొందిన ఆ సినిమా “ప్రత్యూష”. దానికి జట్ల దర్శకత్వ బాధ్యతను నిర్వహించారు. శివారెడ్డి రచనా సహకారంతో పాటు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు. వేములవాడలో మాకు అప్పటికే సాహిత్య పరంగా పరిచయం చనువు వున్న శివారెడ్డి గారిని ఫిలిం సొసైటీ కార్యక్రమానికి ఆహ్వానించాం. ప్రత్యూష సినిమా ప్రింట్ తన వద్ద వుంటే ఖైరతాబాద్ నుండి దాన్ని తీసుకొచ్చి గోకుల్ టాకీసులో వేశాం. ఉదయం ప్రదర్శన మధ్యాహ్నం గ్రామ పంచాయతి మీటింగ్ హాలులో సెమినార్. అప్పటి వేములవాడ సర్పంచ్ ప్రతాప చంద్ర మౌళి మాకు పూర్తి సహకారం అందించేవారు. సెమినార్తో పాటు కరీంనగర్ జిల్లా ఫిలిం సొసైటీల సమావేశం. అందులో కే.శివారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ప్రత్యూష సినిమా నేపధ్యం, నిజామాబాద్ యువకుల చొరవ, జోగిని వ్యవస్థ, దర్శకుడు జట్ల వెంకట స్వామి గురించి సవివరంగా గొప్ప చైతన్య వంతంగా మాట్లాడారు. నిర్దిష్ట, లక్ష్యం, నిబద్దత తో కృషిచేస్తే యువకులు చరిత్ర నిర్మించవచ్చునని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. వేములవాడ లాంటి మారుమూల సాహిత్య కార్యక్రమాలతో పాటు సమాంతర సినిమాల చర్చ జరగడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేసారు. ఇక ఆ రోజు పాల్గొన్న మరో అతిథి కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ జాతీయ అంతర్జాతీయ ఫిల్మ్ సొసైటీ ఉద్యమ నేపధ్యం, లక్ష్యాలను వివరించారు. గొప్ప చారిత్రక అధ్యయనంతో ఆయన మొత్తంగా ఫిలిం సొసైటీ ఉద్యమ రూపము, కర్తవ్యమూ వివరించారు. సిరిసిల్ల, జగిత్యాల కరీంనగర్ తదితర ప్రాంతాల నుండి వచ్చిన ప్రతినిధులకు మంచి ప్రేరణా త్మక సమావేశం అది. అందులో కిరణ్, రవీంద్ర, నగుబోతు ప్రభాకర్, నల్ల ప్రభాకర్, సిరి సిల్ల రుద్ర రవి, ఫసి, జగిత్యాల లక్ష్మీకాంత్ ఇట్లా ఎందరో పాల్గొన్నారు. 

          ఇక రెండవ సందర్భం బి.నరసింగ రావు ‘రంగుల కల’ నిర్మాణ సమయం. 9 అక్టోబర్ 1983  వేములవాడ ఫిలిం సొసైటీ ద్వితీయ వార్షికోత్సవ సందర్బం. అతిథిగా బి.నరసింగ రావుని పిలవాలని నిర్ణయించుకున్నాం. ఆయన అప్పటికే ‘మా భూమి’ నిర్మాతగా కళాకారుడిగా చాలా పాపులర్. అంతే కాకుండా ‘రంగుల కల’ అన్న సినిమా తీస్తున్నారు. దానికి దర్శకత్వ బాధ్యతతో పాటు హీరోగా కూడా చేస్తున్నారు. రూప హీరోయిన్. మా భూమి అప్పటికి ఉత్తర తెలంగాణా జిల్లాల్లో గొప్ప ఊపున్న సినిమా. ఇంకే ముంది నేను హైదరాబాద్ వెళ్ళి ఆయన్ని కలిసాను. వేములవాడ రావడానికి అంగీక రించారు. ఏర్పాట్లు మొదలు పెట్టాం. ఏవో అనివార్య కారణాల వలన కార్యక్రమం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేనే మళ్ళీ వెళ్ళాను. ఉదయమే సికింద్రా బాద్ ఆదయ్య నగర్ లో వున్న వాళ్ళ ఆఫీసుకు చేరుకున్నాను. నరసింగ రావు గారికి విషయం చేప్పాను. ‘మీకు సమయం ఇచ్చాను ఉపయోగించుకోలేక పోయారు. ఇంకో తేదీ నాకు సాధ్యం కాదు. నాకూ సినిమా పనులున్నాయి’ అన్నారు. నేను హతాశున్ని అయ్యాను. ఆయన్ని ఎట్లా ఒప్పించాలో తెలీని స్థితి. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన దేవిప్రియ కలగ జేసుకున్నాడు. దేవిప్రియకు నేనూ జింబో వేములవాడ అప్పటి కే బాగా తెలుసు. నర్సింగ్ అట్ల అనొద్దు. మారుమూల గ్రామంలో ఫిలిం క్లబ్ పెట్టి పిలిచి నప్పుడు వెళ్ళాలి. వీలుజేసుకోవాలి అని సర్ది చెప్పారు. నాకు ధైర్యం వచ్చింది. నేనూ రిక్వెస్ట్ చేసాను. నరింగ రావు అంగీకరించారు. నాతో పాటు మిత్రులూ వస్తారు అన్నాడు. అంతకంటేనా అన్నాను. ఫిలిం సొసైటీ జర్నల్ “చయనిక” లో వేయడానికి ‘రంగులకల’ స్టిల్స్ కు చెందిన “బ్లాకులు” తీసుకున్నాను. అప్పటికి ఆఫ్సెట్ ప్రింటింగ్ లేదు. ఫోటోలు అచ్చు వేయడానికి బ్లాకులే దిక్కు. తిరిగి అందజేయాలనే కండీషన్ మీద బ్లాకులు తీసుకుని బతుకు జీవుడా అంటూ తిరుగు ప్రయాణ మయ్యాను. ఆ నాటి కార్యక్రమానికి  బి.నరసింగ రావు, ప్రముఖ చిత్రకారుడు వైకుంఠం, సుదర్శన్, ఉప్పల నరసింహం పాల్గొన్నారు. వైకుంఠం గారిది వేములవాడ పక్కనే వున్న బూర్గుపల్లి గ్రామం. వేముల వాడలో ఆయనకు బందువులు మిత్రులు వున్నారు. నాస్తాల్జిక్ అయిపోయారు. ఆ రోజున ఉదయం టాకీసులో సభ తర్వాత ఎప్పటిలాగే గ్రామ పంచాయత్ మీటింగ్ హాలులో సెమినార్. ఘనంగా జరిగిన సెమినార్ లో బి.నరసింగరావు అంతర్జాతీయ సినిమా నుంచి మొదలు ప్రాంతీయ సినిమా దాకా అనేక విషయాల్ని సవివరంగా వివరించి ఉత్తేజ పరిచారు. జిల్లా అన్ని ప్రాంతాల నుంచీ ఫిలిం సొసైటీ కార్యకర్తలు కవులూ కళాకారులూ హాజరయ్యారు. అందరికీ, ముఖ్యంగా నాకు, అదొక చైతన్య సందర్భం. అంతమంది గొప్ప వాళ్ళతో వేములవాడ వీధుల్లో తిరగడం, నటరాజ్ హోటల్లో చాయ్ తాగడం ఇన్నేళ్ళ తర్వాత ఇప్పటికీ తాజా అనుభవంగానే వుంది. ‘చయనిక’ లో ఫోటోలు వేయడం వ్యాసం రాయడం గెస్ట్ లకూ నచ్చింది.

***

          ఇక నాకూ నాతో పాటు జిల్లాలోని అనేక మంది ఫిలిం లవర్స్ కి EYE OPENER అన దగ్గ కార్యక్రమం ఫిలిం అప్రిసియేషన్ కోర్సు. కరీంనగర్ ఫిలిం సొసైటీ (9,10 ఏప్రిల్ 1983) రెండు రోజుల పాటు ఈ కోర్సుని మున్సిపల్ ఆడిటోరియం ‘కళాభారతి’ లో నిర్వహిం చింది. జిల్లా వ్యాప్తంగా వున్న కళాకారులు కళాభిమానులు హాజరయ్యారు. అప్పుడు కరీంనగర్ ఫిలిం  సొసైటీ అంటే దాని అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, కార్యదర్శి రేణికుంట రాములు, డి.నరసింహా రావు, ఉప్పల రామేశంలు నాల్గుదిక్కులా నిలబడి నడిపే దిశా నిర్దేశకులు. నేను పీ.ఎస్. రవీంద్ర, ఇట్టేడు కిరణ్ వేములవాడ నుంచి, రుద్ర రవి, ఫసి, ముత్యం రెడ్డి సిరిసిల్లా నుంచి, ఆవునూరి సమ్మయ్య తదితరులు హుజురాబాద్ నుంచి, ఎన్.లక్ష్మీకాంత్ జగిత్యాల నుంచి ఇంకా అనేక మంది హాజరయ్యాం. కొడం పవన్, జూకంటి జగన్నాథం, నిజాం వెంకటేశం కూడా హాజరయ్యారు. అప్పుడు కరీంనగర్ ఫిలిం సొసైటీ గౌరవ అధ్యక్షుడిగా వున్న కలెక్టర్ ఆర్.చంద్రశేఖర్ అద్బుతమయిన సహకారం అందించారు. పూర్వ అధ్యక్షుడు అంపశయ్య నవీన్, కే.సాయి రెడ్డి తదితరులు కూడా సహకిరించిన వారిలో వున్నారు. ఫిలిం అప్రిసియేషన్ కోర్సు ను 8 ఏప్రిల్ శుక్రవారం జిల్లా పరిషద్ మీటింగ్ హాలులో సుప్రసిద్ధ దర్శకుడు, కెమెరామన్ శ్రీ నిమాయి ఘోష్ ప్రారం భించారు. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యుట్ లో అధ్యాపకులుగా వున్న శ్రీనివాసన్, రమణన్ లు కోర్సులో బోధించడానికి వచ్చారు. ఆ ముగ్గురూ దాదాపు నలభై సంవత్సరాల క్రితం రైలులో ఖాజీపేట్ వచ్చి అక్కడి నుండి కరీంనగర్ చేరుకున్నారు. ఎక్కడి మద్రాస్, ఎక్కడి రైలు స్టేషన్ కూడా లేని కరీంనగర్. ఎంత శ్రమ తీసుకున్నారో. వారి నిబద్దతకు సలాం చేయాల్సిందే. నిమాయి ఘోష్ ను చూడడం ఒక అనుభూతి. ఆయన సత్యజిత్ రే తో కలిసి పని చేసారు. ‘చిన్నమ్మూల్” సినిమాని రూపొందించారు. ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం సొసైటీస్ కి దక్షిణ భారత ఉపాధ్యక్షుడిగా వున్నారు. ఆయన ఆ రోజు చేసిన ప్రారంభోప న్యాసం రికార్డ్ చేయదగినది. అసలు సినిమా అంటే ఏమిటి దృశ్య ప్రధానమయిభావాల్ని ఎంత ప్రతిభావంతంగా ఆవిష్కరిస్తుందో ఆయన వివరంగా చెప్పారు. హాలంతా పిన్ డ్రాప్ సైలెన్స్.  

          ఇక తర్వాతి రెండు రోజులూ కళాభారతిలో శ్రీనివాసన్, రమణన్ ల సినిమా ఫిలిం అప్రిసియేషన్ కోర్సు క్లాసులు. పూనా ఫిలిం ఆర్కైవ్ నుంచి తెప్పించిన 16mm ఫిలిమ్స్ ను ప్రదర్శిస్తూ వారిచ్చిన క్లాసులు ఎంతో గొప్పవి. అసలు సినిమాలో 24 ఫ్రేమ్స్ అంటే ఏమిటి, స్క్రీన్ప్లే అంటే ఏమిటి ఎట్లా రాస్తారు, దృశ్యాన్ని ఎట్లా కన్సీవ్ చేస్తారు ఇట్లా ఒకటేమిటి ‘పతేర్ పాంచాలి’, ‘రాషోమాన్’, ఒక్కో సినిమా క్లిప్స్ గా చూపిస్తూ వారు చెప్పిన అంశాలు నాకయితే మనసులో నిలిచిపోయాయి. అంతర్జాతీయ స్థాయిలో సినిమాను శ్రీనివాసన్ విశ్లేషించిన తీరు చిరస్మరనీయమయింది.

          రెండవ రోజు సాయంత్రం ఫిలిం అప్రిసియేషన్ కోర్సు ముగింపు సమావేశంలో కలెక్టర్ ఆర్.చంద్ర శేకర్ అతిథిగా హాజరయి కోర్సులో హాజరయిన వారందరికీ సర్టిఫికేట్స్ ప్రధానంచేసారు.

          అట్లా ఆ ఫిలిం అప్రిసియేషన్ కోర్సు అందరి మదిలో నిలిచి పోయింది. నాకయితే అర్థవంతమయిన సినిమాల్ని చూడడానికీ, అధ్యయనం చేయడానికీ ఎంతో కొంత విశ్లేషిస్తూ రాయడానికీ పునాది వేసింది. అందుకు నిమాయి ఘోష్, శ్రీనివాసన్, రమణన్ లకు రుణపడి  వున్నాను. ఇంకా మా మిత్రుడు నరేడ్ల శ్రీనివాస్ కి మనసారా కృతజ్ఞతలు.

***

ఫిలిం సొసైటీ- ఫిలిం ప్రింట్స్-ప్రదర్శనలు

‘గుజ్రే జమానా యాద్  ఆతీ హై

దర్ద్ పురానా యాద్ ఆతీ హై’…ఎక్కడో చదివిన గుర్తు.

          నిజమే యాదొంకీ బారాత్ అనుకున్నప్పటి నుండి ఎన్నో అనుభవాలు. ఎన్నో సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. కాలక్రమంలో అనుభవాలు జ్ఞాపకాలవుతాయి. జ్ఞాపకాలు చరిత్రగా మిగులుతాయి. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్ని మార్పులు ఎన్ని పరిణా మాలు. వరుసగా కాకున్నా అన్నీ దాదాపుగా గుర్తుకొస్తున్నాయి. అందులో ఫిలిం సొసైటీ కార్యక్రమాలల్లో తల మునకలయి వున్న కాలం నాటి అనుభవాలు సినిమా రీలులాగా మదిలో తిరుగుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ సినిమాల నిర్మాణం, ప్రదర్శనా రంగాల్లో వచ్చిన మార్పుని నా అనుభవంలోంచి చూస్తూ ఇది రాస్తున్నాను…

***

          జమానా బహుత్ బాదల్ గయా… సినిమాల్లో 16mm.,35mm, cinema scope, 70mm రీళ్ళు పోయి floppy, cd, dvd  కాలం పోయి డిజిటల్ యుగం వచ్చింది. సింగిల్ స్క్రీన్ లు పోయి మల్టీ ప్లెక్ష్ లు వచ్చాయి. ఎనభైయ్యవ దశకం మొదట్లో ఫిలిం సొసైటీ నడపాలన్నా ఒక మంచి సినిమా ప్రదర్శించాలన్నా గగనం అయ్యేది. మొదట మంచి సినిమాను ఎంపిక చేయాలి. దానికి ఇవ్వాల్టిలాగా విస్త్రుత సమాచార వ్యవస్థ లేదు. కేవలం సినిమా పత్రికలూ వాటిల్లో ‘స్క్రీన్’ లాంటి ఇంగ్లీష్ వారపత్రికల పైన ఆధారపడేది. తర్వాత ఆ సినిమా సోర్స్ వెతకడం. సికిందరాబాద్ ఆర్పీ రోడ్ లోని సినిమా పంపిణీ అఫీసుల చుట్టూ తిరిగేది. వాటిల్లో ముఖ్యంగా నవయుగ, కపూర్ చంద్, రాజశ్రీ పిక్చర్స్ లాంటి వాటిల్లో కొన్ని సినిమాలు దొరికేవి. కొన్నింటిని ఆయా సినిమా నిర్మాతలు దర్శకులను సంప్ర దించేవాళ్ళం. ఫోన్లు కూడా విరివిగా లేని కాలమది. ఇంకా కొన్నిసినిమాలకు మద్రాస్ లోని సొవెక్ష్ పోర్ట్ (SOVEXPORT) లేదా చిల్ద్రెన్ ఫిలిం సొసైటీ, బాంబేలోని ఎన్.ఎఫ్.డీ.సి, పూనా లోని ఫిలిం ఆర్కైవ్ మాత్రం సినిమాలకు ఆధారం. వాళ్ళను సంప్రదించడానికి ఉత్తరాలు రాసి ఎదురుచూడాల్సి వచ్చేది. ఫిలిం బుక్ చేసి ప్రదర్శించే దాకా టెన్షన్. సమయానికి బాక్స్ వస్తుందా లేదా లాంటి టెన్షన్స్ వుండేవి. ఇంత కష్టపడి సినిమాల్ని వేస్తే చూసేందుకు సభ్యులు మాత్రం సిద్దంగా వుండేవాళ్ళు. ఆదివారం ఉదయమే 8 గంటల షోకు జనం బారులు తీరేవాళ్ళు. ఈ సందర్భంగా ఒక  అనుభావాన్ని మీతో  పంచుకుంటాను.“డెర్సు ఉజాలా’ గొప్ప సినిమా అని ఎక్కడో చదివాను.’రషోమాన్’ తీసిన అకిరా కురుసోవా రూపొందించిన సినిమా అది. దాన్ని వేములవాడ ఫిలిం సొసైటీలో ప్రదర్శించాలని నిర్ణయించాము. మద్రాస్ కు లెటర్ రాసి బుక్చేసాం. సినిమా ప్రదర్శన ప్రకటించాం. శుక్రవారం సాయంత్రానికి బాక్స్ వేములవాడ చేరింది. టాకీసు కాబిన్లో ఆపరేటర్ ప్రింట్ చెక్ చేసి చావు కబురు చల్లగా చెప్పాడు. సర్ అది సినిమా స్కోప్ పిక్చర్. మన దగ్గర స్కోప్ లెన్స్ లేదు అని. మరెట్లా? కరీంనగర్ వెంకటేశ్వరలో వుంది అని చెప్పాడు. నేను అక్కడి మేనేజర్ తో మాట్లాడితే సర్ ఇంకేమయినా అడగండి లెన్సులు మాత్రం ఇవ్వలేము అన్నాడు. ఏముంది శనివారం వచ్చేసింది. ఆదివారం షో రద్దు చేయాల్సిందేనా .. కిరణ్ రవి నేనూ సందిగ్ధంలో పడ్డాం. సినిమా రద్దు కావడం ఇజ్జత్ కా సవాల్ అంటాడు కిరణ్. మరెట్లా..ఇంతలో సిరిసిల్లా రుద్ర రవి నుండి సమాచారం. ఎల్లా రెడ్డి పేట టాకీసులో సినిమా స్కోప్ ఫిలిం ఆడుతోంది అక్కడ ట్రై చేయమని. ఆ వూరు వెళ్ళాలి. అప్పుడు ఎడ్ల మహేష్ ఇంకొకరిని తీసుకుని రాజ్ దూత్ బైక్ పైన వెళ్ళాడు. ఎట్లా ఒప్పించాడో ఏమి చేసాడో కాని లెన్స్ తీసుకొచ్చాడు. అమ్మయ్య అనుకున్నాం. అట్లా అష్ట కష్టాలు పడి ఆదివారం ఉదయం సినిమా వేశాము. సభ్యులు ఉత్సాహంగా వచ్చారు. కాని చిత్రంగా ఆ సినిమా ఎవరికీ నచ్చలేదు. మరో రకంగా చెప్పాలంటే దాదాపు ఎవరికీ అర్థం కాలేదు. నిర్వాహకులుగా ఉసూరుమన్నాం. అంత కష్టపడి వేసిన సినిమా ఎవరికీ నచ్చక పోవడం బాధ అనిపించింది.

          ఇక మరో అనుభవం “మృగయా” సీరియస్ సినిమా- సరదా అనుభవం. ఓ గమ్మత్త యిన అనుభవమిది. ప్రదర్శనకు ముందు రోజు బాక్స్ తో  బస్సు నేరుగా రాత్రి పది గంటలకల్లా వేములవాడకు వచ్చింది. అప్పటి వరకు టెంపుల్ ముందు ఎదురుచూసి నేనూ రవీంద్ర బాక్స్ బస్సు మీది నుంచి దించి శివరామకృష్ణ టాకీస్ కి పంపించి, శ్రీ రాములు హోటల్ లో టీ తాగి ఇల్లు చేరుకున్నాం. అప్పుడు మామయ్యా వాళ్ళ ఇంట్లో లాండ్ ఫోన్ వుండేది. ఉదయం ఏడుగంటలకే ఆపరేటర్ ఫోన్ చేసాడు. రాత్రి బాక్స్ వచ్చింది సార్ కాని ‘మేరిగాయ్’ అని ఎదో ఆవు సినిమా బాక్స్ వచ్చింది. మీరేమో మరిం కేదో సినిమా అన్నారు. అంతే గుండెల్లో రాయి పడింది ప్రింట్ ఏమయినా మిస్ప్లేస్ అయిందా, సమయానికి సభ్యులు వస్తారు ఏమని ఎట్లా  చెప్పాలి… కంగారు కంగారుగా నేనూ రవీంద్ర కిరణ్ టాకీస్ కి ఆఘ మేఘాల మీద చేరుకున్నాం. తీరా చూస్తె బాక్స్ మీద ఇంగ్లిష్ లో ‘ MRIGAYA’ అని రాసి వుంది. ఆపరేటర్ కు వచ్చిన ఇంగ్లిష్ కి మేము బలి. ఎంతో టెన్షన్ పడ్డవాళ్ళం గొప్ప రిలీఫ్ గా ఫీల్ అయ్యాం. బయటకెళ్ళి టీ తాగుతూ పది నిముషాలు పడీ పడీ నవ్వుకున్నాం. తర్వాత ‘మృగయా’ అందరికీ నచ్చింది.

          ఇక మరో అనుభవం ‘ప్రత్యూష’. ఆ సినిమా బాక్స్ కోసం నేను ప్రత్యేకంగా హైదరా బాద్ వెళ్ళి ఖైరతాబాద్లో ఉంటున్న శివారెడ్డి గారి ఇంటి నుండి తీసుకొచ్చి గోకుల్ సినిమా లో ప్రదర్శించాం. ఆ తర్వాత నెల పాటు ప్రింటు మా వద్దే వుండి పోయింది. ఒక రోజు శివారెడ్డి గారి నుంచి లాండ్ లైన్ కు కాల్. ఏమిటి ప్రింటు పంపరా అని. ఇక ఏముంది ఆఘమేఘాల మీద మధ్యాహ్నం బస్సు టాప్ పైన ఫిలిం బాక్స్ వేసుకుని హైదరాబాద్ బయలుదేరాను. అపుడు బస్సులు కామారెడ్డి మీదుగా వెళ్ళేవి. ఎల్లారెడ్డిపేట్ దాటుతూ వుండగా రోడ్డు మీది నించి ఏవో అరుపులు విని డ్రైవర్ బస్సును ఆపాడు. పైన బాక్స్ ఎగిరిపోతున్నదని  అరుస్తూ చేప్పాడా బాటసారి, పైన బాక్స్ ఎవరిదయ్యా అని డ్రైవర్ అరుపు. నా పై ప్రాణం పైనే పోయింది అసలు ప్రింట్ ఉందా లేదా ఎక్కడయినా పడి పోయిందా. గబా గబా దిగి బస్సు వెనకాల మెట్లు ఎక్కి చూస్తే ఏముంది బాక్స్ మూత ఎగిరి పోయివుంది అమ్మయ్య ప్రింట్ వుంది. అప్పటికప్పుడు వైరో తాడో కట్టి కిందికి దిగి వచ్చాను. జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ అంతా సానుభూతి సందేశాలిచ్చారు. మౌనంగా అంతా భరించి సికిందరాబాద్ రాష్త్రపతి రోడ్డులో దిగి ఖైరతాబాద్లో శివారెడ్డి గారి ఇంట్లో ప్రత్యూష బాక్స్ ను దిగ బెట్టి. బతుకు జీవుడా అంటూ కరీంనగర్ బసేక్కాను. అది ఒక జ్ఞాపకం. ఇట్లా అనేక అనుభవాలు అప్పటికి టెన్షన్లకు గురయినప్పటికీ తర్వాత అవన్నీ మదురమయిన అనుభవాలుగా. మిగిలిపోయాయి. దానికి తోడు సినిమాలు చూసేందుకు సభ్యులు ఆనందంగా వచ్చే వాళ్ళు. సినిమా మంచీ చెడ్డా మాట్లాడేవాళ్ళు. ఎంతో ఆనందం కలిగేది.

          కరీంనగర్ ఫిలిం సొసైటీకి సంబంధించి మరో అనుభవం. 1982లో ‘GOLDEN JUBILEE OF INDIAN TALKEE’ నిర్వహించాలనుకున్నారు. అప్పుడు నరేడ్ల శ్రీనివాస్ అధ్యక్షుడు. ఏముంది మొదటి సినిమా ‘రైతుబిడ్డ’ వేయాలనుకున్నారు. ఆర్కైవ్ కి రాస్తే ప్రింట్ ఇస్తాము కానీ ఎవరయినా ఒకరు వ్యక్తిగతంగా వచ్చి తీసుకెళ్ళాలి అన్నారు. అంతే కాదు ప్రింట్ తో పాటు మా వ్యక్తీ వస్తాడు. అతని ప్రయాణ వసతి సౌకర్యాలు భరించాలి అని కండీషన్ పెట్టారు. గోల్డెన్ జూబిలీ చేయాలనుకున్నారు. వాళ్ళ రూల్స్ అంగీకరిం చారు. కఫిసో నుంచి శ్రీ ఉప్పల రామేశం పూనా వెళ్ళి ప్రింట్ తీసుకొచ్చారు. అట్లా ఒక సినిమా ప్రదర్శన కోసం అన్నితిప్పలు పడాల్సి వచ్చేది. అయినా ఉద్యమస్ఫూర్తితో కార్యకర్తలు పనిచేసారు. తరువాత ఎప్పుడో ఫిలిం ఫెస్టివల్ లో ఆర్కైవ్ డైరెక్టర్ కీ.శే.పీ.కే. నాయర్ గారు కలిసినప్పుడు ఫిలిం కోసం పడ్డ కష్టాలు చెప్పి ఆర్కైవ్లో అన్ని రూల్స్ ఎందుకు అని అడిగాను. ఆయన నవ్వి పూనాలో వున్న ప్రింట్ తీసుకు వెళ్ళడానికే ఇంత కష్టమనుకుంటే వాటిని సేకరించి బద్రపరిచి భవిష్యత్తు తరాల కోసం వుంచడం ఎంత కష్టం అన్నారు. నిజమే కదా అనిపించింది. ఆయనకు సారీ చెప్పాను. ఆయన చేసిన కృషికి అభినందనలు అందజేసాను. సినిమాల సేకరణ ప్రదర్శనకు అంత కష్టకాలం అయినా అప్పుడు చూసే సభ్యులు ఎక్కువగా వుండే వాళ్ళు. ఎంతో సంతోషంగా వుండేది. ఒక ఉద్యమంలో భాగస్వాములము అయ్యాం అన్న ఆనందం వుండేది. కానీ ఇవ్వాళ క్లాసిక్స్ నుంచి మొదలు కొత్త సినిమాల దాకా అనీ ఆన్లైన్ లో అందుబాటులోవున్నా చూసే సభ్యులు కరువయారు. అది అత్యంత విషాదం.

***

          ఇక అప్పుడు ఫిల్మ్ సోసైటీ సినిమాల ప్రదర్శనలకు సభ్యులు అనేక మంది క్రమం తప్పకుండా హాజరయ్యే వారు. అందులో సాధారణ ప్రేక్షకులూ వుండేవాళ్ళు. కానీ ఎప్పుడయితే దూరదర్శన్లో రామాయణ భారతాలు సీరియల్లుగా ప్రసారం కావడం మొదలయిందో ఇక అప్పటి నుండి సభ్యుల హాజరీ తగ్గడం మొదలయింది. ఉత్తమ సినిమాల పట్ల ఆసక్తి వున్న వాళ్ళు తప్ప సాధారణ సభ్యుల రాక చాలా వరకు తగ్గ సాగింది. అప్పుడు సొసైటీ సభ్యులని కాదు కానీ కొంతమందయితే ఆదివారాలు ఉదయమే స్నాన పాణాదులు కానిచ్చి టీవీల ముందు కూర్చోవడం నాకు తెలుసు.

          అట్లా తగ్గుతున్న సభ్యుల సంఖ్య హాజరీల ఫలితంగా వేములవాడ, సిరిసిల్లా లాంటి చోట్ల ఫిలిం సొసైటీలు మూతపడ్డాయి. సాయంత్రం సినిమాల్ని ప్రదర్శించే హాల్స్ వున్న మెట్రో నగరాలు, కరీంనగర్ లాంటి నిబద్దత కల కార్యకర్తలు వున్న చోట మాత్రమే ఫిలిం సొసైటీలు తమ మనుగడను నిలుపుకున్నాయి. ఫెస్టివల్స్, సేమినార్స్ నిర్వహిస్తూ తమ వంతు అర్థవంతమయిన సినిమాలని ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చాయి..

ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను….

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.