మా అమ్మ విజేత-2

– దామరాజు నాగలక్ష్మి

అమ్మాజీ సంవత్సరం పాప అయ్యింది. నడక, మాటలు అన్నీ బాగా వస్తున్నాయి. అందరికీ చాలా కాలక్షేపం.

వీలక్ష్మిగారు మెలికలు తిరిగిపోతున్న సుందరిని చూసి – “సుందరీ… ఏమయ్యిందమ్మా…” అనుకుంటూ కంగారు పడిపోయి చుట్టు పక్కల అందరినీ పిలుచుకు వచ్చింది.

ఎవరో వెళ్ళి ఊరందరికీ నమ్మకంగా వైద్యం చేసే శాస్త్రి గారిని పిలుచుకు వచ్చారు. శాస్త్రిగారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఏవేవో కషాయాలు ఇచ్చారు. ప్రతిదీ సుందరి వాంతి చేసేసుకుంటోంది.  ఉన్నట్లుండి – “అమ్మా… ” అని అరిచి కళ్ళు తిరిగి పడిపోయింది.  శాస్త్రిగారు నాడి చూసి తల దించుకున్నారు.

ఊరందరినీ దుఃఖంలో ముంచి సుందరి వెళ్ళిపోయింది.

అమ్మాజీ… “అమ్మా… లే… లే…” అంటూ లేపుతోంది.

వీరలక్ష్మిగారు – “అమ్మ దేవుడి దగ్గిరకి వెళ్ళింది. మళ్ళీ వస్తుంది. నువ్వు దా… పాలు తాగుదువుగాని”  అని పక్క రూములోకి వెళ్ళిపోయింది.

ఎవ్వరికీ దుఃఖం ఆగట్లేదు. అందరూ ఒకటే మాట అమ్మాజీ తల్లిలేని పిల్లయిపోయిందని.

సుందరి ముత్తయిదువుగా పోవడంతో కార్యక్రమాలన్నీ సక్రమంగా చేయించారు. ఇక పాప ఆలనా పాలనా చూడాలంటే చాలా కష్టం. వీరలక్ష్మిగారు కోడలు పోయేసరికి కుంగిపోయారు.  సుబ్బారావు బాధ అసలు చెప్పక్కరలేదు. ఒక మూల కూచుని బాధపడుతున్నాడు.

వీరభద్రయ్యగారు “అమ్మా… వీరలక్ష్మిగారూ… అమ్మాజీని మేము పెంచుతాం. మా ఇంట్లో పదిమందిమి ఉన్నాం కాబట్టి పాప కూడా అమ్మని మర్చిపోగలుగుతుంది. మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి”  అని అమ్మాజీని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళిపోయారు.

వీరభద్రయ్యగారు ఇంట్లోకి వెడుతూనే… సావిత్రీ… ఇలా రా… అమ్మాజీకి కొంచెం అన్నం పెట్టు. వీరభద్రమ్మగారింట్లో అస్సలు ఏమీ తినలేదుట” అంటూ సావిత్రి చేతికి అందించారు. అప్పటికే సావిత్రికి 5 గురు మగపిల్లలు. అందరూ చిన్న చిన్నవాళ్ళు. మేనమామగా అమ్మాజీ అంటే ఎంత ప్రేమో… సావిత్రికి తెలుసు కాబట్టి భర్తమాటకి అడ్డుచెప్పలేదు.

“ఏదిరా… నా కన్నతల్లి ఏది… నా బంగారు తల్లి ఏదీ… నోరు పట్టు ఆ ఆ ఆ ఆమ్. అదిగో కాకి చూశావా… ఒరేయ్ శర్మా ఇటురండిరా…. పాపకి అన్నం పెడుతున్నాను. ఇక్కడ కూచోండి… ” అని పిల్లలందరినీ పోగేసి అమ్మాజీకి అన్నం తినిపించింది.

చాలా తొందరగా అమ్మాజీ పిల్లలందరితో కలిసిపోయింది. దగ్గిరలో వున్న పెద్దమ్మ, పెదనాన్న కూడా అమ్మాజీని వాళ్ళింటికి తీసుకెళ్ళేవారు.  పెద్దమ్మ కూతురు సీతమ్మ అంటే అమ్మాజీకి చాలా ఇష్టం.

“సీతక్కా…. సీతక్కా….” అంటూ వెంట తిరుగుతుంటే… సీత పెరట్లో ఉన్న మామిడి చెట్టుకి ఉయ్యాల కట్టి అందులో కూచోపెట్టి ఊపుతుండేది. సుబ్బారావు వాళ్ళు దగ్గరలోనే వుంటారు కాబట్టి రోజూ వచ్చి అమ్మాజీని చూసి వెడుతుండేవాడు.

అమ్మాజీకి ఐదవ సంవత్సరం వచ్చింది. పిల్లలందరితో కలిసి స్కూలుకి వెడుతోంది. చిన్న వూరు కాబట్టి స్కూల్లో టీచర్లు కూడా అమ్మాజీని  జాగర్తగా చూసుకునేవారు.

“అమ్మాజీ… నువ్వు అ, ఆ లు అన్నీ రాసుకుని రా…. రేపటి నుంచీ గుణింతాలు చెప్తాను” అన్నారు సోమయ్య మేష్టారు.

“నాకు అన్నీ వచ్చేశాయి. నేను రేపు రాయను. ఇప్పుడే రాస్తాను” అని అన్నీ రాసి చూపించింది.

“బావుంది. చాలా బాగా రాశావు. ఇలాగే రాస్తే నువ్వు పెద్దయ్యాక బాగా చదువుకుంటావు” అన్నారు సోమయ్య మేష్టారు.

సోమయ్య మేష్టారు అమ్మాజీని దగ్గిర కూచోబెట్టుకుని అన్నీ నేర్పించేవారు. ఒకటో తరగతిలోనే తెలుగు చదవడం, రాయడం అన్నీ నేర్చేసుకుంది.

ఒకరోజు పెద్ద వర్షం వస్తోంది. అమ్మాజీ నీళ్ళలో పరుగులు పెట్టుకుంటూ వెడుతుంటే… “అమ్మాజీ… పడిపోతావ్. వుండు నేను వస్తున్నాను” అంటూ ఒక చేత్తో కర్ర పట్టుకుని సోమయ్యగారు వస్తుంటే… తనని కొట్టడానికి వస్తున్నారు అనుకుని ఇంకా రయ్ మని పరుగెత్తింది.

చిన్న పిల్ల అలా వెడుతుంటే హడావుడి పడిన సోమయ్యగారు బురదలో కాలుజారి పడ్డారు. ఒక్కసారి వెనక్కి చూసిన అమ్మాజీ భయంతో రెండురోజులు స్కూలుకి వెళ్ళలేదు.

మూడోరోజు సోమయ్యగారు వీరభద్రయ్యగారి ఇంటికి వెళ్ళి తలుపు వెనక నుంచీ నక్కి నక్కి చూస్తున్న అమ్మాజీని “అమ్మాజీ… ఇటురా… నాకేం దెబ్బతగల్లేదు. నువ్వలా స్కూలుకి రాకపోతే… నీకు చదువు రావాలికదా… పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి” అని దగ్గరికి తీసుకుని ముద్దుపెట్టుకున్నారు.

అమ్మాజీకి భయం పోయింది. రోజూ స్కూలుకి వెడుతోంది. సుబ్బారావు పెద్దబాలశిక్ష కొనిచ్చాడు కూతురికి.

“నాన్నా… నీకు తెలుసా… నేను అన్నీ చదివేస్తున్నాను. నాకు ఇంకా చాలా పుస్తకాలు కావాలి. నేను పేద్ద స్కూలుకి వెడతాను. సోమయ్య మేష్టారు నాకు అన్నీ నేర్పేస్తున్నారు” అని ముద్దు ముద్దుగా చెప్పింది.

“అలాగే తల్లీ… నేను నువ్వు పెద్ద స్కూల్లో చేరుదువుగాని. బాగా చదువుకో… నీకు ఏం కావాలంటే అది కొనిస్తాను” అని కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయాడు.  వెళ్ళిపోతున్న నాన్నని అలా చూస్తూ నుంచుండిపోయింది.

అమ్మాజీ 4వ తరగతి మంచి మార్కులతో పాసయ్యింది. ఎప్పుడూ చదువులో ముందరే వుండేది. ఐదోతరగతి కూడా చదువుతానని చెప్పింది. మామయ్యలు ముగ్గురూ, అత్తయ్యలు ఏమీ అడ్డు చెప్పలేదు.  వీళ్ళందరికీ అమ్మాజీ అంటే అంతులేని ప్రేమ.

వేసవి శలవులు అయిపోయాయి. సంచీలో కొత్త పుస్తకాలు పెట్టుకుని సంతోషంగా స్కూలుకి వెళ్ళింది అమ్మాజీ…. ఊరంతా చుట్టాలే అవడంతో… వాళ్ళే స్నేహితులు, వాళ్ళే అక్కలు, చెల్లెళ్ళు.

సుబ్బారావు వాళ్ళమ్మ వీరలక్ష్మిగారు ఒకరోజు వచ్చి, “వీరభద్రంగారూ సుబ్బారావుకి పెళ్ళి కుదిరింది. అమ్మాయి రెండో అమ్మాయి. పెద్దమ్మాయికి పెళ్ళయిపోయింది. మూడో అమ్మాయి చదువుకుంటోంది. వాళ్ళకి ఒక్కడే కొడుకు. పెళ్ళికూతురి పేరు సరోజ. చాలా అందంగా వుంది. ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకుంది. సరోజ ఇక నుంచీ అమ్మాజీని చూసుకుంటానని చెప్పింది. పెళ్ళవగానే కొన్నిరోజులు ఆగి అమ్మాజీని తీసుకుని వెళ్ళిపోతాం” అని ఆగకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోయింది.

వీరభద్రయ్యగారు తమ్ముళ్ళు సాంబయ్యని, శివయ్యని పిలిచి, “అమ్మాజీని తీసుకుని వెడతామంటున్నారు. సుబ్బారావుకి పెళ్ళి కుదిరిందిట. ఇన్నాళ్ళూ మనకి అలవాటయిపోయింది. పంపించాలంటే బాధగా వుంది. ఎంతయినా సవతి తల్లి కదా… ఎలా చూస్తుందో ఏమో…” అన్నారు.

సాంబయ్య, శివయ్య కూడా చాలా బాధపడ్డారు.

సుబ్బారావు పెళ్ళికి అందరినీ పిలిచారు. ఏలూరులో పెళ్ళి. అందరూ బస్సులో పెళ్ళికి వెళ్ళారు. ఏదో ఉన్నంతలో ఉన్నంత పెళ్ళి బాగానే జరిగింది. సరోజ అత్తవారింటికి వచ్చేసింది. నెలరోజులయ్యాక అమ్మాజీని వాళ్ళింటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు.

సుబ్బారావు “దారా బంగారు తల్లీ మనింటికి వెడదాం. నీ బట్టలు, పుస్తకాలు తెచ్చుకో. అమ్మ వచ్చేసింది. నీకు అన్నం పెడుతుంది. చదువు చెప్తుంది. అన్ని పనులూ చేయిస్తుంది” అని ఎత్తుకోబోయాడు.

“నేను రాను. మనిల్లు ఇదే కదా… నాకిక్కడే బావుంది” అంటూ పెద్దత్త సావిత్రి వెనక్కి వెళ్ళి దాక్కుంది. వాళ్ళందరూ ఎంత చెప్పినా వినలేదు.

వీరభద్రంగారు – “సుబ్బారావ్, ఒక్కసారి రమ్మంటే ఎలా వస్తుంది. దగ్గరలోనే వున్నారు కాబట్టి రోజూ కాసేపు తీసుకుని వెళ్ళండి. అలవాటయ్యాక అప్పుడు తీసుకుని వెడుదురుగాని. మాకూ ఒక్కసారి పంపాలంటే బాధగా వుంది” అన్నారు.

సుబ్బారావు “సరేనండీ” అని వెళ్ళిపోయాడు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.