కథామధురం

మంథా భానుమతి

-ఆర్.దమయంతి

 ‘ ప్రతి స్త్రీ విషాదం వెనక ఒక మగాడు వుంటాడు ‘ 

అని నిర్ధారించే కథ… 

– శ్రీమతి మంథా భానుమతి ‘స్వార్ధం’ కథ.

*****    

‘స్త్రీ అమూల్యమైనదే. కాకపోతే చాలా  అమూల్యమైన పరికరం.’ అందుకే, మగాడు తన  తెలివితోనో, మోసం తోనో..ఆమెని వినియోగించుకుని లబ్ది పొందాలని తహతహలాడతాడు. ఆ  ప్రయత్నం లో, ఆ ఆరాటంలో..చివరికి నైతికం గా ఎంతగా దిగజారుతాడూ అంటే – ఎంత ద్రోహం తలబెట్టడానికైనా వెనకాడడు.  అతనెవరో పరాయి వాడు కానక్కర్లేదు. కట్టుకున్న మొగుడు కావొచ్చు, నమ్మిన స్నేహితుడు కావొచ్చు, ప్రేమ ని ఎరగా వేసే ప్రియుడు కావొచ్చు, రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములూ కావొచ్చు. 

 ఈ నాడు ప్రపంపచాన్ని వొణికిస్తున్న కరోనా కి సైతం వ్యాధి నిర్మూలన  జరగొచ్చు కాని యుగ యుగాలుగా స్త్రీ సుఖ సంతోషాలని హరిస్తూ, జీవితాలని నాశనం చేస్తున్న ఆ   స్వార్ధ పురుగు ని మాత్రం ఏ యుగంలోనూ ఎవరూ కనుగొనలేకపోవడం ఎంతైనా దురదృష్టకరం! 

స్త్రీ అన్ని దశలలోను దోపిడికి గురౌతూనే వుంది. అందుకు ఆది అంత్యాలు అన్నీ  కుటుంబ స్థాయి లోనే పాతుకుపోయి వుంటం – ఎంతైనా శోచనీయం. మరెంతైనా విషాదకరం.  

మనం నమ్మిన్నా నమ్మకున్నా, కథలో జీవితం వుంటుంది. జీవితం లో కథా వుంటుంది. దానికొక  నమ్మలేని ముగింపూ వుంటుంది. 

 అలాటి ఒక స్త్రీ విషాద  జీవితానికి అక్షర దర్పణం పట్టిన కథ –  శ్రీమతి మంథా భానుమతి గారు రచించిన ‘స్వార్ధం’ కథ. 

*****

కథేమిటంటే

రేణుక  చదువుకునే రోజుల్లోనే మేన మామ పట్ల ఆకర్షితురాలౌతుంది. అది గ్రహించిన స్నేహితురాలు భారతి – ఆమెని మాటలతో ఆటపట్టిస్తుంటుంది. 

అంతలో వీరిద్దరి  చదువులు పూర్తవడం, ఉద్యోగాల బాటలో ఒకరికొకరు దూరమవడం జరుగుతుంది. 

తన పెళ్లికొచ్చిన రేణుని అడుగుతుంది భారతి.  ‘విషయం ఎంతవరకు వచ్చింది అని. అందుకు సమాధానం గా  పెదవి విరిచి, నిశ్శబ్దమైపోతుంది -రేణుక.  

భారతి సంసారం లో బిజీ అయిపోతుంది. ట్రాన్స్ ఫర్స్ ర్స్ తో రేణుకకి దూరమౌతుంది. చాలా యేళ్ళ తర్వాత రేణు ఎదురౌతుంది.  చెప్పలేని ఆనందం తో ఉబ్బితబ్బిబ్బౌతుంది భారతి. అయితే, తనూహించినట్టు రేణుక మావయ్యని పెళ్ళి చేసుకోలేదు. పైగా, అవివాహితగానే మిగిలిపోయించి. ఎందుకనీ? భగ్న ప్రేమా?  ప్రేమించి మోసపోయిందా? ఓటమి భరించలేక, ఒంటరిగా మిగిలిపోవాలనుకుందా? పెద్ద ఆఫిసర్ కూడా అయింది. వయసు దాటిపోయింది. మరి జీవన మలి సంధ్య లో తోడు సంగతేమిటీ? భారతి ప్రశ్నలకి – నోరు విప్పి, జరిగింది చెబుతుంది.  వింటున్న భారతి ముందు విస్తుబోతుంది. ఆ పైన ఎన్నో ప్రశ్నలు..ఆలోచనలు..సంశయాలు ఆమెని చుట్టుముట్టేస్తాయి.

ఆ తర్వాతి కాలం లో…

రేణు తండ్రి మరణిస్తాడు. స్నేహితురాలి తో ఏ సాంత్వన వచనాలు  పలకాలనిపించదు. 

కానీ, ఒకానొక అనుకోని సందర్భం లో – రేణుక మేనమామ కలిసినప్పుడు మాత్రం భారతి ఆవేశాన్ని ఆపుకోలేకపోతుంది. ‘ఇలా ఎందుకు చేసారు నా రేణు జీవితాన్ని?’ అంటూ అతన్ని నిలదీస్తుంది. 

అతను ఏ మాత్రం తొట్రుబడకుండా చెప్పిన జవాబు –  ఒక బాంబు లా పేలుతుంది.  

ఇంతకీ రేణుక జీవితంలో జరిగిన పొరబాటు ఏమిటీ? కారకులు ఎవరు? అసలు జరిగిందేమిటీ అనే  రహస్యం తెలియాలీ అంటే – కథ చదివి తెలుసుకోవాల్సిందే!

****

కథలోని స్త్రీ పాత్రలు,  స్వభావాలు :

* భారతి : కొంతమంది స్త్రీలలో పిన్న వయసులోనే ఆలోచ్నలలో పరిపక్వతా ధోరణి అధికంగా కానొస్తుంది.  యవ్వన దశ నించే వారు జాగరూకులై మసులుకుంటారు. అలాటి కోవకు చెందిన అమ్మాయే భారతి. 

విద్యార్ధి దశ నుంచే, భారతి –  భవిష్యత్తు పట్ల సరైన పంథాని కలిగి వుంటుంది. రేణుక చెప్పే మావయ్య కబుర్లు మొదట్లో ఆసక్తి ని కలిగించినా, ఆ తర్వాత మాట తప్పిస్తూ, టాపిక్ ని పోటీ పరీక్షలమీద కి మళ్ళిస్తుంది. 

రేణుక ఆలోచనా ధోరణి మారకపోవడంతో స్నేహితురాలి గురించి చింతిస్తుంది.  అంతా సవ్యం గా జరిగితే సంతోషమే. కాకపోతే పరిస్థితి ఏమిటీ? అనే దూరపు ఆలోచన చేస్తుంది. యవ్వనం లో వున్న ప్రతి విద్యార్ధిని కూడా భారతి లా ఆలోచించగలిగితే, స్త్రీలు అనేక చిక్కు సమస్యల బారిన పడకుండా తమని తాము రక్షించుకోగల్గుతారు. 

బాయ్ ఫ్రెండ్స్, వారితో జరిపే రహస్యం మంతనాలు, సీక్రెట్ సంకేతాలు, ఒంటరిగా కలుసుకోవడాలు, ఆ థ్రిల్లింగ్ అనుభవాలను తలపోసుకుంతూ విలువైన కాలేజ్ కాలాన్ని దుర్వినియోగంచేసుకోవడమే కాకుండా, అంత కన్నా విలువైన భవిష్యత్తుని తమకి తాము గా నాశనం చేసుకునే  యువత కి కనువిప్పు గా నిలుస్తుంది – భారతి. 

రేణుక ని మేల్కొల్పాలని  తన ప్రయత్నం తను చేస్తుంది. కానీ, ఆమె విన్నా వినకపోయినా –  స్నేహానికే ప్రాధాన్యత నిస్తూ, ఆమె తో స్నేహాన్ని చివరి దాకా కొన సాగిస్తుంది.

స్నేహాన్ని నిజాయితీ గా ప్రేమించే భారతి వంటి స్నేహితురాలు ఒక్కరున్నా చాలనిపించేలా ఈ పాత్ర కి ఊపిరిలూదారు.   

ఒకానొక దశలో – స్నేహితురాలి కన్నీరు మున్నీరవడం చూసి కరిగిపోతుంది భారతి. ‘ఇదంతా నీ తెలివి తక్కువ తనం  వల్లే జరిగిందీ అని ఒక్క మాటైనా నోరు జారదు. – ‘కష్టం లో వున్న స్నేహితులకి అందించే ఓదార్పే స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుంది.’ –  అని భారతి ని చదివితే మనకు అర్ధమౌతుంది.

భారతి కి మనుషుల్ని చదవడం బాగా తెలుసు. స్త్రీలకి ఎన్ని విద్యలున్నా ఈ విద్య ని కలిగి వుంటం చాలా అవసరం. ముఖ్యం గా ఈ నాటి సమాజంలో ప్రతి స్త్రీ తూచి అడుగు వేయడం ఎంతో అవసరం.  

రేణుక తండ్రి మరణించినప్పుడు –  రోదిస్తున్న స్నేహితురాలిని చూస్తే ఆమెకి అపరిమితమైన జాలి కలుగుతుంది. – పర్యవసానంగా ఓదార్చాలనిపించదు. 

భారతి కి జాలి ప్రేమ మాత్రమే కాదు. ఆలోచనతో బాటు ఆవేశమూ వుంది. తన ఫ్రెండ్ జీవితం ఇలా అయిపోడానికి మూలకారకుడైన మేనమామ ఎదురయినప్పుడు ఆ పాటున  నిర్భయం గా – నిలదీసి అడుగుతుంది. ‘ఇలా ఎందుకు చేసావు నా స్నేహితురాలి జీవితాన్ని?’ 

 ఇలా – బహుశా – రేణు తల్లి తండ్రులు కూడా అతన్ని ప్రశ్నించి  వుండరేమో! అందుకే అతనికి భారతి పట్ల గౌరవం కలిగి, ‘అసలేం జరిగిందీ అంటే..’  అంటూ ఒక కటిక నిజాన్ని చెబుతాడు. 

* తల దించుకుంది రేణుక. తెలిసీ తెలియని వయసులో కలిగిన ప్రేమ.. తీసి పడెయ్యటానికి అదేమన్నా నెత్తి మీది జుట్టులో చిక్కా? బాగుంది. నిట్టూర్చాను. 

ఇంత ధైర్యవంతురాలు అయిన భారతి సయితం, అతని మాటలు విన్నాక, మూగ దవుతుంది. సహజమైన స్త్రీ కరుణ స్వభావానికి,  అపురూపమైన స్నేహ హృదయినికి – నిలువుటద్దం భారతి పాత్రనీ, పాత్ర స్వభావాన్ని ఎంతో హృద్యంగా తీర్చి దిద్దారు.

*రేణుక : నిజానికి ఈ పాత్ర చాలా ప్రధానమైన పాత్ర. ఈ కథలో కథానాయిక. కథానాయిక కి అయితే మాత్రం కష్టాలు, కన్నీళ్ళూ వుండవూ!-  వుంటాయనడానికి నిదర్శనమే రేణుక. ఆమె కన్నె మనసు మీ మావయ్య చిత్రం గాఢం గా హత్తుకుపోయుంది. అతని చూపుల వలలో, వూరించే మాటల్లో ఈ చ్న్నది  చిక్కుకుంటుంది. స్నేహితురాలి హితవులేవీ వినిపించవు. కానీ చదువులో, పోటీ పరీక్షలలో నెగ్గినంత సులువుగా, జీవితంలో నెగ్గలేకపోతుంది.

ప్రేమించిన మావయ్య కి పెళ్లని తెలిసి విలవిల లాడిన వైఖరి చూస్తే – ‘ఈ పిచ్చిది ఎందుకింత గా కొట్టుకుపోతుంది –  వొద్దన్న వాని కోసం?’ అని కోపమొస్తుంది కానీ, కథ చివర్లో స్నేహితురాలితో చెప్పుకున్న మాటల్లోనివ్యధ విన్నాక మాత్రం ఆమె పట్ల మనకి అపరిమితమైన కరుణ,జాలి కలుగుతుంది. 

‘నిన్ను నే పెళ్ళి చేసుకుంటా అని ప్రమాణాలు చేసానా?’ అని నిర్లజ్జ గా అడుగుతున్న మామయ్యకి ఏం జవాబు చెప్పాలో తెలీని ఆ బేల అంటుందీ, ‘నిజమే! చెప్పలేదు. కానీ ఇద్దరమే ఉన్నప్పుడు, చేతులు నిమరడాలు, కౌగిలించుకోడాలు, కళ్ల మీద ముద్దు పెట్టుకోడాలూ.. ఇవన్నీ ఉత్తినే చేస్తారు కదూ?’ అని ఫోన్ పెట్టేశాను.” అంటూ భారతి కి చెప్పుకుంటూ కుమిలిపోయే రేణుక ని చూస్తే మనసు ఆర్ద్రమౌతుంది.

ఆడదాని మనసు తెల్ల కాగితం వంటిది.  తొలి ప్రేమ జ్ఞాపకాలు గాఢం గా ముద్రించుకునుంటాయి.

రేణుక ఉద్యోగ రీత్యా మెట్టు మెట్టు గా ఎదుగుతూ ఆఫీసర్ కాడర్ ని చేరుతుంది కానీ వ్యక్తిగా మాత్రం –   మనసు లోంచి మామయ్యని తొలగించలేకపోతుంది. ఆ విషాదాన్ని దాటి ఒక్క అడుగుఅయినా ముందుకేయలేకపోయింది. అతను తన జీవితం లోంచి  వెళ్లిపోయినా, అతనితో ఆమె కి గల ప్రేమానుబంధాల నించి విడిపడటానికి ఏ మాత్రం ఇష్టపడదు. – ఆడది ఒక సారి మనసిస్తే తిరిగి తీసుకోలేదు  అనే వాక్యానికి బలమైన సాక్ష్యం గా మన కళ్లముందు నిలుస్తుంది – రేణుక పాత్ర ! 

మరో విషాదం ఏమిటంటే –   ఆమె జీవితం హఠాత్తుగా అలా విషాదపు మలుపు తిరగడానికి అసలైన కారకులెవరో ఆమెకి తెలీకపోవడం!

 ఈ పాత్రని ఎంతో సహజం గా చిత్రీకరించారు.  అమాయకం గా, బేలగా, అంతలోనే డాంబికం గా కనిపిస్తూ మళ్లా మరుక్షణానే, కలత చెంది కన్నీరౌతూ స్త్రీ సహజ మనస్తత్వాన్ని ఎంతో హుందాగా చిత్రీకరించారు. 

రేణుక తల్లి పాత్ర : కథలో ఎక్కడా ఎవరితో సంభాషించదు. కానీ కనిపించిన ఆ ఒకట్రెండు చోట్ల కూడా గుంభనమైన ఆమె స్వభావం మనకు స్పష్టం గా గోచరమౌతుంది. కూతురు కలలు కంటున్న వరుడెవరో ఆమెకి తెలుసు. అయినా తెలీనట్టే వుంటుంది. పై పెచ్చు, అతను అంటే తమ్ముడి  పెళ్ళి కి హాజరవడం కోసం హైరాన పడుతుంటేనే అర్ధమౌతుంది మనకి. – ఆ తల్లి మనసు ఏ పాటిదో! కూతురి మానసిక దీన పరిస్థితి చదవడం ఆమెకి రాదని నేననుకోను. కాకపోతే, అవిద్య, ఆర్ధిక స్వేచ్చ లేకపోవడం, పై పెచ్చు భర్త అధీనం లో బ్రతకడం వల్ల ఆ తల్లి కూతురికి అండగా నిలవలేకపోయిందన్నది మాత్రం సత్యం. మధ్య తరగతి కుటుంబాలలో తల్లుల అసహాయ స్థితి ఇది. మనసు చలించకుండా జాగ్రత్తపడటం తెలిసిన ఒక తరహా కి చెందిన  అమ్మ స్వభావానికి అద్దం పడుతుంది ఈ తల్లి పాత్ర! 

ప్రతి ఇల్లాలు –  మొగుడి శాసనాలకు బందీనే. 

సీతా దేవి అయినా లక్ష్మణ రేఖ దాటింది కానీ, భర్త శాసనాన్ని దాటి అగ్ని ప్రవేశాన్ని తప్పించుకోగలిగిందా? 

ఈ సందర్భం గా కవి రాసిన ఆణిముత్యల్లాంటి మాటలు గుర్తొస్తాయి. అందరి రాతలు దేవుడు రాస్తే ఆడదాని రాత మాత్రం మగాడు రాస్తాడు ట. కవి కి జోహార్లు!

– ఇవీ!  ఈ కథలోని స్త్రీ పాత్రలు, స్వభావాలు, మానసిక సంఘర్షణలు!

*****

రచయిత్రి  రచన గురించి నాలుగు మాటలు :  

కథ రాస్తున్నప్పుడు రైటర్స్ తమ భావలను కూడా ప్రకటించుకోవడం లో  స్వీయానుభవాలని జొప్పిస్తూ కథని ముందుకునడిపించడంలో, లేదా కొన్ని సాంఘిక, సామాజిక, చార్త్రాత్మక అంశాలను సమాచారం గా అందచేయడంలో తమదైన ఒక ముద్రని కలిగి వుంటారు.  అలా గుర్తింపు పొందిన చాలా అరుదైన రచయిత్రులలో శ్రీమతి మంథా భానుమతి గారు కూడా ఒకరు. 

ఈ కథలో రైటర్ మాటలు చాలా సహజమైన సత్యాలు గా వుంటాయి. 

 భారతి తన పరిస్థితుల  వల్ల స్నేహితురాలిని కలుసుకోలేకపోతుంది.  అందుకు కారణాలు వివరిస్తూనే అంతలోనే తన మీద తనే జోక్ వేసుకుంటూ అనుకుంటుంది.. ఇలా – ‘ ఈ మధ్యన చాలా రోజులయింది మాట్లాడి. కలుసుకునైతే కొన్నేళ్లే! ఇంతా చేసి నాలుగైదు గంటల ప్రయాణం. మనసుల్లో ఎన్నెన్ని అభిమానాలున్నా, కలుసుకోవడానికి ఎన్ని అవరోధాలో! గట్టిగా ఆలోచిస్తే అంత కొంపలు మునిగిపోయేవేం ఉండవు. అంతా అశ్రద్ధ.’ అని చెప్పుకుంటుంది.

సరిగ్గా ఇలాగే వుంటుంది మన పరిస్థితి కూడా..

చదవంగానే – నే కలవాలి..కలవాలి అని కలవరించే ఫ్రెండ్స్, బంధువులు గుప్పున గుర్తొచ్చారు.   

మనల్ని మనం అద్దంలో చూసునట్టు గా, ఎంతో  సహజమైన మానవ స్వభావాన్ని ఎంతో హృద్యం గా రాసారు.

అలాగే రచయిత్రి తాను గమనించిన హిందు వివాహ  సాంప్రదాయం గురించి చెబుతారు. ‘ మా గుంటూరు సైడు, ఆ రోజుల్లో మేనమామకిచ్చి చెయ్యటం సర్వ సాధారణం. కానీ గోదావరి జిల్లాల్లో అంత కామన్ కాదు.’  అని అంటారు. గమనించి చూస్తే ఇది నిజం. 

మరో సందర్భాన _ 

కథ లో భారతి తన గురించి తాను ఇలా చెప్పుకుంటుంది. ‘ నేను కెనరా బాంక్ లో సెలెక్ట్ అవటం, ఇంట్లో ఒప్పించి బెజవాడలో చేరటం.. నన్ను బాంక్ లో చూసిన మా ప్రొబేషనరీ ఆఫీసర్ గారు నన్ను పెళ్లి చేసుకుంటాననటం.. అదృష్టవశాత్తూ వారిది మా శాఖే అవటంతో పెళ్లయిపోవటం జరిగిపోయాయి. ‘ అని. ఇక్కడ ‘అదృష్టవశాత్తూ వారిది మా శాఖే అవటంతో పెళ్లయిపోవటం..’ ఈ వాక్యం మన వివాహ వ్యవస్థ లో గల ఒకానొక నిక్కచ్చి సాంప్రదాయ పద్ధ తి ని ప్రతిబింబ చేసారు.   అమ్మాయీ అబ్బాయీ ఒకర్నొకరు ఇష్టపడ్డా, పెళ్ళి చేసుకోవడానికి వారిద్దరిదీ ఒకే కులమే అయినా,’ శాఖ ‘ కి ఎంత ప్రాధాన్యత ఇచ్చే వారో ఆ నాటి తరం వారు అనే విష యం ఇక్కడ ప్రస్ఫుటమౌతుంది. 

కథలో రైటర్స్ ఇన్వాల్వ్మెంట్  వల్ల, పాఠకులకు ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తాయి అనడానికి మచ్చుకకి మాత్రమే పేర్కొనడం జరిగింది. 

రచయిత్రి శ్రీమతి మంథా భానుమతి గారికి శుభాభినందనలు!

****

డియర్ రీడర్స్!

కథ చదివి మీ  అమూల్యమైన అభిప్రాయాలను, హృదయ స్పందనలను అందచేయవలసిందిగా  మనవి.

****

 “స్వార్ధమా! నీ చిరునామా ఎక్కడ?”

                                                                                     – మంథా భానుమతి

   “వెంటనే బయల్దేరి రా భారతీ. రేప్పొద్దున్నే కారు పంపిస్తా బస్టాండ్ కి.” రేణుక గొంతులో కంగారు, దుఃఖం విని, నాకు కాళ్లు చేతులు ఆడలేదు.

   ఇంట్లో ఉండేది మేమిద్దరమే. ఇద్దరం చెరో బాంక్ లోనూ పనిచేసి రిటైర్ అయి ఐదు సంవత్సరాలయింది. పిల్లలిద్దరూ.. మా వయసు వాళ్లందరి పిల్లల్లాగానే అమెరికాలో ఒకరు, ఆస్ట్రేలియాలో ఒకరు. మేము గుంటూరులో స్థిరపడ్డాం.

    మా ఇద్దరి అనుబంధం తెలిసిన మా వారు సతీష్, నన్ను రేణుక ఉండే రాజమండ్రీకి ఏసి బస్ లో ఎక్కించి ఇంటికెళ్లారు. తనకి ఇబ్బందేం లేదు. వంటకి అమ్మాయి, ఇంటిపనికి ఇంకొక అమ్మాయి ఉన్నారు. పుట్టి పెరిగిన గుంటూరులో సెటిల్ అయ్యాము. కాలక్షేపానికి లోటు లేదు. బంధువులు, స్నేహితులు చాలా మందే ఉన్నారు.

   రాత్రి పదకొండు దాటింది. బైట వాతావరణమే చిరు చలిగా ఉంది. ఏసీ బస్సులో ఇంకాస్త ఎక్కువగానే ఉంది. చెవులు కప్పేట్లు తలకి మఫ్లర్, భుజాల నుంచీ కాళ్లవరకూ శాలువా కప్పుకుని వెనక్కి వాలాను, సీటు వెనక్కి జరిపి

   కళ్లు మూసుకుని నిద్రపోటానికి ప్రయత్నించాను. ఊహూ.. రేణు ఎందుకు రమ్మందో! మధ్యన చాలా రోజులయింది మాట్లాడి. కలుసుకునైతే కొన్నేళ్లే! ఇంతా చేసి నాలుగైదు గంటల ప్రయాణం. మనసుల్లో ఎన్నెన్ని అభిమానాలున్నా, కలుసుకోవడానికి ఎన్ని అవరోధాలో! గట్టిగా ఆలోచిస్తే అంత కొంపలు మునిగిపోయేవేం ఉండవు. అంతా అశ్రద్ధ

   కళ్ల ముందు రింగులు రింగులు.. యాభై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాను. రేణుకని మొదట కలిసిన రోజు..పియుసి లో చేరటానికి విమెన్స్ కాలేజ్ కెళ్లాను.

    “ఎక్స్ క్యూజ్ మి.. ఇది మీ ఫోటోనే కదా?” పెద్దపెద్ద కళ్లలో స్నేహ భావాన్ని పలికిస్తూ ఒకమ్మాయి.. చామన ఛాయలో కళగా మెరిసి పోతూ.. ఎర్రపట్టు పరికిణీ నల్ల జాకెట్టు, గులాబీ రంగు జార్జెట్ వోణీ. పొందిగ్గా నిలుచుంది.

   అనుమానం ఎందుకూ.. నాదే. అప్లికేషన్ మీద సరిగ్గా అతుక్కున్నట్లు లేదు. వరండాలో గోడవార గింగుర్లు తిరుగుతోంది. చూశాను కానీ ఎవరిదో అనుకున్నాను. అదే నాకూ, రేణుకకీ తేడా. తను వెంటనే తీసి, చూసి నా దగ్గరికి వచ్చింది. నేను నా ఉత్సాహంలో ఫొటో పట్టించుకోలేదు. అంతే అప్పటి నుంచీ, నాలుగు సంవత్సరాలు నిరాటంకంగా సాగింది మా స్నేహం. రోజూ ఇళ్లకి రాకపోకలు, కంబైన్డ్ స్టడీలూ, రెండు పావలాలు దొరికితే, నేల టికెట్లు కొనుక్కుని సినిమాలు.. మధ్యలో చిరు అలకలు, అప్రయత్నంగా చిరునవ్వు వచ్చింది నా పెదవుల మీదికి.

   వేసంకాల సెలవులకి మాత్రం ఇద్దరం మా ఊర్లు వెళ్లిపోయే వాళ్లం. ఉత్తరాలు తక్కువే.. ఇన్లాండ్ కవర్ కావాలంటే పది పైసలు మరి.. వచ్చాక బోలెడు కబుర్లు.. ఎడతెగకుండా.

   రేణుకది కొవ్వూరు, మాది అమలాపురం. కొబ్బరి తోటలూ, మామిడి చెట్లూ, వాటి పిందెలూ.. తోటలో విహారాలూ మామూలే. డిగ్రీ సెకండ్ యియర్ సెలవులు అయాక .. రేణుక మొహం వెలిగి పోతూ వచ్చింది వాళ్ల అమ్మమ్మగారి ఊరు నించి, కొత్త బట్టలు వేసుకుని.

   “ఏంటి విశేషం?” పరికిణీ పట్టుకుని చూస్తూ అడిగాను. నేతదే కానీ నాజూగ్గా ఉంది.

   “ సమ్మర్ హాలిడేస్ బాగా గడిచాయి తెలుసా? ఎప్పటిలాగ కాదు. చాలా హాపీగా.” చెప్తుంటే, బుగ్గలెర్రబడి పోతున్నాయి. రేణుకనెప్పుడూ అట్లా చూళ్లేదు.

   “అమ్మమ్మ బోలెడు కొత్త డ్రస్ లు కొనిచ్చిందా?” అప్పట్లో నాకు హాపీ అంటే రోజుకో కొత్త డ్రస్ వేసుకోటమే.

   “ఊహూ! సారి మా విజయ్ మామయ్య కూడా వచ్చాడు. ఆంధ్రా యూనివర్సిటీలో యమ్మే చేశాడు తెలుసా?”

   “ఎప్పుడూ మావయ్య గురించి చెప్పలేదే?”

   “మా విజయ్ మామయ్య వైజాగ్ లో మా పిన్ని దగ్గరుండి చదువుకున్నాడు. సమ్మర్ లో కూడా క్లాసులనీ, ట్యూషన్లనీ ఎప్పుడూ బిజీనే. ఇప్పుడు ఫైనల్ గా చదువయిపోయింది వచ్చేశాడు. పోటీ పరీక్షలకి తయారవుతాట్ట. హైడ్రాబాడ్ లోనో, ఢిల్లీలోనో. ఎన్ని కబుర్లు చెప్పాడో! ఎంత తెలివో.. ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసా?” రేణుక కళ్లలో మెరుపు.

   రేణుక కళ్లలోకి చూశానొకసారి. తడబడుతూ కళ్లు నేలకి వాల్చేసింది. తెలిసీ తెలియని వయసు.. పదిహేడు పద్ధెనిమిదేళ్ల అడ పిల్లలం. ప్రకృతి సహజమైన ఆకర్షణలకి చలించకుండా ఉండటానికి మూగమనసుల్లో గౌరి చెప్పినట్లు మాను మాకులం కాదు కదా! అందులో కవ్వించి ఉంటాడు. అందుబాటులో వరసైన పిల్ల.. చూడ చక్కనిది. మా గుంటూరు సైడు, రోజుల్లో మేనమామకిచ్చి చెయ్యటం సర్వ సాధారణం. కానీ గోదావరి జిల్లాల్లో అంత కామన్ కాదు.

   “ఐతే మీరిద్దరూ తోటల్లో డ్యూయెట్లా?” చటుక్కున తలెత్తి చూసింది. నా ప్రశ్నలో వ్యంగ్యం తోచిందేమో! నాకు తెలియకుండానే, కాస్త ఎగతాళిగా అనేసి ఉంటాను. మగ పిల్లలకి ఆమడ దూరంలో మసలటం అలవాటు మా ఇద్దరికీ. ఇంట్లో పెద్ద వాళ్లు ఏమీ బోధలు చెయ్యకపోయినా.. పెరిగిన వాతావరణం అటువంటిది.

   “అదేం లేదే! మా దొడ్డమ్మల పిల్లలు, పెద్దమామయ్య పిల్లలు, చుట్టుపక్కలవాళ్లు.. అరడజను మంది పైగా ఉంటారు. మధ్యాన్నాలు కూర్చుని పేకాటలో, చదరంగమో ఆడుకునే వాళ్లం. మధ్యలో తోటలోకెళ్లి, తీయించి పెట్టిన కొబ్బరి బొండాలు కొట్టుకుని తాగుతూ.. జంతికలు చేగోణీలు తింటూ చదివిన పుస్తకాల గురించి చర్చించుకునే వాళ్లం.” తనని తను కాస్త సమర్ధించుకుంటున్నట్లు మాట్లాడుతోందేమో అనిపించింది.

   అడిగిందానికి అంత పెద్ద సమాధానం అవసరం లేదేమో.. కానీ, నేనేం మాట్లాడలేదు. రేణుక గురించి ఎందుకో బెంగ అనిపించింది. లేని పోని చిక్కుల్లో పడబోతోందేమో అని! నేనేం చెప్పబోయినా వింటుందనిపించలేదు. స్నేహాన్ని పోగొట్టుకోవటం ఇష్టం లేదు.

   “సర్లే. ఇప్పుడు ఫైనల్ ఇయర్ మనం. జాగ్రత్తగా చదివి సెకండ్ క్లాస్ ఐనా తెచ్చుకోవాలి. బాంక్ పరీక్షలు, గవర్న్మెంట్ వి రాయాలంటే జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవాలి. రోజూ లైబ్రరీకి వెళ్లాలి. సెలవుల్లో జరిగింది పక్కన పెట్టెయ్యాలిసిందే.” టాపిక్ మార్చి క్లాసుకి తీసుకు పోయాను.

    ఒక్క సారిగా పెద్ద కుదుపు.. ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటికొచ్చాను. రామవరప్పాడు దగ్గరో గోతిలో పడుంటుంది బస్సు. అవటానికి పెద్ద హైవే అయినా, ఊర్లలోంచి వెళ్లేటప్పుడు, గోతులూ గుట్టలూ తప్పవు. హైవే వేసే వాళ్లు ఊర్లోంచి వెళ్ళే రోడ్లు పట్టించుకోరు. అవి వాళ్లవి కాదుట. ఊర్లలో చెప్పేదేముంది? ఎలా ఉన్నా రోజులు గడిచిపోతాయి. పెన్షన్లు, ఉచిత భృతులు ఇస్తే చాలు.

   ఫైనల్ ఇయర్ అంతా క్షణం తీరిక లేకుండా గడిచి పోయింది. మాది సైన్స్ గ్రూప్. రికార్డ్ లు, ప్రాక్టికల్స్ మధ్యలో పరీక్షలు. చివరికి వచ్చే సరికి ఫేర్వెల్ పార్టీలు, కన్నీటి వీడ్కోలు. పరీక్షలు బాగానే రాశామనిపించుకున్నాము. కానీ, రేణుక అన్యమనస్కంగానే ఉన్నట్లనిపించింది. నేను బాంక్ పరీక్షలు రాశాను. రేణుకకి గుంటూరులోనే గవర్న్మెంట్ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది, టెంపరరీ.. పరీక్షలు పాసయితే పర్మనెంట్ చేస్తారు.

   “కంగ్రాచ్యులేషన్స్ రేణూ. ఉన్న ఊర్లోనే ఉద్యోగం.హాయిగా.. గొడవా లేకుండా చేరిపోవచ్చు.” రేణుక నవ్వింది. కానీ నవ్వులో జీవం లేదు.

   “ఏమయిందే? హిమాలయా కూల్ డ్రింక్స్ కి వెళ్లి ఐస్ క్రీమ్ తిందాం పద. ఎంచక్కా నెల తిరిగే సరికి జీతం వస్తుంది. వారానికో సారి తినచ్చు.” అప్పటి వరకూ రూపాయి రూపాయి దాచుకున్న పది రూపాయలున్నాయి నా దగ్గర.

   “ఏం లేదు భారతీ.. విజయ్ మామయ్య గ్రూప్ వన్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాడు.”

   “మరింకేం.. హాపీ న్యూస్ కదా? అంత డల్ గా ఉన్నావేం?” ఇద్దరం ఐస్ క్రీమ్ తింటున్నాం. హిమాలయాలో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అన్ని ఊళ్ల నించీ వస్తారు అక్కడ తినటానికి. పైగా బస్టాండ్ దగ్గర్లోనే ఉంది. కానీ రేణుక ఐస్క్రీమ్ ఆసక్తిగా తినటం లేదు.

   “ఏం చెయ్యాలీ? నాకు డిగ్రీ వస్తోంది కదా? నాన్న పెళ్లి మాటెత్తరు. బియస్సీ లో చేరినప్పట్నుంచీ గొడవపెట్టే అమ్మకేం చెప్పారో అమ్మ కూడా మాట్లాడట్లేదు. మావయ్య జాబ్ లో చేరి రెణ్నెళ్లయింది. అతనూ గమ్మునున్నాడు. నాకీ ఉద్యోగం అదీ ఇష్టం లేదే. నాన్నే ప్రయత్నం చేసి తెప్పించారు. అందాకా చెయ్యి.. సంబంధం కుదిరే లోగా అంటూ.” రేణు గొంతులో నిర్వేదం.

   మా ఇద్దరిళ్లల్లోనూ యమ్మెస్సీ చదివించే ఉద్దేశం లేదు. మా ఇంట్లో ఐతే, ముగ్గురన్నల తరువాత పుట్టిన నన్ను ఇంత వరకూ చదివించటమే గొప్ప. ఎప్పుడెప్పుడు పెళ్ళి చేసి పంపించేద్దామా అనే. ఇంట్లో చెప్పకుండానే బాంక్ పరీక్షలకి వెళ్లాను, అంతగా సెలెక్ట్ ఐతే అప్పుడు చూద్దాంలే అని.

   రేణుక వాళ్లది పెద్ద కుటుంబం. ఐదుగురు అక్క చెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. ఇద్దరన్నలు, ఒక అక్క తరువాత రేణుక. అక్కకి పెళ్లయింది వాళ్లింటికి పక్క వీధిలోనే ఉంటారు. వాళ్ల నాన్నగారు రెవిన్యూ డిపార్ట్ మెంట్ లో చేస్తారు. అన్నలిద్దరూ బానే చదువుకున్నారు. మంచి ఉద్యోగాలే. పెద్దన్నకి పెళ్లయింది. చిన్నన్నకి కుదిరింది. వదినల గురించి చాలా గొప్పగా చెప్తుంటుంది రేణు.. బాగా చదువుకున్నారనీ, స్మార్ట్ గా ఉంటారనీ! తమ్ముడు పియుసీ, ముగ్గురు చెల్లెళ్లూ హైస్కూల్లో చదువుతున్నారు.

   నేను కెనరా బాంక్ లో సెలెక్ట్ అవటం, ఇంట్లో ఒప్పించి బెజవాడలో చేరటం.. నన్ను బాంక్ లో చూసిన మా ప్రొబేషనరీ ఆఫీసర్ గారు నన్ను పెళ్లి చేసుకుంటాననటం.. అదృష్టవశాత్తూ వారిది మా శాఖే అవటంతో పెళ్లయిపోవటం జరిగిపోయాయి. పెళ్లికొచ్చిన రేణుని కళ్లెగరేసి అడిగాను, ఏమయిందన్నట్లు. పెదవి విరిచింది. లోగా తన ఉద్యోగం పెర్మనంట్ అయింది.

   సంసారం పెరిగి, ట్రాన్స్ఫర్ల మీద ఊర్లు తిరిగి.. పిల్లల చదువులూ, ఆట పాటలతో పదిహేనేళ్లు గడిచి పోయాయి.

   ఏడాదికోసారి న్యూ ఇయర్ గ్రీటింగ్స్. దాంతోనే క్షేమ సమాచారాలూ తప్ప ఆన్ని రోజులూ కలుసుకో లేదు.. మనసు విప్పి మాట్లాడు కోలేదు మేమిద్దరం. ఒకసారి, హైద్రాబాద్ లో నేను పని చేసేటప్పుడు బాంక్ లో ప్రత్యక్షమయింది. బ్రాంచ్ కి వచ్చి ఒక నెలే అయింది నేను. తప్పిపోయిన అక్క చెల్లెళ్ల లాగ ఎగిరి గంతేసినంత పని చేశాం. లక్కీగా లంచ్ టైమయింది. ఒక మూలకెళ్లి పోయాం.

   “ఏమయి పోయావే ఇన్ని రోజులూ? వివరాలతో ఉత్తరాలేనా రాయచ్చు కదా! ఇక్కడికెలా వచ్చావు?” రెండు చేతులూ పట్టుకుని అడిగాను.

   “ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయింది భారతీ. సెక్షన్ సూపరెంటెండెంట్. గెజిటెడ్ ఆఫీసర్ని తెలుసా?” గర్వంగా, ధీమాగా చెప్ప బోయింది. కానీ నా దగ్గరా నటన? ఎక్కడ్నుంచో తొంగి చూస్తున్న నిరాశ బయట పడుతూనే ఉంది.

   ఒక్క సారి బాంక్ లో స్టాఫ్ అందరినీ చూశాను. అందరూ వచ్చారు. బిజీ సమయం అయిపోయింది. నేను లేక పోయినా నడిచి పోతుంది. మానేజర్ కాబిన్ లోకి వెళ్లి ఎమర్జెన్సీ వచ్చిందని, హాఫ్ డే సెలవు పెట్టి, నా సహోద్యోగికి అంతా అప్ప జెప్పి బయట పడ్డాను. అప్పటి వరకూ నా పరుగు చూస్తున్న రేణుక కళ్ల నిండా నీళ్లతో లేచి నిలుచుంది. చెయ్యి పట్టుకుని, కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్లి కార్లో కూర్చో పెట్టాను. ఏం మాట్లాడ లేదు.. నేను చెప్పినట్టు చెయ్యటం తప్ప. ఇంటికి పోనిచ్చాను కారు.

   “ఇప్పుడు చెప్పు. ఎందుకింత నైరాశ్యం? మీ వాళ్లంతా ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? నిన్ను ఒంటరిగా వదిలేశారు కదూ? పెళ్లయితే నన్ను పిలిచే దానివి కదా? పదిహేనేళ్లు గడిచి పోయాయి. ఒక్కదానివే గడిపేస్తున్నావా?” డ్రాయింగ్ రూమ్ లో కూర్చో పెట్టి, టీ పెట్టి రెండుకప్పుల్లో తెచ్చి ఎదురుగా కూర్చుని అడిగాను.

   రేణుక నన్ను తదేకంగా కాసేపు చూసి కళ్లు మూసుకుంది. కన్నుల చివర్నించి కన్నీళ్లు ధారలా.. వదిలేసింది, తుడుచు కోకుండా. లేచి వెళ్లి రుమాలు తెచ్చిచ్చాను.

   “కమాన్ రేణూ! ఏం జరిగింది? చెప్పు. అసలు నాతో కటాఫ్ ఎందుకు చేసేశావు?

   “ఏం జరగలేదే! అందుకే నోరు మూసుకున్నాను. నేను జాబ్ లోకి చేరగానే మా అన్నలు పట్టించుకోటం మానేశారు. నాకొచ్చే నూటాభై రూపాయలు.. అప్పట్లో నెల గడిచి పోయేది, నాన్నగారికి ఇచ్చేసి, దగ్గరే కనుక ఆఫీస్ కి నడిచి వెళ్లే దాన్ని.. ఐదు రూపాయలు పాకెట్ మనీ. అంతలో తమ్ముడికి మెడిసిన్ లో సీట్ రావటం, ఎత్తి డబ్బు పంపాల్సి వచ్చింది. నా జీతం ఎంతో వెసులుబాటుగా ఉండేది. విజయ్ మామయ్య ట్రైనింగులు అవీ అయి ఆఫీసర్ గా చేరాడు. ఉత్తరాలు రాయటం అదీ కుదరదు కదా మనిళ్లలో. నాకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని అతని దగ్గరికి వెళ్లి పోదామా అని ఉండేది. పాత జ్ఞాపకాలు ముసురుకోగా, ఉబికి వచ్చాయి కన్నీళ్లు. చూస్తూ ఉండటం తప్ప ఏం చెయ్యలేకపోయాను.

   నిజమే.. అప్పట్లో, ఏదన్నా చెప్పుకోటమే కష్టంగా ఉండేది

   “ఒక రోజు ఉన్నట్లుండి, మామయ్యకి పెళ్లి కుదిరిందని విన్నాను. అమ్మ పెట్టి సర్దుకుంటోంది. పెళ్ళికి వెళ్లాలని. మమ్మల్ని తీసుకెళ్లాలనే ఆలోచనే ఉన్నట్లు లేదు. బోలెడు ఖర్చు కదా! చెల్లెళ్లకి పరీక్షల రోజులు పైగా. నాకేం చెయ్యాలో తోచలేదు. ఫోన్ నంబర్ సంపాదించి, పబ్లిక్ బూత్ కి వెళ్లి ఫోన్ చేశాను. గుండె దడదడ లాడుతుండగా.

   మళ్లీ వరద.. కళ్లు వాచి పోయి.. ముక్కు ఎర్రగా.. రేణుకని ఎలా ఓదార్చాలి?

   “ఫోన్లో ఏమన్నాడో తెలుసా? నీకు ఎప్పుడైనా నిన్ను ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుంటాననీ చెప్పానా? రైల్వే ఆఫీసర్ గారి అమ్మాయి.. బోలెడు కట్నం. మీ నాన్న పెళ్లి కూడా నా హోదాకి తగ్గట్లు చెయ్యలేడు.

   “మరి నువ్వేమన్నావు? అసలేం జరిగింది? నీకు అతడి మీద ప్రేమెలా పుట్టింది?

   “కోపంతో కంఠం మూసుకు పోయింది. అయినా పెగల్చుకుని అన్నాను.. ‘నిజమే చెప్పలేదు. కానీ ఇద్దరమే ఉన్నప్పుడు, చేతులు నిమరడాలు, కౌగిలించుకోడాలు, కళ్ల మీద ముద్దు పెట్టుకోడాలూ.. ఇవన్నీ ఉత్తినే చేస్తారు కదూ? అని పెట్టేశాను. అప్పుడే సంఘటన జరిగినట్లు కుళ్లి కుళ్లి ఏడిచింది రేణు.

   “పోన్లే, టీనేజ్ లో అవన్నీ ఉంటుంటాయి ఒకో సారి. పట్టించుకో కూడదు. మనసుకి ఎక్కించుకోకూడదు. మీ ఇంట్లో నీ పెళ్లి ప్రయత్నాలే చెయ్యలేదా? ఇంట్లో దీని ప్రేమ కథ తెలియదు కదా.. మరి ఊరుకున్నారా?

   “చూశారు భారతీ. మామయ్య పెళ్లికి ముందే మొదటి సంబంధం వచ్చింది. అప్పుడే ఎలాగో నాన్నగారికి చెప్పాను. వెళ్లి మాట్లాడి వచ్చారు మామయ్యతో. నాతో ఫోన్ లో మాట్లాడినట్లే అన్నాడుట. అయినా ఆశ చావక, తన పెళ్లి కుదిరిందని వినగానే ఫోన్ చేశాను. తరువాత చెల్లెళ్లకి వరుసగా మంచి సంబంధాలు వచ్చాయని చేసేశారు. 

   “మీ అన్నయ్యలు? తమ్ముడు? వాడు డాక్టర్ అయుండాలి కదా? రేణుక మొహంలో కోపం..

   “అన్నయ్యలు.. ఉన్నారు. వాళ్లెప్పుడు పట్టించుకున్నారు? తమ్ముడు చదువైపోగానే తన కొలీగ్ ని చేసుకున్నాడు. ఆవిడ పంజాబీ. వాడే కాస్త నయం. యు. యస్ లో ఉన్నాడు. రెండు మూడేళ్ల నుంచీ డబ్బు పంపుతున్నాడు. వారానికొక సారి ఫోన్ చేస్తుంటాడు. చెల్లెళ్లకి కూడా అవసరం ఐతే వాడే చూస్తుంటాడు.

   “మరి అమ్మా, నాన్నా?

   “నా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు డబ్బు ఇబ్బందులేం లేవు. అమ్మ వండి పెడుతుంటుంది. నాన్న పుస్తకాలు, వాకింగ్. సాయంత్రం ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. రాజమండ్రీలో అపార్ట్ మెంట్ కొన్నాను లోన్ తీసుకుని, తాతగారి ఊరికి దగ్గరగా ఉంటుందని. ట్రాన్శ్ఫర్ తో ఇక్కడికి వచ్చాను. అమ్మా, నాన్నలని చూట్టానికి నా దగ్గరికి వస్తుంటారు అందరూ.

   “అంతేనా లేక విజయ్ ని అప్పుడప్పుడు చూట్టానికి కుదురుతుందనా?

   తల దించుకుంది రేణుక. తెలిసీ తెలియని వయసులో కలిగిన ప్రేమ.. తీసి పడెయ్యటానికి అదేమన్నా నెత్తి మీది జుట్టులో చిక్కా? బాగుంది. నిట్టూర్చాను

   “ఎప్పుడూ అనిపించలేదా? నీకూ సంసారం, పిల్లలు ఉండాలని?

   “ఎందుకనిపించదే.. నేనేమన్నా సన్యాసినినా? ఉప్పు, కారం తినే మామూలు మనిషినే కదా! రేణుకని చూస్తుంటే జాలికి కూడా అందని భావం కలిగింది నాకు. ఇష్ట పూర్వకంగా, త్యాగం చెయ్యటం వేరు. ఇంకే దారి లేకుండా తన జీవితం నిర్దేశించబడి కొట్టుకు పోవటం వేరు. ఎవరి దోషం ఇది? అన్న దమ్ముల స్వార్ధానికి బలైపోయిన ఆడపిల్ల.

   మేము ఊర్లో ఉన్న మూడు సంవత్సరాలూ, తరచుగా కలుసుకుంటుండే వాళ్లం. మాకు బదిలీ అయి వెళ్లిపోయినా, ఉత్తరాల్లో, తరువాత ఫోన్లలో పలకరించుకునే వాళ్లం. నా కంటే ముందే రిటైరయి, రాజమండ్రీలో సెటిల్ అయింది రేణు. వాళ్లమ్మ  పోయి నాలుగైదేళ్లయింది. బస్సాగి, కేకలు వినిపించి కళ్లు తెరిచాను.

   “రాజమండ్రీ వచ్చింది. దిగండి.. దిగండి. కండక్టరు అందర్నీ లేపుతున్నాడు. కాళ్లు ఈడుస్తూ దిగాను. ఎక్కువ సేపు కూర్చుంటే అంతే మరి.. కాసేపు మొరాయిస్తాయి. మోకాళ్లు.

   “భారతిగారు మీరేనామ్మా? పాతికేళ్ల కుర్రాడొకడు, నా దగ్గరకొచ్చి, చేతిలో సంచీ తీసుకున్నాడు. రేణు ఇంటికి తీసుకెళ్లాడు కారులో. నాలుగయింది టైము.

   మొదటి అంతస్థులోనే రేణు ఫ్లాట్.. లోపలికెళ్లగానే కంటపడింది దృశ్యం.. 95 ఏళ్లు దాటిన వాళ్ల నాన్న నిర్జీవంగా పడుకోబెట్టి ఉన్నాడు, చాప మీద. పక్కనే కుర్చీలో రేణు. తన చెల్లెళ్లు తలో మూల కునుకుతున్నారు. చిత్రంగా నాకేం భావం కలుగలేదు

   “వచ్చావా భారతీ.. చూశావా? మా అన్నలిద్దరూ పోయినేడే వెళ్లిపోయారు. తమ్ముడు హార్ట్ అటాక్ తో హాస్పిటల్ లో ఉన్నాడుట. మా అక్క వాళ్లాయన పోయి ఐదేళ్లయింది. మిగిలిన అల్లుళ్లకి తల్లిదండ్రులున్నారు. సంబంధం లేని వాడు కిరాయికి చేస్తున్నాడు కర్మ. నాకేం తోచలేదే. నువ్వు తోడుంటే ధైర్యంగా ఉంటుందని రమ్మన్నా.

   చెయ్యి పట్టుకుని దూరంగా తీసుకెళ్లి కూర్చోపెట్టాను. సాంత్వన వచనాలు పలకాలి.. కానీ రావట్లేదే..

*****

   యాదృచ్ఛికంగా మా రీజినల్ మానేజర్ అమ్మాయి పెళ్లిలో కొన్ని సంవత్సరాల క్రితం నా పక్కన కూర్చున్నఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ గుర్తుకొచ్చాడు. అతనే రేణు మామయ్యని మాటల్లో తెలుసుకుని, నిర్మొహమాటంగా అడిగేశాను.

   “నేను చేసుకుందామనుకున్నానండీ. మా బావే వచ్చి ప్రేమా దోమా మన ఇంటా వంటా లేవని నానా తిట్లూ తిట్టి, ఇంకెప్పుడూ వాళ్లకి కనిపించద్దని వార్నింగిచ్చాడు. అప్పుడు, వయసులో ధైర్యం చెయ్యలేకపోయాను.

   అందుకే నేమో.. కొడుకులుండీ అక్కరకు రాలేదు. చివరి వరకూ, తను అన్యాయం చేసిన కూతురి దగ్గరే కాలం గడపాల్సి వచ్చింది.

“…….”     

******

రచయిత్రి గురించి :

డామంథా భానుమతి పుట్టింది అమలాపురం, కోనసీమలో, పెరిగింది గుంటూరులో, నివాసం హైద్రాబాద్ లో.

జీవననేస్తం– మంథా రామారావు బి.టెక్. విద్యుత్ శాఖలో సూపరెండెంట్ ఇంజనీర్ గా పదవీ విరమణ చేశారు.

చదువు M.Sc(O.U), M.S (U.S), రసాయన శాస్త్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి P.hD

వృత్తి- విశ్రాంత ప్రభుత్వ రసాయన శాస్త్ర అధ్యాపకురాలు.

ప్రవృత్తి-   సంగీతం, సాహిత్యం- పఠనం, రచన, యోగా.

రచనలు- ఇరవై మూడు నవలలు (అందులో రెండు ప్రబంధాలు), ఎనభై పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురింప   బడ్డాయి.  మూడు కథా సంకలనాలు, మూడు నవలలు పబ్లిష్ అయ్యాయి.

పబ్లిష్ అయిన పుస్తకాలు.. 

  1. అనంత వాహిని”కథా సంపుటి
  2. రామాయణం మావయ్య. నవల
  3. గ్లేషియర్.నవల
  4. జీవన వాహిని”కథా సంపుటి
  5. అగ్గిపెట్టెలో ఆరుగజాలు” నవల
  6. “‘మంథార’ మాల”కథా సంపుటి.

పద్యాలు

అర్క శతకం, అంశు శతకం, సిరి శతకం, (కందాల మాలలు)

కృష్ణా పుష్కరాలుదశ కందాల మాల.. అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రిక.

మైండ్ ఇండియా భారమాత పద్యాల పోటీలో ప్రోత్సాహక బహుమతి.

అక్కిరాజు ప్రసాద్ ఏరువాక పద్యాల పోటీలో ప్రధమ బహుమతి.

వీర నరసింహరాజుగారి శివరాత్రి పద్యాల పోటీలో తృతీయ బహుమతి.

ధనుర్మాస వైభవం’అచ్చంగా తెలుగు బృందం వారి పద్యాల పోటీలో ప్రధమ బహుమతి..

స్వాతంత్ర్య సమరయోధులు, అచ్చంగా తెలుగు పద్యాల పోటీలో విశేష పురస్కార భహుమతి.

కార్తీక మాస వైశిష్ట్యము, అచ్చంగా తెలుగు, జంధ్యాల పికల్స్, వీరనరసింహరాజు పద్యాల పోటీలో ద్వితీయ బహుమతి.

పురస్కారాలు..1. లేఖిని సంస్థ వారి మాతృదేవ పురస్కారం, 2. కళాసాగరం వారి జీవితకాల సాఫల్య పురస్కారం, 3.బోయి హైమవతిగారిచే కొత్తూరి సుబ్బయ్య దీక్షితులు దంపతుల జీవిత పురస్కారం. 4. గుంటూరు సాహిత్య బృదం వారిచే ఉగాది పురస్కారం.5. లయన్స్ క్లబ్, యల్.బి నగర్ వారిచే జీవితకాల సాఫల్య పురస్కారం.6. బి.హెచ్ స్కూలు గుంటూరు వారిచే ఉగాది పురస్కారం.7. వంశీ వారి వాసిరెడ్డి సీతాదేవి స్మారక పురస్కారం. 8.అర్చన ఆర్ట్స్ వారి సాహతీ శిరోమణి పురస్కారం.

*****

Please follow and like us:

7 thoughts on “కథామధురం-మంథా భానుమతి”

  1. కథ, కథనం, విశ్లేషణ అన్నీ బాగున్నాయండీ..

  2. కధా దాని గమనం రెండూ బాగున్నాయి అలాగే కధని విశ్లేషించిన విధానం ఆశక్తికరం గా వుంది

  3. కథ బావుంది. విశ్లేషణ బావుంది భానుమతి గారికి, దమయంతి గారికి అభినందనలు

    1. వరలక్ష్మి గారూ, నమస్తే!
      చాలా సంతోషమైంది, మీ ప్రశంస చదవంగానే!
      ధన్యవాదాలండి.
      శుభాభినందనలతో..

  4. చాలా చక్కని పరిచయం. రచన పట్ల ఆసక్తి కలగాలంటే ఎంతవరకూ చెప్పాలో అలాగ చెప్పారు.
    ఇక కథ చాలా బావుందండీ. భానుమతి గారి శైలి నాకు చాలా ఇష్టం, ప్రశాంత గోదావరిలా సాగిపోతుంది. భారతి పాత్ర బావుంది.

      1. విశ్లేషణ గురించి చాలా చక్కగా చెప్పారండి.
        అవునండి, మీరు చెప్పినట్టు, భానుమతి గారి కథా కథనం నన్ను కూడా చాలా ఆకట్టుకుంది. అందుకే ‘కథా మధురం’ కోసం ఎంపిక చేసుకోవడం జరిగింది.
        కథని, కథా విశ్లేషణని ఎంతో శ్రధ్ధగా చదివి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలండి రత్నశ్రీ గారు!
        శుభాకాంక్షలతో..

Leave a Reply

Your email address will not be published.