
అసింట
-డా.కె.గీత
అయ్యగోరికీ దణ్ణంబెట్టు
అమ్మగోరికీ దణ్ణవెట్టని
డూ డూ బసవన్న బతుకేనెహె
అయ్యగోరు పెరట్లోకి పిలిత్తే
అదురుస్టవనుకుని లగెత్తేవు
గొబ్బిరి గాయలు దించనాకెహె
అమ్మగోరు సెర్లో పూలు తెంపుకు రమ్మంటే
గుమ్మం తొక్కొచ్చనుకునేవు
దేవుడు గూడా ఆళ్ల పార్టీయేనెహె
మటవేసుకుని మూలన
కుయ్ కయ్ అనకండా కూకుని
పెసాదాన్ని మా సేతల్లోకి
ఇసిరే సేతి కోరికలు
మాత్తరవే తీరుత్తాడు
అమ్మాయిగోరు తొంగి తొంగి సూత్తంటే
బూలోకరంబ నీ మీద మనసుపడ్డాదనుకునేవు
అసింట మొకం ఎలా ఉంటాదో సూద్దావనెహె
నీ తమ్ముళ్లు
పుట్టంగానే ఆళ్ల పాలేర్లే
నీ సెల్లెళ్లు
ఎప్పుడూ “పాసిపని”పిల్లలే
ఉప్పుడు పెద్దాసిన్నా తేడా లేకండా
అందరికీ అసింటంట
ఎవరింటోళ్లు ఆళ్లకే పనోళ్లూ పాలేర్లూనంట
సేతులు తోంకునేది
పొరబాట్న మనకి తగిలి కాదంట
మూతులకి గుడ్డలు
మన గాలి తగిలి కాదంట
మరి మేవేం అన్నేయం సేసేవండీ-
బాబ్బాబు
దరమ పెబువులూ!
మీ అసింట మీకాడెట్టుకుని
మా పన్లు మాకిచ్చీయండి
ముట్టుకుంటే సావొచ్చీలోగా
మాడే కడుపుల సావొద్దు మాకు
*****
(దళిత కవుల కవితా సంకలనం-2020 లో ప్రచురితం)

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
