చిత్రలిపి

-ఆర్టిస్ట్ అన్వర్ 

పండగలంటే పంద్రాఆగస్ట్, అక్టోబర్ రెండు, జనవరి ఇరవయ్యారు ఇదిగో నవంబర్ పద్నాలుగేగా. అదిగో తెల్లవారు ఝాము నుంచే మొదలయ్యేది హాడావిడి. పొయ్యి మీద నీళ్ళు అలా పెట్టి ఇలా తరిమేవారు చాకలాయన దగ్గరికి అప్పటికీ ఇరుగూ పొరుగూ అరుగూ అని అన్ని రకాల బడి పిల్లలు బద్ద శత్రువుల్లా కనపడేవారు ఆ కాసింత కాలం. ఎవరికి వారు తమ తమ యూనిఫాం లు ఇస్త్రీ రుద్దించుకోవాలి మరి. “కొండలా కూచుంది ఎంతకీ తరగనంది ఏందిరో వింత గొడవా అనే పాట అప్పుడు తెలీకపోయినా పాడే ఉంటాను. పండగలంటే ఇవే. జాతీయ పండగలకు దగ్గర్లో ఏ శుభకార్యం వచ్చినా పనిలొ పని అంటూ ఒక్కోసారి స్కూల్ డ్రెస్ ఐన తెల్ల అంగి, బ్లూ నిక్కర్ కుట్టించే వాళ్ళు. స్కూల్ డ్రస్సే కదాని చిన్న చూపు లేదు మాకు, కొత్త స్కూల్ డ్రస్ వేసుకుని బడికి వెల్లడం ఎంత దర్జా ఒలకబోసే పని.

చాచా నెహ్రూ పుట్టిన రోజు ఎప్పుడో తెలీదు, బాలల దినోత్సవం అంటే మాత్రం ప్రతి బాలబాలిక రెండో పుట్టిన రోజని మాత్రం ఖచ్చితంగా తెలుసు. బిలబిల్లాడుతూ దారివెంట గలగలల కబుర్లు నడిచేవి. పుయ్యిమని సుందరం సార్ విజిల్ మోతతో కబుర్లన్నీ అఠెన్షన్ లో వరుసలు కట్టి జాతికి మా హెడ్మాస్టర్ హనీఫ్ గారు అంకితం ఇచ్చే సందేశం వినపడుతూ ఉండేది. వరుసల మధ్యలో క్లాస్ లీడర్లు, కండపుష్టి, దబాయింపు తెలిసిన కుర్రాళ్ళు వచ్చి మా అరచేతుల్లో పంచి పెట్టే నెయ్యి చాక్లెట్ తిని మళ్ళీ హానీఫ్ గారి ప్రసంగానికి అంకితం అయ్యేవాళ్ళం. బాగా చదువే పిల్లలకు, బాగా పరిగెత్తే పిల్లలకు, ఖోఖో,కబాడి ఇత్యాది మల్లయుద్దాలు ఆడే పిల్లలకు, క్రమం తప్పకుండా బడికి హజరయ్యే వాండ్లకు బహుమతులు ఇచ్చేవారు. స్టేజీ మీద పాటలు పాడి కొంతమంది రంజింపజేసేవారు, ఇంకొంతమంది ’అయ్యామే డిస్కో డాన్సర్ ’ అనీనూ, ’ఒలమ్మీ తిక్క రేగిందా ’ అని కూడాను స్టెప్పులు వేసేవారు. వారికి బహుమతులతో పాటు చొక్కాలకు రూపాయి నోట్లు పిన్నీసు పెట్టి తగిలించేవారు. విజిళ్ళు వేసీ ఎంకరేజింగ్ కూడానూ. పదేళ్ల పాటు సాగిన బడి బ్రతుకులో చిత్రకళకు చోటు ఎప్పుడూ దొరకలేదు,ఏనాడు స్టేజి ఎక్కి ఇదిగో ఈ బహుమతి అని అందుకున్నది లేదు. ఈ రోజుకూ లేదనుకో. అయినా బొమ్మలు వేసినందుకు తన్నకపోవడమే మహద్భాగ్యం ఇంకా పురస్కారాలు కూడానా? అయినా పిల్లల పండగ వస్తుందనగానే పిల్లలందరం కలిసి తలా ఇంత చిల్లర వేసుకుని క్లాసు రూములకు సున్నాలు కొట్టి, ఝండాలు కట్టి, నల్ల బల్లలకు బుడమాకు-బొగ్గు సింగారం చేసి, తరగతి గది ముందు కళ్ళాపి చల్లి, రంగురంగుల ముగ్గులు చిత్రించి ఇంతింత కళ్ళయ్యేవాళ్లం. బడి లోపలి గోడల మీద నేను వేసిన చాచా నెహ్రూ కోటు మీది గులాబి పువ్వు అందుకుని అమ్మాయిలు జడల్లొ తురుముకునేవారు.

ఇప్పుడు బడి పాకలు ఉన్నట్టు లేవు, చెట్టు కింద తరగతులు నడుస్తున్నట్టు కానరావు, క్లాస్ ముగియగానే నిక్కర్ల వెనుక దుమ్ము దులుపుకుంటు మగపిల్లలు పైకి లేస్తే , లంగాలు విదిలించుకుంటూ ఆడపిల్లలు నిలబడేవారు, వారి వడినిండా క్లాసుల తరబడి గంటలుగా వింటూ వింటూ తిన్న పొద్దుతిరుగుడు, కర్బూజా విత్తనాల్ల పొట్టు తెల్లగా రాలేది క్లాసుల నిండా ఆ తెల్లని విత్తన పొట్టు రాశి పూల చినుకుల్లా . బాల్యం చెదిరి, వయసు ముదిరి ఇప్పుడు వాటిని పట్టుకుని “ఏవి తల్లి! నిరుడు కురిసిన ఆ హిమసమూహములు?” అంటున్నారు. నూనెపల్లె వాళ్ళకు హిమము ఎక్కడిదిరా? అవి కర్బూజా గింజెల పొట్టురా నాయనా. ఒక్కసారి కళ్ళు మూసుకుని వెనక్కి వెళితే అవన్నీ అక్కడే ఉన్నాయిరా, ఇంకా ఈత గింజలూ, రేగు గింజలు, సీతా ఫలం గింజలు, ఉసిరికాయ గింజలూ, బాలలదినోత్సవమునూ ….

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.