కొత్త అడుగులు – 14

ఇది స్వేచ్ఛ గానం!

– శిలాలోలిత

‘స్వేచ్ఛ’ ఎగరేసిన స్వేచ్ఛాపతాక బరి. స్వేచ్ఛ అంటే ఎవరి కిష్టం వుండదు? బతుకు కంటే స్వేచ్ఛ గొప్పదికదా! అందుకే స్వేచ్ఛ అందరి ఆకాంక్ష. ఆ పేరుతోనే ఆమె ఆకర్షించింది నన్ను. ఎంతమంచిపేరు పెట్టారు ఆ అమ్మా నాన్నలు అన్పించేది. ఇన్నాళ్ళకు ఓ రోజున స్వేచ్ఛ కలిసి కవిత్వ సంపుటి వేస్తున్నానని చెప్పినప్పుడు చాలా ఆనందించేను. అపురూపంగా అన్పించింది. స్త్రీలు రచనా రంగంలో ఎంత ఎక్కువగా వస్తే అంత ఆనందించే తత్వం నాది. అందుకే పోరాడి మరీ యం.ఫిల్, పిహెచ్.డి., లు స్త్రీల కవిత్వం మీదే పరిశోధన చేశాను.

స్త్రీలు రచనలు చేయడానికి వెనకుండే సామాజిక కారణాలు, సమాజ దుర్నీతి, స్త్రీల శక్తిసామర్థ్యాలను అంగీకరించే వ్యవస్థ లేకపోవడం, స్త్రీల రచనలపై విధించే సెన్సాట్లు , తాము మాత్రం అనుమతించిన భక్తి మొదలైన అంశాలకే స్త్రీలను పరిమితం చేయడం, ఇవన్నీ మనందరికీ బాహాటంగా కన్పిస్తున్న విషయాలే. ఇంకొక ప్రధానమైన విషయమేమిటంటే, స్త్రీల రచనలోని వ్యక్తీకరించిన భావాలన్నీ ఆమె వ్యక్తిగతమైనవనీ, ప్రేమ, శృంగారం, స్త్రీలకు నిషిద్ధ విషయాలనీ సమాజం భావిస్తోంది. ఇవే భావాలను పురుషులు వ్యక్తీకరిస్తే అవి వారి రసికతకు, ప్రేమోద్దీపనకు గుర్తులని భావించడం. స్త్రీల రచనల్లో ప్రేమ, విరహం, వియోగం ఏ కొంచెం కనబడినా ఎవరై ఉంటారు? అని డైరెక్ట్, ఇండైరెక్ట్ గా చర్చిస్తూ ఉంటారు. ఈ స్థితి మారాలింకా. ఇలాంటి కాంక్రీటు అరణ్యంలో కూడా అప్పుడప్పుడు ఇలా ‘స్వేచ్ఛ’లా సహజంగా, స్వచ్ఛంగా, సెలయేటి ప్రవాహంలా, మేఘాల జడివాన కవిత్వ ఆకాశంలో కురుస్తూ వుంటుంది.

ఎందుకోమరి. ‘స్వేచ్ఛ’కు మేఘమంటే ఇష్టం. ఎంతిష్టమంటే, మేఘానికి ఎన్నెన్నో రూపాల శరీరాన్ని తొడిగి రకరకాల అర్థాలతో వినూత్నంగా చెప్పడం ముచ్చటేసింది.

‘స్వేచ్ఛ’ ఇవ్వాల్టి కవయిత్రి. అందుకే అలా రాయగలుగుతోంది. చాలా చిన చిన్న మాటల్లోనే లోతైన భావాల్ని చెప్పింది. ప్రకృతిలో మమేకమైంది. మానవ సంబంధాలన్నీ విధ్వంసమవడాన్ని భరించలేక, మనుషులుగా కూడా మిగలకుండా మానవత్వపు ఊట ఇంకిపోయి ఎడారి బతుకులుగా మిగిలిన వైనాన్ని చాలా స్పష్టంగా తన కవిత్వంలో చెప్పింది.

చదువుతుండగానే కళ్ళు చెమర్చి, మసకబారిన దుఃఖంతో నిండిన కవిత ‘ఎలా గుర్తు పట్టాలి’ –

సమసమాజపు బడికి పోయిన బిడ్డలు

ఇంటికొస్తున్నారు

బిడ్డని తల్లి గుర్తుపట్టి తెచ్చుకోవాలి

ఒక బిడ్డకి రొమ్ములు కోసి ఉన్నాయి

ఇంకొకరికి కళ్ళు పీకేసి ఉన్నాయి

కాళ్ళు చేతులు, ఆఖరికి జననాంగాలు

ఒంట్లో ఉన్న అవయవాలన్నీ

ఛిద్రమై పోయినాయి

ఓయమ్మా ఎట్ల గుర్తుపడతావే

బిగించిన పిడికిలొక్కటే గుర్తు

బిడ్డల ఆశయపు దారెంట

గొంతు తెగినాపాట ఆగదు

దేహం గాయాల జల్లెడయినా

ఎరుపుకి మెరుపు తగ్గదు –

చాల మామూలు మాటలతోనే విప్లవాభివందనం చేస్తూ మెరుపు తగ్గదని హెచ్చరిస్తూ, వాస్తవ చిత్రపటాన్ని మనముందుంచింది.

గొప్ప జీవన తత్వతను వెల్లడించిన కవితలు అనేకమున్నాయి. ‘జీవితపు అలికిడి’ కవితలో ‘ప్రేమంటే దొరికిపోయిన చేప’

– ‘పరాధీన తరంగం కింద

కదిలే దొంగ అడవి’.

ఎగరాలంటే తేలాలి

రాతిముడి జారాలి

– నా బరువునంతా

ఆవిరి చేసుకుపో….

-మనసుకూ తడికీ

తెగదెంపులు చేసి –

ఇలాంటి ఆలోచనాత్మక పాదాల గుర్తులు పుస్తకం నిండా దాగి వున్నాయి. ఎవరికి వాళ్ళు ఈ కవిత్వాన్ని అనుభూతిస్తూ చదువుకోవాల్సిందే.

జీవితంలో ఎదుర్కొనే శక్తినీ, ఆత్మవిశ్వాసాన్ని, పోరాడే దృఢత్వాన్ని, కుంగిపోయి నప్పుడల్లా, మళ్ళా మొలకెత్తేదీ నేనే, నమ్మకమే మోసం చేసి బతుకునుంచి లోయలోకి తోసినప్పటికీ పైకి నిలబడిందీ నేనే, అంటూ తనను తాను సెల్స్ చెక్ చేసుకుంటూ చెట్టుపై తాత్కాలికంగా సేదతీరాలనుకున్నా, ఆ చెట్టు కూడా తానే నన్న జ్ఞాన స్పృహను కలిగిన చైతన్యం ఈ కవయిత్రిలో వుంది.

స్త్రీల జీవితాల్లో వుండే ‘ద్విపాత్ర’ల ధారణను కవిత్వీకరించింది. మనుషుల కోసం ఎంత వెతుకులాట జరిపినా, పసితనపు సంద్రంలో దొరకొచ్చేమో అని భావించింది.

అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ కొన్ని చోట్ల ఇలా –

జలపాతపు గొంతు పూడుకుపోయి

శిలల్లో కరిగినట్టు

ఆ తేమలో

కనురెప్పల స్నానపు నాట్యం’

నీ పాద పదాలకి మిత్రమా…. (క్షాళన)

మౌనంలో వుండే రహస్యాల్ని, తుఫానుల్నీ, ‘మౌనసునామీ’లో చూపించింది. ఇంకొక చోట –

‘కనుకొలకుల తడిలోంచి చూస్తే

కప్పుకుందే దుఃఖపు దుప్పటి’ – అనేస్తుంది అవలీలగా

దుఃఖమూ నాలాంటిదే

ఒంటరిగానైనా ముందుకే పయనిస్తుంది

ఈ దారి కొత్తదో, పాతదో

తోవంతా

కన్నీటి పూలే.

మనం ఇక్కడ ఆగి, దుఃఖదేహ స్వరూపాన్ని గురించి ఎంతైనా చర్చించుకోవచ్చు ఒంటరి దుఃఖం దారిని సైతం కళ్ళముందుంచింది.

వేదనా స్వరంతో తాను రచిస్తున్న నేపథ్యాన్ని

‘ఆ క్షణాలను

నిండుగా చేతుల్లోకి తీసుకొని

ముద్దాడబోతే

అక్షరాలై

అరచేతుల్లో తడిమి

గాల్లో కరిగిపోయాయి….

‘ఎక్కడికి పోతానిప్పుడు’ – లాంటి ఎన్నో కవితాశీర్షికల్ని చూసినప్పుడు ఆలోచనాత్మకంగా వుండి, కవిత గుండెను విప్పి చూపినట్లున్నాయి. మేఘమంత, మిణుగురు, పగిలిన జీవితం, దుఃఖపు తోట, నిన్ను తాకలేని రాత్రి, పునర్జన్న, స్నేహితురాలు, పునర్జననం, రేపటి సంభాషణ కోసం, అమ్మనాన్న, ఓ కోరిక, శ్వాస, వెలితి, విన్నపం, కల, నగ్నంగా, మట్టిపూల గాలి వంటి కవితల్ని ఎవరికి వాళ్లు మబ్బుల్ని చూస్తూ, ఆకాశంకింద, గాలి మాట్లాడుతుంటే, చీకటి మిణుగురులను మోసుకొస్తుంటే, తడిమేఘం కురిసి మనం గడ్డకడుంటే, ఒక్కోపుటలోని అక్షరాలకు రక్తమాంసాలద్ది చదువుకుంటేనే కానీ, తృప్తి మిగల్చని కవితలివి.

‘స్వేచ్ఛ’ కవితల్లో పదే పదే వస్తుండేవి జ్ఞాపకాల పొరలు. మేమం, దుఃఖపురజను, వర్షం, పసి చినుకులు, సముద్రం, కన్నీళ్ళు, ప్రేమరాహిత్యపు వేదన, కలలు, అన్వేషణలు, కొండలు, ఆకాశం, విరహం, వేదన, ఆలోచన, భవిష్యత్తు పోరాట జీవితాలు, నిర్ణయ ప్రకటనలు, పోరాట స్ఫూర్తి, అంతిమ విజయం తనదేనన్న విశ్వాస ప్రకటనలు పుస్తకమంతా వ్యాపించి ఉన్నాయి.

‘ఒకేసారి వందల తెల్లకోడి పిల్లల్ని కాళ్ళకడ్డం పడేసినట్లు / అలల నురగలలో మాటిమాటికీ బతిమాలుతోంది సముద్రం (అలల ఒడ్డున) – అంటుందొకచోట.

వెన్నెట్లో, మబ్బుల వనంలో, దేహనావతో మనసుపలికే ఆహ్వానగీతాల్ని చివర్లో ఇలా…

నీ కోసం మట్టిపూల కొత్తగాలిని

దోసిట్లో పట్టుకొని ఎదురుచూస్తున్నా…

త్వరగా వచ్చెయ్….

రాబోయే కాలంలో ఆనందాన్ని వర్షించే రోజుల్ని ఊహిస్తూ, కొంక్రొత్త ఆశతో అక్షర ఆయుధాన్ని ధరించి, బంగారు భవిష్యత్తుని కలం ద్వారా కలగన్న వర్తమానమిది.

కవిత్వం కలలాంటిది. కాంతిలాంటిది. భవిష్యత్ దర్శనమిది. నిద్రావస్థలో మానవత్వాన్ని తట్టిలేపేది కవిత్వం. కరుణను కురిపించేది కవిత్వం. బతుకును ఒడపోసి జల్లెడ పట్టేది కవిత్వం. ప్రేమను పంచేది కవిత్వం. బుద్ధిని జయించేది కవిత్వం. బండలను కొండలను కరిగించే శక్తి కవిత్వం, మృదు భాషిణులుగా మిగిల్చేది కవిత్వం. ఊహకు మెరుపై నిలిచేది కవిత్వం. భవితకు బాటసారై నిలిచేది కవిత్వం. బాధాగ్ని రేణువులకు స్వాంతన లేపనం కవిత్వం. మనిషి దృక్కోణాల వేదిక కవిత్వం.

ఇన్ని విధాల కవిత్వ స్పర్శను మనలో కలిగించి ఒక మంచి పదాల కూర్పుతో అక్షరదేహధారియై మనముందుండి మనసుల్లో నిలిచిపోయే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిన ‘స్వేచ్ఛ’కు మనసారా నా అభినందనలు. మీరూ నాతో ఏకీభవిస్తారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.