ఒక్కొక్క పువ్వేసి-9

ఆధునిక భారత మొదటి ముస్లిమ్ టీచర్ ఫాతిమాషేక్

-జూపాక సుభద్ర

          ‘ఫాతిమాషేక్’ ఈ మధ్య కాలంలో బాగా వినబడుతున్న ప్రముఖమైన పేరు. ఫాతిమా షేక్, ఆధునిక భారత తొలి టీచర్ సావిత్రి బాయి పూలేతో కలిసి అధ్యాపకురాలి గా, సంస్కర్తగా పని చేసిన ఆధునిక భారతదేశ మొదటి ముస్లిమ్ అధ్యాపకురాలనీ ఆమె కృషిని గురించిన సమాచారాన్ని పుస్తకంగా తెలుగు ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్టు, పరిశోధకులు, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ అభినందనీయులు. చరిత్ర పుస్తకాల్లో దళిత మహిళలు, బీసీ ఆదివాసీ, ముస్లిమ్ మహిళలు కనపడరు. ఈ మహిళల పోరాటాల చైతన్యాల్ని, త్యాగాల్ని, వీరత్వాల్ని భారత చరిత్రలు, పరిశోధనలు విస్మరించినయి.

          కానీ భారత జాతీయోద్యమ చరిత్రలో ముస్లిమ్ మహిళలు చేసిన పోరాటాలు,వారు చూపిన స్ఫూర్తి చైతన్యాలను,త్యాగాల చరిత్రలను భారత సమాజాని కందించిన గొప్ప పరిశోధకులు సయ్యద్ నశీర్ అహమ్మద్. ఈ అస్తిత్వ చైతన్య స్పూర్తి బహుజన కులాల చరిత్రకారులకు పరిశోధకులకు ఆదర్శనీయము.

          జీవితకాలము మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా, కులవివక్షలకు వ్యతిరేకంగా సామాజిక సంస్కరణలు ఉద్యమంగా చేస్తూ… అణగారిన సమాజాలకు, మహిళలకందరికి పాఠశాలలు పెట్టి వారి అభ్యున్నతికి కృషి సల్పిన సావిత్రి బాయి పూలే, జ్యోతిరావ్ పూలే చరిత్రలు పరిశోధకులకు, చరిత్రకారులకు అందడానికే ఎంతో ఆలస్యమైంది. యిక వారి కృషిలో భాగమైన అదీ ఒక ముస్లిమ్ మహిళ చేసిన సామాజిక సేవ మన ఆధిపత్య హిందూ చరిత్రకారులకు, పరిశోధకులకు అందినా వెలుగులోకి తేగలరా! ఒక్క ఫాతిమాషేక్ చరిత్రనే కాదు సామాజికంగా అనేక ఉద్యమాల్లో, సంస్కరణల్లో పాటు పడిన సేవ, త్యాగాలను ఎస్సీ,ఎస్టీ , బీసీ ముస్లిం,మైనారిటీ మహిళలను చరిత్రల్లో కనుమరుగు చేశారు. అందువల్ల భారత సమాజానికి వారి వీరోచిత పోరాటాలు, త్యాగాలు,బలాలు చైతన్యాలు భవిష్యత్ తరాలకు తెలియకుండా పోయినాయి. అట్లా పోవడానికి ఆధిపత్య కుల, ఆధిపత్య మత వివక్షలే కారణం. వారి చరిత్రలు అక్కడక్కడా ఆయా ప్రాంతాల్లో, స్తానిక భాషల్లో , స్తానిక చరిత్ర ల్లో ,మట్టి పొరల్లో తవ్వి తీస్తే దొరుకుతున్నయి.

          ఫాతిమాషేక్ ఆధునిక భారతదేశ తొలి ముస్లిమ్ టీచర్ అనే విషయం సావిత్రిబాయి పూలే తనభర్త మహాత్మా జ్యోతిరావు పూలేకి రాసిన లేఖలో బైట పడింది. ఆ లేఖను ఆసరాగ చేసుకొని బ్రిటీష్ మిషనరీ లేఖలు, రిపోర్టులు, వ్యాసాలు, ఉర్దూపుస్తకాలు, మరాఠి పుస్తకాలు, పత్రికలు, హిందీ పుస్తకాలు, సాహిత్యాలు, పూనా పట్టణ స్తానిక మౌఖిక సమాచారాన్ని బట్టి జరిగిన పరిశోధనల్లో ఫాతిమాషేక్ కుటుంబానికి సంబంధించిన సమాచారం తెలియ వచ్చినా, ఫాతిమాషేక్ గురించిన సమాచారం లభ్యం కాలేదు.
కానీ పూనా బుధవార్ పేట్(మహారాష్ట్ర)లో మౌఖికంగా చాలా సమాచారం ప్రచారంలో వుందనీ, దీని ఆధారంగా ఫాతిమాషేక్ మీద విస్తృత సాహిత్యమ్ వచ్చిందనీ ‘ఫాతిమాషేక్’ పుస్తకంలో సయ్యద్ నశీర్ అహమ్మద్ గారు విశ్లేషించారు.

          భారత దేశం భిన్న సమాజాల అస్తిత్వ దేశం. దేశానికి అన్ని సమాజాల,సమూహాల సేవ,చైతన్యాల చరిత్ర లు స్ఫూర్తి కావాలి. కుల,మత, జెండర్ సామాజిక అస్తిత్వాల చరిత్రలు తెల్సినపుడే ఆయా సమూహాల మధ్య పరస్పర గౌరవం, సామరస్య , మానవీయ స్నేహాలకు బలమైన పునాదులు ఏర్పడతాయి.

          స్థానిక మౌఖిక సమాచారం విస్తృత వ్యాప్తిలో వున్నందు వల్ల మహారాష్ట్ర బహుజన కులాల ఉద్యమకారులు, రచయితలు, చరిత్రకారులు, పరిశోధకులు, కళాకారులు ఎక్కడ, ఏ ఉద్యమం చేసినా సావిత్రిబాయి, జ్యోతిరావ్ ఫూలేలతో పాటు ఫాతిమాషేక్ స్మరణను ప్రస్తావించడం భాగమైనందువల్ల ఫాతిమాషేక్ గురించి బైటకు వెల్లడి కాబడింది. ఆధునిక భారతదేశానికి విద్యనందించిన కృషి విస్మరించలేని చరిత్ర అయినందు వల్లనే ఫాతిమాషేక్ చరిత్రను మహారాష్ట్రలోని ప్రభుత్వము ఉర్దూ పాఠ్య పుస్తకం రెండవ తరగతి బాలభారతిగా పెట్టడం అనివార్యమైంది. కానీ ఫాతిమా షేక్ ఒక్క ఉర్దూ వాళ్ళకే పాఠాలు చెప్పలేదు. అన్ని కులాల, మతాల వాళ్ళను, మహిళలను విద్యావంతులను చేసిన గొప్ప సామాజిక అధ్యాపకురాలు. అట్లాంటి అధ్యాపకురాలిని ఉర్దూ పాఠం వరకే కుదించడం ఆమె విశాలత్వ మానవీయ చరిత్రకు అన్యాయం చేసినట్లే అవుతుంది. మరాఠీ పాత్యాంశాల్లో, మొత్తం భారతీయ భాషల్లోకి కూడా తేవాల్సివుంది.

          ఫాతిమాషేక్ మహా రాష్ట్ర లోని పూనా గంజిపేట్ నివాసి.ఆమె జననం జనవరి తొమ్మిది 1831. వీరి కుటుంబమ్ ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి గంజిపేట్ లో స్తిరపడిన చేనేత వస్త్ర వ్యాపారులు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అన్న ఉస్మాన్ షేక్ ఆలనలో పెరిగింది. ఈ కుటుంబము అణగారిన కులాలకు, మహిళలకు పాఠశాలలు పెట్టేందుకు, కులవివక్షలు వ్యతిరేకిస్తున్న పూలేదంపతులు వారి తండ్రి బైటకు వెళ్లగొట్టినప్పుడు ఆశ్రయం యివ్వడమే గాక వారి యింటిలోని భాగాన్ని పాఠశాలగా యిచ్చిన గొప్ప ఆదర్శకుటుంబమ్.

          ఆనాటి భారత సమాజము బహుజన కులాలు, దళితులు, మహిళలు చదువుకోడానికి వీల్లేని నిషేధాలుగా వుండింది. వీరు చదువుకుంటే చెవుల్లో సీసాలు, నాలుకలు కోసేయడం, చంపడం కూడా జరిగేది. యిన్ని నిషేధాల్ని ధిక్కరించి వారికోసం విద్యావ్యవస్థల్ని ఏర్పాటు చేసే గొప్ప లక్ష్యాలున్న పూలేదంపతులకు అండగా నిలిచింది ఫాతిమాషేక్, ఆమె సోదరుడు ఉస్మాన్ షేక్ లు. వీరి సహకారం, భాగస్వామ్యం కొనియాడదగినది. అట్లానే జ్యోతిరావ్ పూలే చదువు మధ్యలో ఆగిపోతే, పలుగు పారబట్టి పూలతోట పనుల్లో వుంటే….తిరిగి జ్యోతిరావు పూలేను అనేక ప్రయత్నాలు చేసి పాఠశాలకు పంపాలని తండ్రిని ఒప్పించి చివరికి ఒక మంచి మిషనరీ స్కూల్లో వేసిన పండితుడు, బహుభాషా కోవీదుడు పూనా గంజిపేట్ నివాసి మున్షీగఫార్ బేగ్. తల్లిదండ్రుల్లేని ఫాతిమాషేక్ ఆమె అన్న ఉస్మాన్ షేక్ కి కూడా పెద్దదిక్కు గాఫార్ బేగ్. గఫార్ బేగ్ సహకారంతోనే ఫాతిమాషేక్ కుటుంబము పూనా గంజిపేటలో స్థిరనివాసము ఏర్పరుచుకున్నారు. అట్లా జ్యోతిరావ్ పూలే కు ముస్లిమ్ సమాజాలతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ బలమైన ముస్లిమ్ సంబంధాల వల్లనే జ్యోతిరావ్ పూలే ‘మానవ మహమ్మద్’ అనే స్తుతి గీతం రాయడం జరిగింది.     

         వ్యవస్థీకృతంగా వున్న బ్రాహ్మణీయ ఆధిపత్యాలను నిలువరించాలంటే చదువు చాలా అవసరమనీ, మనుషులు మానవహక్కులు, స్వేచ్ఛ సమానత్వాలతో బతికినపుడే సమాజము అభివృద్ధి చెందుతుందనీ, వీటిని సాధించాలంటే విద్య సామాజీకరణ చెందాలనే ఆశయంతో మహిళలకు, శూద్రులకు ,దళితులకు పాఠశాలలు పెట్టి, వారికి విద్యాబోధన చేయడానికి టీచర్లను తయారుచేయడం కూడా అవసరమైంది. ముందు తన భార్య సావిత్రిబాయి పూలే తో మొదలుపెట్టి ఆమెకు విద్యాబోధన చేశాడు. ఆ పరంపరలో వాళ్ళకు ఆశ్రయం కల్పించి వారి యింటిని పాఠశాలగా యిచ్చిన ఫాతిమా షేక్ ను కూడా చదివించి టీచర్ గా చేయడమ్ జరిగింది.

          ఫాతిమాషేక్ కి మరాఠి, ఇంగ్లీషు విద్యలలో పాటు విద్యాబోధన శిక్షణ కూడా పూలే దంపతులు అందించారు. ఫాతిమాషేక్,సావిత్రిబాయి పూలేలు కలిసి అహ్మద్ నగర్ లో టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి బాలికా పాఠశాలల్ని గొప్పగా తీర్చిదిద్దినారు. పూలే దంపతులు బాలికలకు ప్రత్యేక పాఠశాలలను 1848 లోనే పెట్టి యింకా అనేక పాఠశాలల్ని నడిపారు. ఆ పాఠశాలలకు అధ్యాపకులుగా పూలే దంపతులు ఎక్కువగా బహుజన కులాలను ప్రోత్సహించారు. ఎందుకంటే బ్రాహ్మణాధిపత్యాలు బహుజన విద్యను పాఠశాలలను ఒప్పుకోక విపరీతమైన దాడులు చేసేవారు. అవన్నిటిని పూలే దంపతులతో పాటు వారి లక్ష్యoలో భాగమైన ఫాతిమాషేక్ కూడా ఒక ముస్లిమ్ మహిళగా , ఉపాధ్యాయిని గా యిటు స్వంత ముల్లాల నించి, బ్రాహ్మణ హిందూ ఆధిపత్యాలనుంచి కూడా అనేక దాడుల్ని ఎదుర్కున్నది. సావిత్రిబాయి పూలేకి గొప్ప అండదండగా నిలిచి వారి మార్గాన ముందుకు నడిచిన మొదటి ముస్లిమ్ టీచర్ ఫాతిమాషేక్
ముస్లిమ్ మతంలో మహిళలకు చదువు నిషేధమ్ లేదు. యిల్లల్లోనే మదర్సా విద్యలుండేవి. అవి ముస్లిం మత పరమైన విద్యలు. కాని బైట సామాజిక, ప్రభుత్వ పాఠశాలల్లో, మిషనరీ పాఠశాలల్లోకి వచ్చి చదువుకొనే నిషేధాలున్నాయి. పరదా పద్ధతులు, బైటకు వెళ్ళనీయని నిషేధాలు, కఠిన కట్టుబాటులున్నయి. వీటన్నింటినీ ధిక్కరించి తాను పూలే దంపతుల ప్రోత్సాహంతో చదువుకోవడమే కాకుండా విద్యాబోధనకు ఉపాధ్యాయ శిక్షణ తీసుకొని అధ్యాపకురాలిగా, ప్రధానోపాధ్యాయురాలిగా సేవలందించారు ఫాతిమాషేక్. వయోజనుల విద్యకోసం తన యింటిని పాఠశాలగా పూలే దంపతులకిచ్చి విద్యా వ్యాప్తికి తోడ్పడిన సంఘసేవకులు, సంస్కర్త ఫాతిమాషేక్. ఫాతిమాషేక్ కేవలము ఆర్థికంగా స్తితివంతమైన కుటుంబమే కాదు సామాజిక చైతన్యాలుండడం వల్లనే పూలే దంపతులు చేస్తున్న గొప్ప కార్యాలకు ఆశ్రయమిచ్చి, పాఠశాల కొరకు తన యింటి భాగమిచ్చి వారికి అండగా నిలిచింది. ఫాతిమాషేక్ పూలే దంపతుల ప్రగతి శీల సాంగత్యంలో పరదా, మత సంప్రదాయాల్ని వదిలేసి బయటి కొచ్చి పూలే బాలికల పాఠశాలలో చేరిన మొదటి విద్యార్థిని. మరాఠి భాషనభ్యసించి, పూలే పాఠశాలలో అనేక యితర సామాజిక, సాంస్కృతిక విద్యలనభ్యసించింది.
బాలికల పాఠశాలలకు మగ టీచర్లుంటే తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని పంపేవారు కాదు. అసలు ఆడపిల్లలకు ‘చదువు చెరుపు’ అనే భావనలో వుండేవారు. మహిళా టీచర్లు లేరు. అట్లాంటి పరిస్థితుల్లో సావిత్రిబాయి చదువుకొని వారికి పాఠాలు చెప్పింది. సావిత్రిబాయి పూలే ఆదర్శంగా ఫాతిమా షేక్ కూడా పూలే పాఠశాలలో చదువుకొని పాఠాలు చెప్పడానికి ముందుకొచ్చింది. వీరిద్దరూ అహ్మద్ నగర్ లోని ‘మేడమ్ సింథియా ఫెరారె ‘ మిషినరీ లో పూర్తిస్థాయి ఉపాధ్యాయులుగా టీచర్ ట్రైనింగ్ చేసినారు. ప్రభుత్వ గుర్తంపున్న విద్యాసంస్థ లో టీచర్ ట్రైనింగ్ చేసిన తొలి మహిళా అధ్యాపకులుగా వీరిద్దరు సర్టిఫికెట్ లు కూడా పొందినారు. అట్లా ఉపాధ్యాయ వృత్తి విద్యా శిక్షణ పొందిన తొలి ముస్లిమ్ మహిళగా ఫాతిమాషేక్ సర్టిఫికెట్ పొంది చరిత్రలో నిలిచిపోయారు.

          పాఠశాలకు తమ ఆడపిల్లల్ని పంపని యిండ్లకు పోయి బాలికా విద్య ప్రాముఖ్యత, అవసరాన్ని యిల్లిల్లు తిరిగి బాలికలను పాఠశాలకు రప్పించేవారు సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ లు. యిది ముస్లిమ్ సమాజాలు, మత పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించేవారు, దాడులు చేసేవారు, చీత్కరించేవారు. పాఠశాలకు వెళ్ళనిచ్చేవారు కాదు. అనేక అడ్డంకులు కలిగించేవాల్లు. యింకో వైపు బ్రాహ్మణ సమూహాల నుంచి కూడా దాడులు, వ్యతిరేకతలు, అడ్డంకులెదురయ్యేవి. వాటన్నింటిని పూలే దంపతుల మార్గ దర్శకత్వంలో, కుటుంబ ప్రోత్సాహంతో ఎదుర్కున్నది ఫాతిమా షేక్. పరధా చాటు యింటి నుంచి బైటకొచ్చి యిల్లిల్లు తిరిగి ఇతర బాలికలతో పాటు ముస్లిమ్ బాలికలను కూడా పాఠశాలకు చేర్పించడం ఒక ముస్లిమ్ మహిళగా పెద్ద సాహసమే. దాడుల్లో మహిళలు కూడా వుండేవారు. ఎన్నిదాడులెదురైనా, ఎంత వ్యతిరేకతలు ఎదుర్కున్నా ఫాతిమాషేక్, పూలేదంపతుల ఆదర్శనీయ లక్ష్యమ్ వీడలేదు. వారికి అండగా, భాగస్వామిగా బుజం బుజం కలిపి నడిచింది. ఎన్ని కష్టాలెదురైనా బాలికా పాఠశాలలను ధైర్యంగా కర్తవ్య దీక్షతో ఉపాధ్యాయినిగా ముందుకు సాగారు. సావిత్రిబాయి ఫూలే ఆరోగ్యం బాగలేక పుట్టింటికి పోయినపుడు ఫాతిమా సేవలుండగా పాఠశాలలకు లోటు రాదు. ఫాతిమా కు ఎక్కువ శ్రమ యిస్తున్నానని మహాత్మా జ్యోతిరావు పూలే కి రాసిన ఉత్తరాన్ని బట్టి ఫాతిమాషేక్ వారికి ఎంత ప్రథమురాలో అర్థం అవుతుంది. యిదే ఫాతిమా షేక్ చరిత్రకు ఆయువు పట్టు.

          ఫాతిమాషేక్, పూలే పాఠశాలలో ఆధునిక భారతానికి విద్యా బోధన చేసిన తొలి ముస్లిమ్ మహిళగా కొనియాడబడ్తుంది. చరిత్రలో పూలే పాఠశాల నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అణగారిన కులాలకు, మతాల సమాజాలకు ఉపాధ్యాయినిగా, సామాజిక కార్యకర్తగా, సంఘసంస్కర్తగా, సావిత్రిబాయి పూలే సహచరిణిగా ఆధునిక భారత దేశ తొలి ముస్లిమ్ టీచర్ గా చరిత్రలో నిలిచే వుంటారు. (ఆమె 1990 అక్టోబర్ 10న కన్ను మూసారని స్థానికుల ప్రచారంలో వుంది)

  *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.