పౌరాణిక గాథలు -10

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

ఓర్పు – శకుంతల కథ

          అమె భర్తే ఆమెని గుర్తుపట్టలేక పోయాడు. అంతకంటే దురదృష్టం ఇంకే ముంటుంది? అయినా ఓర్పుతో సమయం వచ్చేదాకా ఎదురు చూసింది.  

          చివరికి ఆమె గెలిచింది… ఆమె ఎవరో కాదు కణ్వమహర్షి కూతురు ‘శకుంతల’.

          మనం చూస్తూ ఉంటాం…నిజాయితీ లేని వాళ్ళు, సత్ప్రవర్తన లేని వాళ్ళు పెద్ద పెద్ద భవంతుల్లో చాలా గొప్పగా జీవిస్తుంటారు.

          నిజాయతీగా జీవించేవాళ్ళు, మంచి ప్రవర్తన కలిగినవాళ్ళు గుడిసెల్లో కష్టాలు అనుభవిస్తూ జీవిస్తుంటారు. “ఇది న్యాయం కాదు!” అని మనకి అనిపిస్తుంది.

          సత్యవంతులు, నిజాయతీ కలవాళ్ళే ఎప్పుడూ కష్టపడుతూ జీవిస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతోంది?

          ఇటు వంటి తేడాలు జరగడానికి వేరే కారణం ఏదీ ఉండదు. మన నడవడిక వల్ల కలిగే ఫలితాన్ని మాత్రమే మనం అనుభవిస్తున్నాం. అంటే అంతా మనం పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ప్రకారమే జరుగుతోంది.

          మనం జరుగుతున్న దాన్ని మాత్రమే చూస్తున్నాము. దానికి కారణం ఏమిటన్నది జరిగిపోయిన విషయం కాబట్టి దాన్ని గురించి తెలుసుకోలేం. అందుకనే మన కళ్ళ ముందు జరుగుతున్న విషయాల్ని పొరపాటుగా అర్ధం చేసుకుంటున్నాం.

          మనం ఆలోచించే ప్రతి ఆలోచనకి, చేస్తున్న ప్రతి పనికి ఫలితాన్ని తరువాత అనుభవించే తీరతాం. ఈ ఫలితాలే మనిషి జీవితాన్ని నిర్దేశిస్తాయి.

          ఆ విధంగా మనిషి తన జీవితాన్ని తనే మలుచుకుంటున్నాడు. మనిషి జీవితం వేరే ఏ చట్టం ప్రకారం నడవట్లేదు… తనకు తానుగా చేసుకున్న కర్మ ఫలితంగా తప్ప.

          మనం ఎంచుకున్న మార్గంలో నమ్మకం ఉన్నా లేకపోయినా ఆ మార్గంలోనే జీవితం దాగి ఉంది. దుర్మార్గుడికి తన దుర్మార్గపు మార్గంలోనే నమ్మకం ఉంటుంది.

          కొంచెం ఓర్పుగా ఉంటే అనుకున్నదాన్ని తప్పకుండా సాధించవచ్చు. శకుంతల కూడా ఆ ఓర్పువల్లే అనుకున్నదాన్ని సాధించింది.

          మొదట్లో శకుంతల ఏ సంతోషమూ లేకుండ గడిపింది. ఆమె తల్లితండ్రులు చిన్న తనంలోనే ఆమెని అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు. ఆమెను పెంచడానికి అక్కడ ఎవరూ లేరు.

          అదృష్టవశాత్తూ మహర్షి కణ్వుడు ఆమెని చూసి దయతో తన ఆశ్రమానికి తీసుకుని వచ్చి పెంచాడు.

          చుట్టుపక్కల ఎంతో మంది మహర్షులు తమ కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. శకుంతల తనను పెంచుకున్న తండ్రితో కలిసి ఆ కుటుంబాల మధ్య పెరిగింది.

          ఆమె అసలైన తల్లితండ్రులు చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే. అయినా కూడా ఆమె అడవిలో సామాన్యమైన జీవితం గడప వలసి వచ్చింది.

          పక్షులు, జింకలు, చిలుకలు, కుందేళ్ళు, ఆవులతో కలిసి పెరిగింది. చెట్లు, నదులు, పర్వతాలు అన్నింటి మధ్య ఆమె మహర్షుల కుటుంబాలతో కలిసి జీవిస్తోంది.

          ఇంకా ఇతర మహర్షుల పిల్లలు, స్నేహితులతో ఆమె జీవితం అక్కడ ప్రశాంతంగా గడిచిపోతోంది.

          ఒక రోజు కణ్వుడు పని మీద వేరే చోటికి వెళ్ళాడు. ఆ సమయంలో దుష్యంతుడు అనే పేరు గల రాజు వేట కోసం అక్కడికి వచ్చాడు.

          శకుంతలని చూసి ఆమెని పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడు. ఆమె ఇష్టాన్ని అడిగాడు. తన తండ్రి పనిమీద బయటకి వెళ్ళాడని తిరిగి వచ్చాక ఆయనతో మాట్లాడ మని చెప్పింది.

          దుష్యంతుడు తను తిరిగి రాజ్యానికి వెళ్ళిపోవాలని తొందర పడ్డాడు. శకుంతలకి నచ్చచెప్పి ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. కొన్ని రోజులు అక్కడే గడిపి తరువాత తిరిగి తన రాజధానికి బయలుదేరాడు.

          పరివారాన్ని పంపించి తప్పకుండా తన రాజ్యానికి తీసుకుని వెడతానని శకుంత లకి చెప్పి వెళ్ళిపోయాడు.

          కణ్వుడు తిరిగి వచ్చిన తరువాత జరిగిన కథంతా విన్నాడు. జరిగినదానికి ముందు ఆశ్చర్యపోయినా కూతుర్ని మాత్రం ఆశీర్వదించాడు.

          రాజు పంపించిన మనుషులు వస్తారని శకుంతలని తీసుకుని వెడతారని చాలా కాలం ఎదురు చూశారు. ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి.

          అప్పటికే ఆమెకి ఒక కొడుకు కలిగాడు. భరతుడు అనే పేరుతో ఆశ్రమంలోనే పెరుగుతున్నాడు. ఆమెకు భర్త నుంచి ఎటువంటి సమాచారమూ అందలేదు.

          కణ్వుడు శకుంతలతో  “అమ్మా! ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండచ్చు. నీ అంతట నువ్వే ఆ రాజ్యానికి వెళ్ళు. నువ్వు ఆ రాజ్యానికి సంబంధించిన దానివే కదా. నీ భర్త నిన్ను తప్పకుండా స్వీకరిస్తాడు.

          నీ కొడుకు కూడ కొంచెం పెద్దవాడయ్యాడు. అతణ్ని కూడా నీతో తీసుకుని వెళ్ళు. నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అంతా సవ్యంగానే జరుగుతుంది” అన్నాడు అనునయిస్తూ.

          శకుంతల కణ్వుడు చెప్పిన జాగ్రత్తలన్నీ వింది. కొంత మంది శిష్యులతో కలిసి తన సమస్యని తనే ఎదుర్కోవాలని కొడుకుని తీసుకుని దుష్యంతుడి రాజ్యానికి బయలు దేరింది.

          నిండు సభలో కూర్చుని ఉన్న దుష్యంతుడు ఆమె గురించి తనకేమీ తెలియదనీ, బహుశా ఒక అడవి మనిషిని అంత:పురంలో ప్రవేశ పెట్టడానికి ఇదొక పన్నాగం అయి ఉండచ్చనీ అన్నాడు.

          శకుంతలని సభలో అందరి ముందూ ఒక మోసగత్తెగా చిత్రీకరించాడు.

          ఆమెతో వచ్చినవాళ్ళు “శకుంతల సమస్య తీరాలంటే ఆమె అక్కడే కొన్ని రోజులు ఉండాలి. ఆమెను అక్కడే వదిలి వెళ్ళడం మంచిది!” అని అనుకున్నారు.

          నిస్సహాయస్థితిలో ఉన్న ఆమెని కొడుకుతో సహా అక్కడే వదిలి తమ దారిన తాము వెళ్ళిపోయారు. శకుంతలకి ఇంతకంటే పెద్ద ఆపద ఏముంటుంది?

          నిస్సహాయంగా నిలబడి పోయిన శకుంతలకి వెళ్ళడానికి మరొక చోటు లేదు. తిరిగి అడవికి వెళ్ళిపోవడం ఒక్కటే మార్గం. తన భర్త తనని నిరాకరించాడు కాబట్టి, తనను పెంచిన తండ్రి కూడా తనను నిరాకరించవచ్చు కదా… అనుకుంది.

          ఆ సమయంలో ఆకాశం నుంచి “ఓ రాజా! ఈమె నీ భార్య శకుంతల, ఆమెతో ఉన్న చిన్నవాడు నీ కొడుకు. శకుంతల చాలా మంచిది, గుణవంతురాలు. ఆమెను నువ్వు ఆదరించు!” అని వినబడింది. ఇది ఒక విధంగా నడిచిన కథ.

          మరో విధంగా నడిచిన కథ…శకుంతల తన కొడుకుతో కలిసి నిలబడి ఉంది. ఆమె తో వచ్చిన వాళ్ళు అందరూ ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు.

          జరిగిన అవమానాన్ని భరించలేక పోయింది. తను నిలబడి ఉన్నభూమి అప్పటి కప్పుడే చీలిపోయి తనను లోపలికి తీసుకునిపోతే బాగుండును అనుకుంది.

          ఆమెకి వెళ్ళడానికి అడవి తప్ప మరో ప్రదేశం తెలియదు. జరుగుతున్న పరిస్థితు లకి ఆమె నిశ్చేష్టురాలయ్యింది. ఎక్కడికి వెళ్ళాలి?

          అడవికి వెళ్ళి తన కోసం ఒక ఆశ్రమం నిర్మించుకుని తన కొడుకుతో కలిసి ఉండాలని నిశ్చయించుకుంది. భగవంతుణ్ని ప్రార్ధిస్తూ అడవి వైపు నడవడం ప్రారంభించింది.

          భరతుడికి మొత్తం రాజు లక్షణాలే ఉన్నాయి. పులులతోను, ఇతర జంతువులతోను భయం లేకుండ ఆడతాడు. ఆమె తన భర్తని నిందించలేదు. భారతీయ స్త్రీలు మంచి రోజులు రావాలని ఎదురు చూస్తారే కాని భర్తల్ని నిందించరు.

          శకుంతలకి రాజభోగాలు అనుభవించాలన్న కోరిక లేదు. తన భర్తను చేరుకోవాలని మాత్రమే ఆశిస్తోంది.

          విధిని ఎవరూ ఎదిరించ లేరు కదా…. ఆడవిలో కొడుకుతో కలిసి జీవనం సాగిస్తోంది.

          భగవంతుడు మంచి నడవడిక కలవాళ్ళకి ఎప్పుడూ అన్యాయం చెయ్యడు.

          దుష్యంతుడు శకుంతలని అడవిలో పెళ్ళి చేసుకున్నప్పుడు ఆమెకు ఒక ఉంగరం ఇచ్చాడు. దాని మీద రాజముద్రిక ఉంది. కనుక, శకుంతల దుష్యంతుల పెళ్ళి జరిగింది అనడానికి అదొక నిదర్శనం.

          కాని, పడవలో రాజధానికి వస్తున్నప్పుడు దురదృష్టవశాత్తూ ఆ ఉంగరం శకుంతల చేతి నుంచి జారి నీళ్ళల్లో పడిపోయింది.

          విషయాలు వాటికవే మారిపోతూ ఉంటాయి. కొంత కాలం గడిచింది. ఆ రాజముద్రిక ఒక జాలరికి దొరికింది.

          ఆ జాలరి రాజప్రాసాదానికి వెళ్ళి తనకు దొరికిన ఒక ఉంగరాన్ని భటులకి చూపించాడు. భటులు అతడికి లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు.

          ఆ ఉంగరాన్ని చూడగానే రాజుకి అంతకు ముందు జరిగిన విషయాలన్నీ ఒక్కొక్క టిగా గుర్తుకొచ్చాయి. తను వేటకోసం అడవికి వెళ్ళడం, కణ్వమహర్షి కూతురు శకుంత లని చూసి ఇష్ట పడడం, శకుంతలతో పెళ్ళి జరగడం అన్నీ గుర్తొచ్చాయి. తన ప్రవర్తనకి తనే సిగ్గుపడ్డాడు.

          ఆ ఉంగరం జాలరి దగ్గరికి ఎలా వచ్చిందంటే… జాలరి తనకు దొరికిన చేపని కోసినప్పుడు దాని పొట్టలో ఉన్న ఉంగరం అతడికి కనిపించింది. అది శకుంతలకి దుష్యంత మహారాజు ఇచ్చిన ఉంగరం.

          ఆ ఉంగరం చూసిన వెంటనే దుష్యంతుడు శకుంతలను వెతుక్కుంటూ వెళ్ళి ఆమెను కలిసి రాజ్యానికి తీసుకుని వచ్చాడు. తరువాత చాలా కాలం శకుంతల దుష్యంతులు అన్యోన్యంగా జీవించారు. శకుంతల కథ లోకంలో చిరస్థాయిగా నిలిచి పోయింది.

ఓర్పు వహిస్తే సమస్యలు వాటంతట అవే పరిష్కరింపబడతాయి!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.