యాదోంకి బారాత్-12

-వారాల ఆనంద్

ఉద్యోగ పర్వం – మంథని

జీవితంలో అనేకసార్లు ఊహించని విధంగా మలుపులు ఎదురవుతాయి. వాటిల్లో మన ప్రమేయం అసలే ఉండక పోవచ్చు. కానీ ఎం చేస్తాం మలుపు తిరిగి ప్రయాణం కొనసాగిం చడమే. సరిగ్గా నాకు అట్లే జరిగింది. హాయిగా యునివర్సిటీలో చదువుతూ హాస్టల్ లో ప్రతి గురువారం సాయంత్రం హాఫ్ చికెన్, ప్రతి ఆదివారం ఫుల్ చికెన్ తింటూ ఏవో పోటీ పరీక్ష లకు తయారవుదామను కుంటున్న వేళ ఓ కాగితం చేతుల బెట్టి మంథనికి తరిమేశారు. ఆర్డర్ వచ్చిన తర్వాత నాలుగు రోజుల మీమాంస.. తర్వాత 18 జనవరి 1980న మంథని బస్సేక్కేసాను. గమ్మత్తుగా బస్సులో డిగ్రీలో మా జూనియర్ చెన్నారెడ్డి కలిసాడు. బాగా పాటలు పాడేవాడు. ఎటు అని అడిగితే తనకూ మంథని లోనే ‘పోస్ట్ఆఫీసు’లో ఉద్యోగం వచ్చింది అన్నాడు. కలిసి మంథని వెళ్ళాం. మంథని మా కరీంనగర్ జిల్లాలోనిదేఅయిన ప్పటికీ ఎప్పుడూ వెళ్ళలేదు. పెద్దపెల్లి దాటలేదు. మంథని గోదావరి పక్కనే వున్న వూరు. అప్పుడు మంథని అంటే బ్రాహ్మలకు పెట్టింది పేరు. అనేక మంది అక్కడి యువకులు బాగా చదువుకున్న వారని పెద్ద పొజిషన్లో ఉంటారని చెప్పేవారు. అది అసెంబ్లీ నియోజక వర్గం కూడా. అక్కడి నుండే పీ.వీ.నరసింహా రావు అనేక సార్లు ఎం.ఎల్.ఏ గా గెలిచాడు. అలాంటి మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు లైబ్రేరియన్ గా వెళ్ళాను.

          బస్సు దిగగానే చుట్టూ గుడిసె హోటల్లు, దుమ్ము నిండిన రోడ్లు, మట్టి మిద్దెలు వామ్మో అనిపించింది. కానీ కొంచెం ఉత్సాహం తెచ్చుకుని దగ్గరలో వున్న కాలేజీకి వెళ్లాను. సొంత భవనం లేని కాలేజీ స్కూలు భవనంలో వుంది. అక్కడి స్కూలు పాత హై స్కూలు. చాలా పేరున్న స్కూలే. కానీ ఇంటర్మీడియట్ ప్రారంభమయ్యాక ఉదయం స్కూలు మధ్యాన్నం కాలేజీ. షిఫ్ట్ సిస్టం అన్నమాట. లోపలికి వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని కలిసాను. గణపతి గారని కామర్స్ లెక్చరర్ ఇంచార్జ్ గా వున్నాడు. కొంత అనుమానంగా చూసినట్టు అనిపించింది. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి కూర్చున్నాను. ఆఫీసులోకి తీసుకెళ్ళి క్లర్క్స్ ని వాళ్ళని పరిచయం చేసాడు. ఎక్కడ ఏ ఊరని అన్ని వివరాల్ని ఆరా తీసాడు. ఇంతలో నాలుగయింది. ఇక ఇవాలటికి వెళ్ళండి. అన్నాడాయన. అమ్మయ్య అనుకుని బయలుదేరాను. బస్ స్టాండ్ గుడిసె హోటల్లో మంచి చాయ్ తాగి బస్సెక్కాను. బతుకు జీవుడా అనుకున్నాను. కానీ తెల్లారి నుంచి రోజూ రావాలి కదా.. అన్న ఆలోచన ఉసూరుమనిపించింది. ఇల్లు చేరి అమ్మ చేతి వంట తిని కాలేజీ వివరాలు కొన్ని చెప్పి నిద్రకుపక్రమించాను. ఉద్యోగంలో మొదటి రోజు అట్లా గడిచింది.

***

          మర్నాటి నుండి అంతా రొటీన్. కాలేజీకి వెళ్ళగానే మీ లైబ్రరీ చార్జ్ ఎకనామిక్స్ సార్ దగ్గర వుంది. ఆయన లీవులో వున్నాడు. వచ్చిం తర్వాత చార్జ్ తీసుకోండి అన్నాడు ప్రిన్సిపాల్ గణపతి. ప్రిన్సిపాల్ రూములో కూర్చుంటే మీరు ఇక్కడ కాదు ఆఫీసులో కూర్చోండి అన్నాడు. నేను కొంచెం గుర్రుగా చూసాను. ఆయన మెల్లగా సనుగుతూ అన్నాడు ‘మీరు రాడికలా…’ అని. ఎందుకన్నాను.. మీ గడ్దం అదీ.. అని మళ్ళీ నసిగాడు. నేను నవ్వేసి అలాంటిది ఏమీ లేదన్నాను. అప్పుడనిపించింది నిన్నటి నుండీ ఆయన చూపుల్లో వున్నతేడాకు ఇదా కారణం అనిపించింది.

          ఆయన అనుమానం కూడా కొట్టి పారేయాల్సింది కాదు. ఎందుకంటే అప్పుడు ఉత్తర తెలంగాణా జిల్లాలు అట్టుడికి పోతున్నాయి. మంథనికి ఒక పక్క గోదావరిఖని సింగరేణి గనులు అందులో ఆక్టివ్ గా వున్న కార్మిక సంఘాలు, మరో వైపు కాటారం అడవులు అందులో వున్న ఉద్యమ ఉధృతి.. ఆ నేపధ్యంలో కాంపస్ నుంచి వచ్చాడు గడ్దం పెరిగి వుంది … గణపతి గారి అనుమానం..భయం..కరక్టే అనిపించింది.

          రెండు మూడు రోజుల్లో కోటేశ్వర్ రావు లీవు నుంచి వచ్చాడు. పూర్తి స్థాయి లైబ్రేరియన్ చేరాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. క్రమంగా చార్జ్ తీసు కున్నాను. ఒక్కో పుస్తకం చూసే ఓపిక లేక పోయింది. ఎదో అయింది అనిపించాను. అప్పుడు అక్కడే హై స్కూలు పని చేసే ఇద్దరు టీచర్లు రాజిరెడ్డి, వెంకటనర్సయ్య లు పరిచయమయ్యారు. ఇంకా టీచర్ పి.కిషన్ మంచి మిత్రుడయ్యాడు. రాజిరెడ్డి వేముల వాడ దగ్గరి వూరి కావడంతో మా తాతయ్య వాళ్ళ గురించి తనకు కొంత తెలుసు. క్రమంగా కాలేజీ వాతావరణానికి అలవాటవుతున్నట్టే వుండేది కాని ఎదో తెలీని అసంతృప్తి. రోజూ కరీంనగర్ నుండి వచ్చి పోవడం ఇబ్బందిగా వుండేది. అంతా అక్కడే రూము తీసుకుని వుంటే మంచిది అనే సలహా ఇవ్వసాగారు. నాకూ అదే మంచిది అనిపించింది. కానీ అప్పుడక్కడ అయ్యన్న హోటల్ అని ఒకే ఒక హోటల్ వుండేది, భోజనానికి కేవలం అదొక్కటే దిక్కు. మంథనిలో నేను పరిశీలించిన విలక్షణ మయిన అంశాలు రెండు. ఒకటి మగవాళ్ళు వంటలకు వెళ్ళడం. అనేక మంది తమ కుటుంబాల్ని మంథనిలో వదిలి మహారాష్ట్రకు వంటలకు నెలల కొద్దీ వెళ్ళే వాళ్ళు. రెండవది అనేక మంది ఇంజనీరింగ్ కోర్సు చదివి విదేశాలలోనో, దేశంలోని వివిధ మహా నగరాలలోనో సెటిల్ అయిపోవడం. అందుకే మంథని వూరు వదిలేసిన పాత ఇల్లులా దిగులుగా కనిపించేది. (ఇప్పుడు చాలా మారింది లెండి).

          వెంకట్ నరసయ్య నేనూ ఒక రూములో చేరాం. మొదట హోటల్ తిండి అను కున్నా కొన్ని రోజులు వంట చేసుకున్నాం. అప్పుడే సాంబశివుడికి మొదటి సారి రాస్తేనే రైల్వే రిక్రూట్ మెంట్ లో ఉద్యోగం వచ్చింది. కర్నాటక లోని హుబ్లీ పోస్టింగ్ ఇచ్చారు. వెళ్లి జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి ఉత్తరాలు రాసేవాడు. తన ఎదుటి క్వార్టర్ లోని అమ్మాయి గురించి రాసే వాడు. తన ప్రేమ కథా వివరాల్నీ ఎంతో ప్రేమగా రాసేవాడు. మేం చాలా క్లోజ్ కదా ఏదీ దాచుకునే వాళ్ళం కాదు. మరో వైపు కొడం పవన్ కుమార్ ఏ.ఎం.ఐ.ఈ. కోసం మద్రాస్ చేరాడు. అక్కడి నుంచి ఉత్తరాలు రాసేవాడు. ఆయనదో కథ. నవ్వుకునే వాళ్ళం.  

          ఇక కాలేజీ లో విద్యార్థులు లైబ్రరీకి రావడం మొదలయింది. నేను కొంచెం పిల్లల్ని చదవడం వైపు ప్రోత్సహించడం ప్రారంభించాను. అది కూడా అకాడెమిక్ చదువులే కాకుండా సాహిత్యం చదవాలని చెప్పసాగాను. ముఖ్యంగా అమ్మాయిలు నవలల పట్ల, కొందరు కవిత్వం పట్లా ఆసక్తి చూపడం మొదలు పెట్టారు అందులో రమాదేవి అని ఒక అమ్మాయి చొరవగా వుండేది. మెయిన్ రోడ్డులోనే సార్ మా ఇల్లు రండి అని పిలిస్తే ఒక రోజు వెళ్ళాను. ఆమె చెల్లెలు ‘శంకరాభరణం’ లోని పాటలు చాలా బాగా పాడి వినిపించింది.

***

          ‘శంకరాభరణం’ సినిమా అప్పుడు వీస్తున్న గాలి. అంతటా ఆ సినిమా హవా నడిచింది. నేను కూడా జీవితంలో ఎక్కువగా అయిదు సార్లు చూసిన సినిమా అది. పాపులర్ సినిమా కావడంతో పాటు అప్పుడే నాకు ఉద్యోగం రావడంతో ఇంట్లో వాళ్ళకు మిత్రులకు అనేక మందికి నేనే ఆ సినిమా చూపించాల్సి వచ్చింది. అంతకు ముందు ఒకటికి ఎక్కువ సార్లు చూసిన సినిమాలు రెండే. అవి ఒక్కొక్కటి మూడేసి సార్లు చూసాను. స్కూల్లో వుండగా కరీంనగర్ భారత్ టాకీసులో “ యాదొంకి బారాత్” చూసాను. అప్పటికి అది ఓ విలక్షణమయిన సినిమా అనిపించింది. చురాలియా.. లాంటి పాటలు ఆనాడే ఆకట్టుకున్నాయి. ఇక డిగ్రీలో వుండగా నటరాజ్ టాకీసు లో “కభీ కభీ” కూడా మూడుసార్లు మూడురోజులు వరుసగా మ్యాటినీ షో లు చూసాను. ‘కభీ కభీ’ లో ‘మై పల్ దో పల్  కా షాయర్’ లాంటి పాటలు కట్టేసాయి.తర్వాత ఎప్పుడూ ఒకే సినిమాని అనేక సార్లు చూడలేదు.

***

          అట్లా మంథని లో రెండునెలలు గడిచాయో లేదో నన్నుసిరిసిల్ల జూనియర్ కాలేజీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఆ విషయం చెబుతూ ప్రిసిపాల్ గణపతి బాగానే పైరవీ చేసావు..చూడ్డానికి అమాయకంగా ఉంటావు గని అన్నాడు. నేను నవ్వి నాకేమీ తెలీదు మా మామయ్య డాక్టర్ ఒకరు వున్నారు తన పనే అయివుంటుంది అన్నాను. రిలీవర్ వచ్చేంత వరకు నిన్ను వదిలేది లేదు అన్నాడు. నాకేమీ అర్థం కాలేదు.

          తర్వాత రఘుపతి మామయ్య చెప్పాడు. తనప్పుడు వేములవాడలో మెడికల్ ఆఫీసర్. సిరిసిల్ల లయన్స్ క్లబ్ లో ఆక్టివ్ గా ఉండేవాడు. అప్పుడే సిరిసిల్లకు చెందిన వ్యాపార వేత్త భోగ వెంకట స్వామి తో కలిసి ఎదో పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. మాటల సందర్భం లో నా గురించి ప్రస్తావనవస్తే మన ఎంఎల్ ఏ  సి హెచ్ రాజేశ్వర్ రావు గారు ఇక్కడే కదా వెళ్దాం పదండి అని ఎం.ఎల్.ఏ. క్వార్టర్స్ కి వెళితే ఆయన అందుబాటులో లేక పోవడంతో వెనుతిరిగారు. ముందు చూస్తే నేరెళ్ళ ఎం.ఎల్.ఏ శ్రీ పాటి రాజం కనిపిం చారట. డాక్టర్ గారు వెంకట స్వామిగారు ఏటో వచ్చారు అని అడిగాడంట. ఒక చిన్న పని మీద ఎంఎల్ ఏ  సి హెచ్ రాజేశ్వర్ రావుగారి వద్దకు వచ్చాం ఆయన లేరు అంటే ఏమిటా పని మేం చేయమా అన్నాడంట పాటి రాజం. అప్పుడు మా అల్లుడు మంథని కాలేజీలో పనిచేస్తున్నాడు. మన సిరిసిల్లా కాలేజీలో ఖాళీ వుంది ట్రాన్స్ఫర్ కావాలి అనగానే అయ్యో పదండి అని హైయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీసుకు పోయారంట. అక్కడ జేడీ సుబ్బరాజుని కలిసి పాటి రాజం గారు విషయం చెప్పగానే అప్లికేషన్ ఇవ్వండి సర్ వెంటనే చేస్తాం అన్నాడంట. నా అప్లికేషన్ రెడీ గా లేదు. మామయ్యే బయట కొచ్చి తానే రాసి వెళ్ళి  ఇచ్చాడంట. ఏముంది రెండు రోజుల్లో ఆర్డర్ మంథనికి వచ్చింది. అప్పటి లీడర్లు అట్లా వుండే వాళ్ళు ఆఫీసులూ అట్లా పనిచేసేవి.

          బదిలీ ఆర్డర్ అయితే వచ్చింది కానీ రిలీవ్ చేయడం లేదు. ఇంతలో వరంగల్ నుంచి పార్థసారధి అనే అతను పూర్తి స్థాయి ప్రిన్సిపాల్గా వచ్చాడు. అతనూ అంతే భీష్మించుకు కూర్చున్నాడు. మళ్ళీ పైరవీ స్టార్ట్. మేము డిగ్రీ చదివే టప్పుడు ధర్మయ్య గారు బాటనీ హెడ్ గా చేసే వారు తర్వాత కరీంనగర్ విద్యాశాఖాధి కారిగావచ్చారు. ఆయన మా మేన వదిన రాణి వాళ్ళాయన డాక్టర్ లక్ష్మినారాయణ గారికి మేన మామ. అట్లా మాకు కొంచెం చుట్టరికం వుంది. ఆయన మంథని స్కూలుకు ఇన్స్పెక్షన్ కు వచ్చాడు. అది తెలిసి మళ్ళీ రఘుపతి మామయ్యే ఒక మాట చెప్పండి అంటే స్కూలు కాలేజీకి ప్రిన్సిపాల్ ఒకడే కనుక రిలీవ్ చేయమని కొంచెం సీరియస్ గానే చెప్పాడు. ఇక ఏ ముంది చార్జ్ తీసుకొమ్మని రాజిరెడ్డికి చెప్పి వెంటనే రిలీవ్ చేసారు. కాని ఆ రోజు కరీంనగర్ హోటల్ ఆశోకాలో పార్టీ ఇవ్వాల్సి వచ్చింది. ఫిజిక్స్ లెక్చరర్ ఎం.ఎస్.మాధవ రావు నేనూ ప్రిన్సిపాల్ పార్థసారధి మరొకరెవరో వుంటే పెద్ద మందు పార్టీ ఇచ్చాను.

          మర్నాడు మళ్ళీ కొత్త ఊరు కొత్త కాలేజీ కొత్త వాతావరణం… శురూ

          ప్రభుత్వ జూనియర్ కాలేజీ సిరిసిల్లా లో కొత్త ప్రస్థానం ఆరంభమయింది.

***

సిరిసిల్లా-పాత వూరు-కొత్త ప్రస్తానం

ప్రభుత్వ ఉద్యోగుల మొతాద్ ఎంత.. పావలా కవర్ వస్తే చాలు పెట్టె బేడా సర్దాల్సిందే.. చిన్నప్పుడెప్పుడో మిఠాయి దుకాన్లో విన్న మాట. నాకూ నిజమయింది. బదిలీ కవర్ రాగానే  కొన్ని అడ్డంకుల్ని తప్పించుకుని మంథని జూనియర్ కాలేజీ నుండి బయలుదేరాను, మొత్తంగా మంథని ఊరుని, అక్కడి మనుషుల్ని పూర్తిగా చూడకుండానే ఆ ఊరును వదిలేసాను. ఇక ఏముంది నా  ఉద్యోగపర్వంలో రెండవ మజిలీ ఆరంభం. సిరిసిల్లా తెలిసిన ఊరే. తెలిసిన మనుషులే. దగ్గరి బంధువులున్న ఊరే. వేములవాడ అంత కలె దిరిగిన వూరు కాదు కానీ అప్పటికే అక్కడ నాకు కొన్ని జ్ఞాపకాలున్నాయి. ఎప్పుడయినా ఏ వూరయినా ఏ  మనుషులయినా కాలగమనంలో ఎన్నో అనుభవాల్ని, జ్ఞాపకాల్ని మిగులుస్తారు. అందులో సంతోషం పంచినవి, దుఖం కలిగించినవీ కూడా వుంటాయి. గుర్తుంచుకుంటే తరచి చూసుకుంటే జీవితంలో ప్రతి మలుపూ ప్రతి మజిలీ స్మరనీయమయినవే. అట్లా సిరిసిల్లా చేరగానే మొదట గుర్తొచ్చినవి అక్కడి బంధుత్వాలు ఆ మనుషులు. తర్వాతి కాలంలో 

        నా ఉద్యోగ పర్వం ఫలితంగా ఏర్పడిన పరిచయాలు వాటిని మించిన సృజనాత్మక లోకంలో ఏర్పడిన అనుబంధాలు గొప్పవి. చిరకాలం నిలిచిపోయేవి.

***

          మొదట సిరిసిల్లా లో నాకున్న బంధుత్వాలని, అనుబంధాలని యాది జేసు కుంటాను.

          ఆ వూరిలో నాకున్నబంధువుల్లో ముఖ్యమయినది మా మేనత్త సక్కుబాయి. మా నాన్నకు ఇష్టమయిన చెల్లెలు. పోగా ఆమెను తానొక్కడే ప్రమీలా అని పిలిచేవాడు. ఆమె శ్రీవారు ఆకుల శంకర్. జూనియర్ కాలేజీలో క్లర్క్ గా పనిచేసేవాడు. వాళ్లకు ఒక కూతురు ముగ్గురు కొడుకులు. వసంత, శ్యాం సుందర్, రవి, ప్రకాష్. శ్యాం నాకంటే సీనియర్ కాగా రవి నా బాచ్. నేను ఇంటర్ చదువుతున్న కాలమది. మొదటి సంవత్సరం పూర్తి కాగానే మా నాన్న నన్ను సిరిసిల్లకు పంపించాడు. తనకు చిన్నప్పటి అతి దగ్గరి మిత్రుడయిన బాలమల్లయ్యగారి అన్న నాగమల్లయ్య సిరిసిల్లాలో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తూ ఉండే వాడు. ఎండాకాలం సెలవుల్లో నన్ను ఆయన వద్దకు కెమిస్ట్రీ కోసం పంపించాలని నాన్నకు అనిపించి పంపాడు. ఇంకేముంది. నేను సక్కుబాయి అత్త ఇంట్లో మకాం. సిరిసిల్ల వెంకటేశ్వర ఆలయం వద్ద వున్న వాళ్ళ ఇంట్లో ఉంటూ నాగమల్లయ్య సార్ దగ్గరికి ప్రైవేట్ కోసం వెళ్లేవాన్ని. నాతో పాటు శ్యాం కూడా వచ్చేవాడు. అక్కడికి వచ్చే వాళ్ళల్లో సుధ అనే అమ్మాయి ఇంకా గుర్తుంది. తానేప్పుడో మర్చిపోయి వుంటుంది. అట్లా ఆ ఎండాకాలం కెమిస్ట్రీతోనూ వారి ఇంట్లోనూ గడిచింది. కానీ ఆ అనుబంధం ఎందుకో నాతో బలపడలేదు. అట్లని దూరమూ కాలేదు. సిరిల్లా కాలేజీలో ఉద్యోగంలో చేరినప్పుడు శంకర్ మామ అక్కడే పనిచేస్తూ ఉండేవాడు. కాలేజీ టర్మ్స్ లో కూడా నేను తనతో అంత గా కలిసి పోలేదు. ఎందుకో తెలీదు కానీ ఆ కాలేజీలో పనిచేసిన నాలుగేళ్ళల్లో వాళ్ళింటికి నాలుగు సార్లు వెళ్లిందీ లేదు.

***

          సిరిసిల్లలో వున్న మరో అనుబంధం రంగయ్య వకీలు, సిరిసిల్లా పెద్దమ్మ వాళ్ళది. మా తాతయ్య కొల్లాపూరు నుంచి వేములవాడకు రాక ముందే సిరిసిల్లాలో పెద్ద పేరున్న వకీలు రాంచందర్ రావు. తాతయ్య వాళ్ళ అన్న. ఆయన కూతురు విశాలాక్షి( సిరిసిల్ల పెద్దమ్మ అనేవాన్ని). అల్లుడు రంగయ్య గారు కూడా వకీలే. వారికి ఒక కూతురు, ముగ్గురు కొడుకులు. కూతురు ప్రమీల గొప్ప మానవ విలువలుకల మనిషి. ప్రేమలు అనుబంధా లూ కలగలిసిన ప్రేమ మూర్తి ఆమె. ఆమె మంచితనం బాధ్యతా గుణం వల్లనే మంగారి కుటుంబం పది కాలాల పాటు నిలబడింది. ఉమ్మడిగా ఎదిగింది. తను తనకు మేనమామ వరుసయిన మా రఘుపతి మామయ్యను పెళ్ళాడడంతో నాకు అక్క కావాల్సిన తను అత్తయ్య అయింది. సిరిసిల్ల పెద్దమ్మ కొడుకుల్లో మొదటివాడు ప్రొఫెసర్ డాక్టర్ రాంచందర్. ఉస్మానియాలో పనిచేసాడు. రెండవ అన్నయ్య డాక్టర్ వెంకటేశ్వర్లు. కామా రెడ్డిలో డాక్టర్ గా పనిచేసి. వైద్యుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. విలువలతో బతికాడు. అందరిపట్లా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండేవాడు. ఇక మూడవ వాడు డాక్టర్ శేషగిరి చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. సిరిసిల్లాలో పనిచేసిన రోజులకంటే అంతకు ముందే ఆ ఇంటితో నాకు అనుబంధం వుండేది. నాకు సిరిసిల్లా పెద్దమ్మ అంటే గౌరవమూ అభిమానమూ అంతే కాదు ప్రమీలత్తమ్మ తల్లి అని కూడా కొంత మొగ్గు వుండేది.

***

          ఇక సిరిసిల్లలో మరో కుటుంభం రాజేశ్వరమ్మమ్మ వాళ్ళది. తనకు మా అమ్మకు దగ్గరి పోలికలు. ఇద్దరివీ అమాయకత్వం నిండిన చూపులు. ప్రేమ నిండిన మాటలు. వాళ్ళది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం. వాళ్ళ అబ్బాయి పేరుకూడా ఆనందే. అందరూ నందూ అని పిలిచేవాళ్ళు. అన్ని శుభ కార్యాలకూ వచ్చేవారు.అన్ని కష్ట సందర్భాల్లోనూ వుండేవాళ్ళు.

***

          సిరిసిల్లలో నన్ను బాగా ప్రభావితం చేసిన కుటుంబం ఆనందమ్మ పెద్దమ్మ వాళ్ళది. అక్కడ నేను పనిచేసిన నాలుగు సంవత్సరాలూ నేను బాగా దగ్గరగా కలివిడిగా తీరిగిన ఫామిలీ అది. గోవర్దన్ పెదనాన్న మా అమ్మకు మేనబావ వరుస. మా కాలేజీ స్కూలు విభాగంలో అధ్యాపకుడిగా పని చేసేవాడు, అత్యంత సౌమ్యుడు. వాళ్లకు నలుగురు అమ్మాయిలు. రాజ్యలక్ష్మి(రాజ్యం అక్కయ్య), ఉమా రాణి, కృష్ణవేణి (కృష్ణ), శ్రీదేవి. తమకు అందరూ అమ్మాయిలే అనేమో ఆనందమ్మ పెద్దమ్మ నన్ను సొంత కొడుకులా చూసేది. అంతా అన్నయ్యా అంటూ అభిమానంగా వుండేవాళ్ళు. వారంలో రెండు సార్లు మధ్యాహ్నం కిషన్ సార్ స్కూటర్ తీసుకుని వాళ్ళింటికి వెళ్ళడం. టిఫిన్లు టీలు నాకు సర్వ సాధారనమయి పోయిన్దక్కడ. అంత కలివిడిగా వుండే ఆ ఇంట్లో తర్వాతి సంవత్సరాలల్లో మూడు విషాదాలు జరిగాయి ఒకటి గోవర్ధన్ పెదనాన్నమరణం. తర్వాత అనారోగ్యంతో రాజ్యం అక్కయ్య మృతి, తర్వాత కృష్ణ వేణి భర్త ప్రొఫెసర్ రమేష్ రోడ్డు ప్రమాదంలో పోవడం. మౌనంగా కన్నీళ్ళు కార్చడం తప్ప వాళ్ళను ఎట్లా ఒదార్చ గలను.

***   

          అట్లా సిరిసిల్ల అనగానే బంధువుల్లో ఆ నాలుగు కుటుంబాలూ మదిలో మెదులు తాయి. అవట్లా వుంటే అప్పటికి సిరిసిల్ల అంటే కల్లోలిత ప్రాంతంగా పేరు. నిమ్మపల్లి కోనారావుపేట పోరాటాలూ, ఆంక్షలు నిషేదాలూ వున్న గ్రామాలు. కాలేజీ విద్యార్థుల్లో కూడా ఆ చైతన్యం కనిపించేది.

          నేను జూనియర్ కాలేజీలో చేరిన మొదటి రోజు అనుభవాలు ఇంకా ఫ్రెష్ గానే వున్నాయి. పగలు కాలేజీ కనుక 12 గంటలకల్లా కాలేజీ చేరాను. మొదట ఆఫీసులో క్లర్క్ గా ఉన్న శంకరయ్య మామను కలిసాను. అక్కడే టైపిస్టు మల్లారెడ్డి, భూమ్రెడ్డి లకు హాయ్ చెప్పాను. ప్రిన్సిపాల్ శ్రీ కే.మోహన్ రావును కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి బయటకు రాగానే. ఏయ్ హలో అన్న పిలుపు వినిపించి వెనక్కి చూస్తే శ్రీధర్ రావు సార్. ఒక్క సారిగా సంభ్రమాశ్చర్యాలు ముప్పిరిగొన్నాయి. తను నాకు ఇంటర్ లో ఫిజిక్స్ చెప్పాడు. అరె నువ్వా ఆనంద్ కదా అన్నాడు. నమస్తే సర్ అన్నా. అందరితో బిగ్గరగా ఆనంద్ నా స్టూడెంట్ ఇప్పుడు కొలీగ్. చాలా సంతోషంగా వుంది. పద ఇంటికి వెళ్దాం. భోజనం చేసి వద్దాం అన్నాడు. తిని వచ్చాను సార్ అన్న వినిపించుకోకుండా బండి మీద ఎక్కించు కుని తమ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లో కూడా నా స్టూడెంట్ ఇప్పుడు నా కొలీగ్ అంటూ పరిచయం చేసాడు. నాకు మొదటి రోజు ఎంతో ఉత్సాహం కలిగింది. తిరిగి కాలేజీకి వచ్చి మిగతా స్టాఫ్ ని పరిచయం చేసుకున్నాను. అప్పుడక్కడ సివిక్స్ చెప్పే శ్రీ బి.నారాయణ రెడ్డి సార్  మా నాన్నకు చిరకాల మిత్రుడు. నా క్కూడా చిన్నప్పటి నుండే తెలుసు. ఎకనామిక్స్ లక్ష్మణ్ రావు సర్, బాటనీ రమణయ్య, మాత్స్ సాంబయ్య, ఇంగ్లిష్ జయంత్ కుమార్, హిస్టరీ జగన్నాధ చార్య అట్లా అందరినీ కలుస్తూ వుంటే తెలుగు అధ్యాపకుడు పార్వెల్ల గోపాలకకృష్ణ గారూ కలిసారు. ఆయన నాకు గంజ్ స్కూల్లో కొంత కాలం తెలుగు చెప్పారు. తర్వాత జువాలజీ లాబ్ కు వెళ్తే అక్కడ వేములవాడకు చెందిన లెక్చరర్ యాద కిషన్, కామర్స్ లెక్చరర్ మామిడిపల్లి  రాజన్నలు కలిసారు. వాళ్ళతో అంతకు ముందు పెద్దగా స్నేహం లేకున్నా పరిచయం వుండేది. నేను డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి మనవడినని తెలుసు వాళ్ళకు. జాయిన్ అయిన మొదటి రోజు అందరినీ కలవడంతో సరిపోయింది. అది మార్చి నెల కావడంతో అప్పటికే ఎండలు పెరుగుతున్నాయి. కాలేజీ బిల్డింగ్ అంతా చూస్తుంటే పాత హైస్కూలు భవనం. దానికి తోడు లాబులకు క్లాసులకు, రేకుల షెడ్లు. ఆఫీసు, ప్రిన్సిపాల్ గదులు మాత్రం సిమెంట్ కట్టడాలు. బిల్డింగ్ వెనకాల విశాల మయిన క్రీడా మైదానం. ఎంట్రన్స్ గేటు నుంచి విశాలమయిన దారి. కాలేజీ వాతావరణం బాగా నచ్చింది. నాకు అంతే కాదు ఇదే కాలేజీలో కదా నా అనేక మంది మిత్రులు చదివింది అనిపించింది. అట్లా  అనిపించగానే వాళ్ళు చదివిన చోట నేను ఉద్యోగం కోసం కోసం వచ్చాను. వాళ్ళ చదివులింకా ముగియనే లేదు. చిన్ననాటి స్నేహితులు పి.ఎస్.రవీంద్ర, శివన్న బావ, సాంబశివుడు, రమేష్ చంద్ర, రమేష్ ఇట్లా అనేక మంది చదువుకు, వారి పరీక్షల రద్దుకు ఇది వేదిక అయింది అన్న విషయం గుర్తుకు రాగానే ఎట్లాగో అనిపించింది.

          ఆ రోజు ముగించుకుని సాయంత్రానికి కరీంనగర్ చేరుకున్నాను. మళ్ళీ తెల్లవారితే సిరిసిల్ల ప్రయాణం. కొంత ఉత్సాహంగానే వుండేది. కాలేజీకి కొంచెం ముందు చేరగానే అక్కడ స్కూలు విభాగంలో పని చేస్తున్న తెలుగు అధ్యాపకుడు మా వఝల శివ కుమార్ వాళ్ళ నాన్న శ్రీ సాంబశివ శర్మ కనిపించారు. వారీ ఆనందూ జైన్ అయ్యవటగా సంతోషం అన్నాడు. నాకూ సంతోషంగానే అనిపించింది. ఇక పీ ఈ టీ గా వున్న దేవరాజం సార్ మా నాన్నకు బాగా తెలిసిన కొలీగ్. అంజన్న కొడుకా బాగున్నావా అని పలకరించాడు. ఇక ఎన్.సి.సి. నారాయణ సార్ కూడా పెద్ద దిక్కులాగె అనిపించాడు. అయినా మనం పనిచేసేది కాలేజీ లో కదా అనుకున్నాను.

          ఇక ప్రిన్సిపాల్ మోహన్ రావు ది ఖమ్మం జిల్లా. సనాతన బ్రాహ్మడు. తెల్లటి దోతీ అంగీలతో కొంచెం కలివిడిగానూ మరికొంత కటువుగానూ వున్నట్టు అనిపించింది. స్కూలు కాలేజేలకు తానే హెడ్.  శ్రీధర్ రావు సార్ పరిచయంతో నాకు ప్రిన్సిపాల్ వద్ద గౌరవాభిమా నాలే దక్కాయి. కాలేజీలో బి.నారాయణ రెడ్డి లక్ష్మణ్ రావు తదితరులది ఒక వర్గమని శ్రీధర్ రావు రాజన్న మొదలయిన వాళ్ళది మరో వర్గమని రెండు రోజులకే అర్థం కాసాగింది. శ్రీధర్ రావుది  ప్రిన్సిపాల్ అనుకూలవర్గం గానూ మిగతా వాళ్ళు వ్యతిరేక వర్గం గానూ నాకర్థమయింది. వాటన్నింటితో మనకేం పని. మొదట అందరినీ అర్థం చేసు కోవాలి. విద్యార్థులతో సహా అందరిలో కలిసిపోవాలి. అదీ అప్పటి నా ఎజెండా.

          అట్లా కాలేజీ వాతావరణంలో సెటిల్ అవుతూనే కరీంనగర్ నుంచి రోజూ రావడం కాదు కాని సిరిసిల్లలో రూము తీసుకోవాలని ఆలోచించడం మొదలు పెట్టాను. అది తెలిసి. అక్కడెందుకు వేములవాడ ఇంట్లో వుండి రోజూ పోయి రావచ్చు అన్నాడు రఘుపతి మామయ్య. ఒక రకంగా అది ఆర్డరు. నాన్నని అడిగితే నీ ఇష్టం అన్నాడు. అప్పటికి తాతయ్యతో వున్న సాన్నిహిత్యం కూడా వేములవాడలో ఉండడానికి మరో కారణం.

          ఏ ముంది బట్టలు తీసుకుని వేములవాడకు చేరుకున్నాను. దాంతో వేములవాడ సిరిసిల్లా ప్రస్థానం ఆరంభయింది.

 

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.