
పల్లె ముఖచిత్రం
(నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)
– రామా రత్నమాల
నీరవ నిశీధి వేళ జలతారు చంద్రిక వెలుగులో మెరుస్తూ
హేమంత హిమ సుమజల్లులో తడిసే అందచందాలు
సప్తవర్ణ శోభిత హరివిల్లు హొయలన్నీ భువికేగి
రంగవల్లులై విరిసిన ముంగిళ్ళు
పాలికాపు పొలికేకతో పొలాల వైపు పయనించే పద సవ్వడులు
రజని చెక్కిలిపై జాబిలి వెన్నెల సంతకమద్దే వేళ
కష్ట సుఖాల కలబోతలు
శ్రమ జీవన సౌందర్యాన్ని చాటే జానపద జావళీలు
మదిని దోచి అల్లుకునే ఆత్మీయతానురాగలతలు
కాల గమనంలో హిమంలా కరుగుతున్న పల్లె స్వప్నం
ప్రపంచీకరణ పంజాలో చిక్కిన పల్లె అస్తిత్వం
పట్టణ ఛాయలో మారిన పల్లె ముఖచిత్రం
ఎప్పటికీ ఆగని ఋతుగీతం
ఎన్నటికీ తీరని రైతు శోకం
పల్లెలు పూర్వ వైభవ కాంతితో వెలగాలి
హరిత హేమంతో హాలికుని దుఃఖం
దూదిపింజలా ఎగిరిపోవాలి!
****

అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబాబాద్ నివాసం : హన్మకొండ నేను వచన కవితలు , నిక్కూలు, మొగ్గలు, మణి పూసలు మరియు వ్యాసాలు రాస్తున్నాను. వివిధ సంస్థలు నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీలలో విజేతగా నిలిచాను. పలు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి కవిసమ్మేళనాలలో పాల్గొనుట, జాతీయ సదస్సులలో పత్ర సమర్పణ, పలు కవితా సంకలనాలలో కవితలు ముద్రితం.
