
“నెచ్చెలి”మాట
యుద్ధం గోల
-డా|| కె.గీత
‘ఇంకా
ప్రపంచం
కరోనా దెబ్బ నించి
కోలుకోకముందే
ఈ యుద్ధం గోలేవిటో’
అని పెదవి విరుస్తున్నామా!
‘అయ్యో పాపం
యుక్రేనియన్లు!’
అని పాప్ కార్న్ నములుతూ
తాపీగా న్యూస్ చూస్తున్నామా!
‘సోషలిస్టులని విర్రవీగినందుకు
మా బాగా అయ్యింది’
అని దెప్పి పొడుస్తున్నామా!
యుక్రేనియన్లతో బాటూ
ప్రపంచానికే ముప్పు పొంచి ఉందని
మర్చిపోతున్నామా?
అసలు
యుద్ధం
వ్యాధి
కంటే
బలమైనది
ఘోరమైనది
దుర్మార్గమైనది
అని తెల్సుకుంటున్నామా?
అవతలి వాడు
రష్యా అయితేనేంటి?
అమెరికా అయితేనేంటి?
బలహీనుల్ని అణగదొక్కడమే
న్యాయమైన
దుష్ట ప్రపంచాన్ని
వేలెత్తి చూపిస్తున్నామా?
పాపం
పసిపిల్లలు-
పాపం
యువతులు-
పాపం
తల్లులు –
పాపం
వృద్ధ మహిళలు-
ఎక్కడి యుద్ధానికైనా
బలయ్యేది
జీవితాన్ని
వెనక్కి తిప్పుకోలేని
దెబ్బ తినేది
వీళ్లే-
మనం కంటినిండా
నిద్రపోతున్నప్పుడు
ఎప్పటికీ
నిద్ర పోలేని
బతుకుల్నీడ్చేది
వీళ్లే-
అయినా మనకెందుకులే
యుద్ధం
యుక్రేనియన్ లోనే కదా!
పాప్ కార్న్ అయిపోతే
బఠాణీలు
నములుతూ
న్యూస్ చూస్తాం అంతే కదా!!
****
నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం:
ప్రతినెలా నెచ్చెలి పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తాం. బహుమతి మొత్తాన్ని కామెంటు రాసిన వారికే కాక ఆర్టికల్ కు సంబంధించిన రచయిత/త్రికి కూడా పంచుతాం. పాతరచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.
వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!
*****
ఫిబ్రవరి, 2022 లో బహుమతికి ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:రత్నాకర్ పెనుమాక
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ఎవరికి ఎవరు (కథ), రచయిత్రి: కాళ్ళకూరి శైలజ
బహుమతిగ్రహీతలకు అభినందనలు!

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
