పౌరాణిక గాథలు -1

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

రచయిత్రి పరిచయ వాక్యాలు

          శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరిగారు బాలసాహితీవేత్తగా విశేష రచనలు చేశారు. బాలల గేయకావ్యం తెలుగుభాషోద్యమ కోణంలోంచి చేసిన ప్రసిద్ధ రచన ‘ముంగిటిముత్యాలు’ పురస్కారాన్ని అందుకుంది. వీరి పరిశోధనాత్మక రచనలు మన ప్రాచీన సంస్కృతికి సంబంధించిన అనేక విశేషాలను వెలుగులోకి తెచ్చాయి. ఇప్పటి వరకూ 20కి పైగా పుస్తకాలు వెలువడ్డాయి. చిన్న పిల్లలు తమంత తాముగా చదివి అర్థం చేసుకో గలిగేలా వీరి రచనా శైలి ఉంటుంది.

          వీరి ఆధ్యాత్మిక రచనలు కూడా బాలలకి చదువుకునేందుకు వీలుగా వాడుక భాషలోనే ఉంటాయి. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో 20 సంవత్సరాలుగా జాతీయ, అంతర్జాతీయ సాహితీ సదస్సులకు నిర్వహణా సహకారం, ప్రత్యేకసంచికలకు.. సంపాదక సహకారం అందించారు.

          రేడియో, దూరదర్శన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనేక కవిసమ్మేళనాలు నిర్వహించి వర్ధమాన కవుల్ని ప్రోత్సహిస్తున్నారు. వివిధ విషయాల్లో పరిశోధనా వ్యాసాలు వ్రాసారు, పత్ర సమర్పణలు చేశారు.

          లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థలో గత 18 సంవత్సరాలుగా విశేష సేవలు చేస్తూ క్లబ్ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను వివిధ పదవులు నిర్వహించి పురస్కారాలు అందుకున్నారు. ఉగాది పురస్కారాలు, అంతర్జాతీయ మహిళాదినోత్సవ పురస్కారాలు, అంతర్జాతీయ తెలుగు భాషాదినోత్సవ పురస్కారాలు అందుకున్నారు. 2021 కృష్ణాజిల్లా స్వర్ణోత్సవ వేడుకలకు ‘కృష్ణాజిల్లా రచయితల సంఘం విహంగ వీక్షణం’ ప్రదర్శన, నిర్వహణలకు గౌ|| జస్టిస్ ఏ.వి. శేషసాయి, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగారితోను, 2022 అమృతోత్సవాల్లో భాగంగా అమృత భారతి పుస్తకావిష్కరణలో వ్యాసకర్తగా గౌ.జస్టిస్ భట్టుదేవానంద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగారితోను సత్కారము అందుకున్నారు.

          ప్రస్తుతం కృష్ణజిల్లా రచయితల సంఘం, ప్రపంచ రచయితల సంఘంలో కార్యదర్శిగా తెలుగు భాషా పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. కోవిడ్ సమయంలో కోవిడ్ అనారోగ్యం కాదు ఆరోగ్యాన్ని రక్షించుకోడం ఎలాగో తెలియచెప్పే ‘అమ్మతల్లి’ అని తెలియచేస్తూ బాలసాహిత్యంలో చతుష్పదలు రచించారు.

***

మహాభారతం- మహోన్నత భారతం

మహాభారతకథలు

          మన దేశాన్ని ‘మహోన్నత భారతం’ అని చెప్పుకుంటున్నాం కనుక దాని గురించి మనకి కొంతైనా తెలియాలి కదా! ‘నెచ్చెలి అంతర్జాల వనితా పత్రిక’ స్థాపించిన డా. కె. గీతగారు, బాలనెచ్చెలి శీర్షికలో పిల్లలకి మంచి విషయాలు ఉండే కథలు రాయండి” అని అడిగారు. బాల బాంధవి, బాలసాహితీవేత్త బిరుదులు అందుకున్న నాకు బాలల్ని అంతర్జాలంలో కలుసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది. డా.కె. గీతగారిక హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను.

          మనం జంతువులు, పక్షులు గురించి కథలు వినే స్థాయి దాటి వచ్చేశాము. కనుక మనము పుట్టక పూర్వం జరిగిన విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ‘మహాభారత కథలు’ చదువుతున్నాం’. భారతజాతి గొప్పతనం కొత్త తరానికి తెలియ చెయ్యాలన్నదే నా ఆకాంక్ష. 

          భారతజాతి గొప్పతనం తెలుసుకోవడం, తరతరాలకి అందించడం ప్రతి భారత పౌరుడి బాధ్యత. ఎంతోమంది తపస్సంపన్నులు, జ్ఞానవంతులు, త్యాగధనులు, పరాక్రమవంతులు తమకోసం కాకుండా ప్రజల కోసమే జీవించినవాళ్ల గొప్పతనాన్నీ, సంస్కృతీ సంప్రదాయాల్నీ తెలుసుకోకపోతే భారతీయుడు అని ఎలా అనిపించుకుంటాడు?

          కుటుంబంలో ఉండే ప్రతి సభ్యుడు తన తాతముత్తాల గురించి తన వంశ చరిత్ర గురించి తెలుసుకుని ఆ వంశ గౌరవం నిలబెట్టాలి అని పెద్దలు చెప్తుంటారు కదా! అలాగే మన భారతదేశం మొత్తం ఒక కుటుంబం కదా! అటువంటప్పుడు మనదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? మనదేశ సంస్కృతి సంప్రదాయాలు ఏమిటి? మనదేశ ప్రముఖులు ఎవరు? అనే విషయాలు మొత్తం తెలుసుకుని తీరాలి! 

          ఇంత మంచి పేరు, పవిత్రత, ఆధ్యాత్మికత, దయాగుణం, పరాక్రమం, పెద్దల యందు పూజ్యభావం, ప్రకృతి ఆరాధన, క్రమశిక్షణ ఇలా ఎన్నో విషయాలతో కలగలిసిన మన సంస్కృతీ సంప్రదాయాల్ని గురించి మనం అన్ని తరాలకి అందించగలగాలి. అప్పుడే మనదేశ ఔన్నత్యం భవిష్యత్తులో కూడా ఈ విశాల విశ్వంలో మహోన్నతంగా నిలుస్తుంది.

          ఇప్పుడు ఈ కథలు చదివిన మీరు పెద్దవాళ్లయ్యాక పెద్ద గ్రంథాలు చదివి అర్థం చేసుకోగలుగుతారు. 

          ఈ మహాభారతం అసలు ఎవరు రాశారు… సంస్కృత భాషలో వేదవ్యాసుడు వేగంగా అవలీలగా చెప్తుంటే.. అప్పటికప్పుడే అర్థం చేసుకుంటూ, తెలియనివి అడిగి  తెలుసు కుంటూ శివపార్వతుల కుమారుడు విఘ్నేశ్వరుడు అంతే వేగంగా రాశాడు. దాన్ని సామాన్య మానవులుగానీ, పిల్లలుగానీ ఉపయోగించుకోలేక పొతున్నారని నన్నయ, ఎర్రన, తిక్కన తెలుగు భాషలోకి అనువదించి మన జాతి గురించి మనకి తెలియ చేసి ఎంతో మేలు చేశారు.

          వ్యాసుడు ఎందుకు రాశాడు… “పూర్వం వేదం మొత్తం ఒక్కటిగా ఉండేది. అలా ఉన్న వేదాన్ని వ్యాసమహర్షి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని నాలుగు భాగాలుగా విభజించాడు. అలా చెయ్యమని వ్యాసుడికి బ్రహ్మ చెప్పాడు. వేదాలు విభజించాడు కనుక వ్యాసుణ్ని ‘వేదవ్యాసుడు’ అని పిలిచారు.

          తరువాత దాన్ని తన శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే మహర్షులకి బోధించాడు. వరుసగా ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్కళ్లకి చెప్పి నాలుగు వేదాల్ని నలుగురితో అధ్యయనం చేయించాడు. నలుగురు శిష్యులూ ఎవరికి బోధించిన వేదాన్ని వాళ్లు సంపూర్ణంగా నేర్చుకున్నారు.

          తపస్సంపన్నుడైన వేదవ్యాసుడు పద్ధెనిమిది పురాణాలు; నీతిశాస్త్రము; అర్ధశాస్త్రాల అర్థాలు, స్వభావాలు; నాలుగు వేదాలు, వాటి ఉపనిషత్తుల భావాలు; దర్మార్థకామ మోక్షాలతో అరిషడ్వర్గాలకు సంబంధించిన చక్కటి కథలు; ఇతిహాసాలు; కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో ఉన్న గొప్ప మహర్షుల, రాజుల వంశ చరిత్రలు; బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అని పిలవబడే నాలుగు వర్ణాలు; బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం అనే ఆశ్రమాల్లో ఉండే ధర్మాలు వాటి విధానాలు; నాలుగు ముఖాలున్న బ్రహ్మ మొదలైన దేవతలు; మహర్షులతో పూజించబడే శ్రీకృష్ణుడి మహత్యం; పాండవులు మొదలైన భారత శూరుల గుణగణాలు పరిపూర్ణమైన జ్ఞానంతో అందరికీ అర్థమయ్యేలా రచించాడు.

          ఆ మహాభారత కథల్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం! అంత మంచి పని చెయ్యమని ఎవరు సలహా ఇచ్చారు అని కదా మీ సందేహం? విమలాదిత్యుడు, రాజరాజ చోళుడి కుమార్తె కుందవాంబ దంపతులకి కుమారుడు, పవిత్రమైన మనస్సు, అస్త్ర విద్యలో గొప్ప నేర్పరితనము కలిగి చాళుక్య వంశానికి దీపంలా ప్రకాశించిన మహారాజు రాజరాజనరేంద్రుడు.

          ఒకరోజు నన్నయని పిలిచి “నాకు ఎప్పుడూ భారత కథలు వినాలనే ఉంటుంది. గొప్ప పండితుడవైన నన్నయకవీ! వ్యాసమహర్షి మహాభారతంలో చెప్పిన విషయాల్ని అందరికీ అర్థమయ్యేలా మీకు గల పాండిత్యంతో తెలుగులో వ్రాయండి” అని చెప్పాడు.

          మహాభారత కథలు ఎలా మొదలయ్యాయో తెలుసా… పూర్వం లోకాలకి మంచి జరగాలని బ్రహ్మర్షులందరు సేవిస్తుండగా మహాముని శౌనకుడు పన్నెండు సంవత్సరాలు జరిగే ‘సత్రము’ అనే యాగాన్ని చెయ్యడం మొదలుపెట్టాడు. అక్కడికి ‘రోమహర్షుడు’ అనే మహర్షి కుమారుడు ‘ఉగ్రశ్రవసుడు’ వచ్చాడు. ఉగ్రశ్రవసుణ్ని ‘సూతమహర్షి’ అని కూడా అంటారు. ఆయన పురాణ కథలు బాగా చెప్పగలడు.

          ఉగ్రశ్రవసుడు వచ్చి అక్కడ ఉన్న మహర్షులకి నమస్కారం చేశాడు.“నేను వ్యాసమహర్షి శిష్యుడైన రోమహర్షణుడు అనే గొప్ప పురాణికుడికి కుమారుణ్ని. పురాణాల్లో ఉన్న పుణ్య కథల్ని అన్నింటినీ చెప్పగలను. మీరు ఏ కథ వినాలని అనుకుంటున్నారో ఆ కథని నేను చెప్తాను” అని తనని తను పరిచయం చేసుకున్నాడు.

          మహర్షులందరికీ ఆయన చెప్పే కథలు వినాలని కోరిక కలిగింది. ఆయన్ని శ్రద్ధగా పూజించి “ఏ కథ బాగుంటుందో; ఏ కథ కొత్తగా, వింతగా ఉంటుందో; ఏ కథ వింటే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో; ఏ కథ పాపాలన్నింటినీ పోగొడుతుందో అటువంటి కథని వినాలని ఉంది” చెప్పమని అడిగారు. కథలు చెప్తుంటే వినాలని పిల్లలకే కాదు పెద్దవాళ్లకి కూడా ఉంటుందన్నమాట.

          మహర్షులతో “మీకు ఇష్టమైన, పవిత్రమైన ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినండి” అన్నాడు సూతమహర్షి. శౌనకుడు మొదలైన మహర్షులందరు సూతమహర్షి చెప్పే కథ వినడానికి సిద్ధంగా కూర్చున్నారు. మీరు ఇప్పుడు బుద్ధిగా ఎలా కూర్చున్నారో అలాగేనన్నమాట. మీరు కూడా వినండి మరి!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.