
ఎంత బాగుందో!
-శ్రీ సాహితి
ఈ ముసురులో
భలే చల్లావు నీ చూపును…
అదును చూసి మొలకెత్తింది కవితగా
అది నీ పెదాలకు చేరి సువాసనాలతో
తీపి శబ్దలుగా సంచరిస్తుంటే
ఎంత బాగుందో!
ఎప్పుడో వ్రాసిన ఉత్తరం..
ఆమెను తలుస్తూ
పోస్ట్ చేయడం మరిచాను.
ఆలేస్యంగా ఆమెకందిన నా అక్షరాలు
ఆమె నవ్వును
వెంటనే తిరిగి పోస్ట్ చేశాయి.
నా మాటను రాళ్లతో తరిమికొట్టావు…
ప్రేమకొద్దీ పరిగెత్తాను..
గాయం మాయకుండానే మళ్లివచ్చాను
మళ్ళీ తరమాలని చూశావు…కానీ
నీ దగ్గర రాళ్లు లేవు..
కన్నీళ్లున్నాయి.
ఆమెను
పుస్తకంగా దాచుకున్నాడు.
అక్షరం ముఖం తెలియకపోయినా
ప్రేమికుడుగా ప్రతి పరీక్ష విజయమే.
ఆమె ఓటమి అతనికి ఇష్టం లేని
సంతోషం.
ఊరి చివర
కొండ అవతల ఓ కీచు గొంతు
సన్నగా నిద్రలో సహితం గోల.
ఓ చిన్న రాయి లాంటి
ఓ కసురు చూపుకు
నిజం మాయం .
నీవు నాలో ఉదయంచని
రోజు నా అక్షరానికి
అమావాస్యే..
ఆ రాత్రి పుట్టిన కవితలు.
మనసంతా మెరిసే
నక్షత్రాలే…
*****

మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా నాన్నగారు పరిచయం చేసిన మహాకవి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం నా జీవితంలో ఓ గొప్ప మలుపు. క్రమంగా వచన కవిత్వము పట్ల అభిమానము కలిగి, నాకు తోచిన భావాలను వచనంలో వ్రాయడం అలవాటుగా మారింది.
