
గజల్
-జ్యోతిర్మయి మళ్ళ
మంచిచెడులు కలిసుండును మర్మమదే తెలుసుకో
హంసలాగ మంచినొకటె ఎంచడమే తెలుసుకో
అల్పునిదే ఆర్భాటం సజ్జనునిది చల్లని పలుకు
కంచువలె కనకం మోగదు సత్యమదే తెలుసుకో
గోవుపాలు కాస్తచాలు కడివెడేల ఖరముపాలు
భక్తితొ తినెడి కూడు పట్టెడు చాలునదే తెలుసుకో
పరుల చోట పరుగు తగదు తగ్గి ఉండిన తప్పు కాదు
కొండకూడ అద్దమందు కొంచమదే తెలుసుకో
తనువు గాని కూడబెట్టిన ధనము గాని సొత్తు కాదు
నీ ప్రాణమె నీ సొత్తు కాదు పోవునదే తెలుసుకో
(వేమన పద్యాల ఆధారంగా రాసిన గజల్)
*****

జ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. తొలి తెలుగు గజల్ వాగ్గేయకారిణి. హిందీ సాహిత్య రత్న కావడం వలన హిందీ, ఉర్దు గజళ్లను, ఆస్వాదిస్తూ, అర్ధం చేసుకోగలిగిన జ్యోతిర్మయి , తెలుగు లోగజల్స్ రాస్తారు , స్వయంగా సంగీతాన్ని సమకూర్చి అలపిస్తారు. జ్యోతిర్మయి గజల్ అకాడెమీ వ్యవస్థాపకురాలు. తెలుగు గజల్ను ప్రపంచ వ్యాప్తం చేయాలనే బలమైన సంకల్పం తో విస్తృత కృషి చేస్తున్నారు. పలువురి చేత గజల్స్ రాయించడమే కాదు వాటిని రాష్ట్ర సంస్కృతిక శాఖ వారి సహాయం తో ‘గజల్ గుల్దస్తా’ పేరిట సంకలనంగా తీసుకొచ్చారు. వివిధ నూతన ప్రక్రియలైన ‘గజల్ ఫ్యూజన్’ వంటి కార్యక్రమాలు, అలాగే గాంధీ 150 వ జయంతి వేడుకలలో భాగంగా, బాపు గురించి రచించిన గజల్ కార్యక్రమం, గజల్ పైన ఒక వర్క్ షాప్ ను కూడా సంస్కృతిక శాఖ సహాయం తో నిర్వహించారు. తెలుగు భాష మన పిల్లలందరూ నేర్చు కోవాలి అన్నదే తపన గా అందుకోసం కవితలు, గేయాలు, కథలు , బొమ్మలు , ప్రసంగాలు . చేస్తూ విస్తృత కృషి చేస్తున్నారు. ఇటీవలే బొల్లిమంత శివ రామకృష్ణ ట్రస్ట్. తెనాలి వారు ‘గజల్ జ్యోతి’ అనే బిరుదు తో సత్కరించారు. దాదాపు అన్ని టీవీ ఛానెల్స్ లోనూ , తెలుగు వెలుగు వంటి ప్రసిద్ధ పత్రికలలోనూ ఇంటర్వ్యూలు ఇచ్చారు
