నెచ్చెలి వ్యవస్థాపకులు & సంపాదకులు డాక్టర్ కె.గీతామాధవి (కె.గీత) గారికి డా.తెన్నేటి లత – వంశీ జాతీయపురస్కారం



వంశీ స్వర్ణోత్సవాల సందర్భంగా వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ వారు అమెరికాలోని కాలిఫోర్నియా నివాసురాలైన ప్రముఖ రచయిత్రి,  వ్యవస్థాపకులు & సంపాదకులు డాక్టర్ కె.గీతామాధవి (కె.గీత) గారికి,  ప్రముఖ రచయిత్రి “డా.తెన్నేటి లత – వంశీ” జాతీయ పురస్కారాన్ని ఆగస్టు 7 2022  ఆదివారం సాయంత్రం 6 గం.లకు హైదరాబాదులో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య కళా కేంద్రంలో ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ తనికెళ్ల భరణి గారు ప్రదానం చేసారు. ఈ కార్యక్రమాన్ని వంశీ ఆర్ట్స్ అధ్యక్షురాలు డా తెన్నేటి సుధాదేవి గారు నిర్వహించారు. 

ఈ సందర్భంగా గీతామాధవి గారు  సాధించిన విజయాల వివరాలు…

తూ.గో.జిల్లా జగ్గంపేటలో 1970 డిసెంబరు 11 న జన్మించిన డాక్టర్ కె.గీత  కవయిత్రి, రచయిత్రి, సంపాదకులు, గాయని, భాషా నిపుణులు. పూర్తి పేరు గీతామాధవి.  “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపకులు & సంపాదకులు. నివాసం అమెరికాలోని కాలిఫోర్నియా. అమెరికాలోని సాఫ్ట్ వేర్ రంగంలో  “తెలుగుభాషా నిపుణురాలి”గా పనిచేస్తున్నారు.  
 
ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి  కె. వరలక్ష్మి, శ్రీ కె.రామ్మోహన్రావు గార్ల పుత్రిక.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషాశాస్త్రంలో పిహెచ్.డి, అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు.  పది సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు.  2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు” పొందారు.  

ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017), అసింట (2022)  కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల ప్రచురింపబడ్డాయి. “అపరాజిత” (గతముప్పయ్యేళ్ల స్త్రీవాద కవితా సంకలనం 1993-2022) 2022 కు సంపాదకత్వం & ప్రచురణ  వహించారు. ‘గీతా కాలం’, “అనగనగా అమెరికా” అనే కాలమ్స్,  “నా కళ్లతో అమెరికా”, “యాత్రాగీతం” అనే  ట్రావెలాగ్స్,  “కంప్యూటర్ భాషగా తెలుగు” అనే తెలుగు, ఇంగ్లీషు భాషల్లో  భాషా పరిశోధనా వ్యాసాలు వీరి ఇతర రచనలు.

కవిత్వంలో అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు మొ.న పురస్కారాలు పొందారు.
 
2019 లో “తెలుగు టైమ్స్” వారిచే  అమెరికాలోని 17 మంది తెలుగు ప్రముఖుల్లో ఒకరిగా గుర్తించబడ్డారు.అమెరికాలోని “తానా” తెలుగు బడి “పాఠశాల”కి కరికులం డైరక్టర్ గా సేవలందిస్తున్నారు.  లలిత సంగీతం లో మంచి ప్రవేశం తో బాటూ అనేక బహుమతులు అందుకున్నారు.  2017 లో  “బట్టర్ ఫ్లైస్”  సినిమాతో గీత రచయితగా, గాయనిగా సినిమా రంగ ప్రవేశం చేశారు. “గీతామాధవి”  షార్ట్ ఫిలిమ్స్ అధినేత.


టోరీ తెలుగు రేడియోలో “గీతామాధవీయం” పేరుతో సంగీత, సాహిత్య టాక్ షో ని నిర్వహిస్తున్నారు.అమెరికాలో “వీక్షణం” సాహితీ వేదిక, “తెలుగు రచయిత” వెబ్సైటు వ్యవస్థాపక అధ్యక్షులు & నిర్వాహకులు.
 
 

*****

Please follow and like us:

2 thoughts on “నెచ్చెలి ఎడిటర్ డా.కె.గీత గారికి డా. తెన్నేటి హేమలత- వంశీ జాతీయ పురస్కారం”

Leave a Reply

Your email address will not be published.