
చరిత్రలో వారణాసి పట్టణం – 1
-బొల్లోజు బాబా
కాశి నేల ఎంతో మంది ఆథ్యాత్మిక వేత్తలను ఆకర్షించింది. బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్యుడు ఇక్కడకు వచ్చి తమవచనాలను బోధించారు. కాశిలో సంస్కృతం నేర్చుకోవటానికి ఎంతో మంది యువకులు దేశం నలుమూలల నుండి వచ్చేవారు.
తాను రాసిన పద్యాలలో దోషాలున్నాయని పండితులు పరిహసించటంతో పట్టుదలతో ఇల్లు విడిచి కాశీవెళ్ళి సంస్కృతం నేర్చుకొని వచ్చినట్లు తన ఆత్మకథలో చెల్లపిళ్ళ వెంకటశాస్త్రి చెప్పుకొన్నారు.
ఏనుగుల వీరాస్వామి రచించిన కాశీయాత్ర చరిత్ర తెలుగులో మొట్టమొదటి ట్రావెలాగ్. గతించిన పెద్దల అస్థికలు కాశీలోనిమజ్జనం చేయటం హిందువులకు ఒక పుణ్యక్రతువు. సంసారాలనుత్యజించి సన్యసించిన వారు కాశీమఠాలలో చేరేవారు. జీవిత చరమాంకంలో కాశీలో శివైక్యం చెందితే జన్మరాహిత్యం పొందుతామనే ఆశతో ఎంతో మంది వృద్ధులు కాశీయాత్ర చేసేవారు.
- కాశీకి ఉన్నవివిధపేర్లు
కాశీ అంటే కాంతినగరం అని అర్ధం. ఈ పేరు కనీసం మూడువేల సంవత్సరాల నుండి వాడికలో ఉంది. కాశీ సమీపప్రాంతంలో బుద్ధుడు మొదటిసారిగా బోధన చేసినట్లు ఒక జాతక కథలో ఉంది. కాశీరాజ్యానికి వారణాసి రాజధాని అని, దీని చుట్టూ అరవైమైళ్ళ పొడవుకల బలమైన గోడలు ఉన్నాయని మరో జాతక కథ చెబుతుంది.
“వారణాసి” అంటే వారణ, అసి అనే రెండు నదుల సంగమ ప్రదేశం అని. ఈ రెండు నదులు వెళ్ళిగంగలో కలుస్తాయి.
ఈశ్వరుడు ఈ ప్రాంతాన్నిఎన్నటికీ చేజార్చుకోను (అ విముక్త) అని అన్నాడట అందుకు ఈ ప్రాంతానికి “అవిముక్త” అనే పేరు కూడా ఉన్నదనిఐతిహ్యం. నిజానికి గుప్తుల కాలంలో కాశీలో అవిముక్తేశ్వరుడు, విశ్వేశ్వరుడు అని రెండు ఈశ్వరాలయాలు ఉండేవి. కాలక్రమేణా జరిగిన విరూపాలకారణంగా అవి ముక్తేశ్వరుని ఆలయం కాలగర్భంలో కలిసిపోగా విశ్వేశ్వర ఆలయం మాత్రమే మిగిలింది.
ఈశ్వరుడు ఈ ప్రాంతంలొ శాశ్వత నివాసం ఉంటాడు కనుక కాశికి “రుద్రవాస” అనే పేరు వచ్చింది. కాశీలో ఎక్కడైనా శవదహనం చేయవచ్చు కనుక కాశీకి “మహాస్మశాన” అనే పేరు కూడా కలదు.
కాశి అంటే నగరంగా మారిన భారతీయ ఆత్మ. కాశీ ఇరుకిరుకు సందులలో తిరగటం అంటే మరో లోకంలో, మరోకాలంలో, మరో మనుషుల మధ్య సంచరించటం. ఒక హిందువునికి కాశీ అంటే ఈశ్వరుని శాశ్వత నివాసస్థలం. కాశి అంటే కాంతి. కాశి అంటే జన్మరాహిత్యాన్నిఇచ్చేమోక్షం.
సాహిత్య, ఇతిహాస, పురాణాల పరంగా కాశీ ఎంత గొప్పదని చెప్పుకొన్నప్పటికీ, కాశీ రాజకీయ చరిత్ర మాత్రం అంత సులభంగా లభించదు.
- విదేశీయులుచేసినకాశీవర్ణనలు
- 1584 లో Ralph Fitch అనే ఆంగ్లేయుడు కాశీలో ప్రయాణిస్తూ కాశీని ఇలా వర్ణించాడు
…… ఈ ప్రాంతం Gentiles (క్రైస్తవులు కాని వారు) తో నిండి ఉన్నది. విగ్రహారాధకులు. చాలా ఆలయాలు ఉన్నాయి. సింహాలు, కోతులు, నెమలులు, స్త్రీ పురుష విగ్రహాలు ఉన్నాయి. కొన్ని విగ్రహాలకు నాలుగేసి చేతులు ఉన్నాయి.
- 1668 లో Tavernier అనే ఫ్రెంచి వ్యాపారి కాశీలో బిందు మాధవస్వామి ఆలయంలో జరిగిన హారతి కార్యక్రమాన్ని ఇలా వర్ణించాడు. Tavernier వర్ణించిన బిందు మాధవస్వామి ఆలయం ఇప్పుడు లేదు.
ఆలయద్వారం తెరచారు. ఒక తెరను తొలగించగా అందరూ దేవుని విగ్రహాన్నిచూస్తూ నేల పై మూడుసార్లు పడుకొని లేచారు. భక్తులు తెచ్చిన పూలను పూజారికి ఇవ్వగా అతను వాటిని విగ్రహానికి తాకించి తిరిగి ఇచ్చివేసాడు. తొమ్మిది ఒత్తులు ఉన్న ఒక దీపాన్ని భక్తుల వద్దకుతేగా వారందరూ దానికి నమస్కరించారు….
- 1824 లో Bishop Reginald Heber కాశీ ఆలయాలను కుతూహలం కొద్దీ చూడటానికి వెళ్ళాడు. అప్పటికి కంపనీపాలన స్థిరపడింది కనుక ఇతనికి పూర్ణకుంభ స్వాగతం లభించి ఉంటుంది.
నేను ఆలయంలోకి వెళ్ళగానే నా మెడలో పెద్దపెద్ద పూలదండలు వెయ్యటం మొదలు పెట్టారు. వాటిని తొలగించటం అమర్యాద అని చెప్పటంతో తొలగించ లేదు. కానీపెద్దపెద్ద దండలు మెడలో వేసుకొని తిరగటం ఇబ్బంది కలిగించింది. …
- Count Hermann Keyserling బెనారస్గొప్పతనాన్నిఇలా చెప్పు కొచ్చాడు
కాశీ పవిత్రమైనది. గంగానది ఉపరితలం పై తారాడే ఆథ్యాత్మికత, దైవ ప్రకటన నేను చూసిన ఏ చర్చిలోనూ నాకు సాక్షాత్కరించలేదు. క్రిష్టియన్మత బోధకుడు అవ్వాలను కొనే ప్రతి ఒక్కరు ఈ గంగానదీ తీరం పై ఒక సంవత్సరం పాటు తన ధార్మిక అధ్యయనం సాగించాలి అప్పుడే అతనికి దైవభక్తి అంటే ఏమిటో తెలుస్తుంది.
*****

కాకినాడ వాస్తవ్యులు బొల్లోజు బాబా గారు పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకులు. వీరి రచనలు : 1. యానాం విమోచనోద్యమం − 2007, చరిత్ర పుస్తకం
2. ఆకుపచ్చని తడిగీతం − ఇది 2008 లో ప్రచురించబడిన మొదటి కవితా సంకలనం 3.ఫ్రెంచి పాలనలో యానాం[5] − 2012 లో ప్రచురింపబడింది. యానాం చరిత్ర 4.వెలుతురు తెర − రెండవ కవిత్వసంపుటి. 2016 లో ప్రచురించబడింది 5.స్వేచ్ఛా విహంగాలు − విశ్వకవి రవీంద్రుడు రచించిన స్ట్రే బర్డ్స్ పుస్తకానికి తెలుగు అనువాదం 6. కవిత్వ భాష − పాశ్చాత్య అలంకారలను వివరించే సాహిత్య వ్యాసాలు 2018 7. మూడో కన్నీటిచుక్క − 2019 లో ప్రచురించబడిన కవిత్వ సంపుటి 8. మెకంజీ కైఫీయ్యతులు-తూర్పుగోదావరి ( 2020) 9. ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా (2021)
అవార్డులు:
1. శిలపరశెట్టి సాహితీ ప్రత్యేక ప్రశంసా పురస్కారం 2010, 2.ఇస్మాయిల్ సాహితీ పురస్కారం 2017, 3. రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు 2018, 4. పాతూరి అన్నపూర్ణ స్మారక సాహిత్య పురస్కారం 2020, 5. పెన్నా సాహిత్య పురస్కారం 2020.
