నా జీవన యానంలో- రెండవభాగం- 7

-కె.వరలక్ష్మి 

కొత్త వారింట్లో కొచ్చి ఏడేళ్ళు అయిపొయింది. నేను ఒక్క రోజు కూడా ఆలస్యం చెయ్యకుండా అద్దె కట్టేస్తూ ఉండేదాన్ని. పెరట్లో ఉన్న కొబ్బరి చెట్ల నుంచి పడిన కాయలన్నీ పోగుచేసి ఇల్లు గల వాళ్లకి పంపించేస్తూ ఉండేదాన్ని. ఇంటి విషయంలో నిశ్చింతగా ఉన్నామనుకుంటూండగా ఇల్లు గల వాళ్ల ఆఖరబ్బాయి వెంకన్నబాబుగారొచ్చి వాళ్ల ఆస్తి పంపకాలు అయ్యాయని, ఐదుగురు అన్నదమ్ముల్లో తను చిన్నవాడు కాబట్టి దిగువ ఉన్న ఈ ఇల్లు తనకి వచ్చిందని, సెలవుల నాటికి వేరే ఇల్లు చూసుకోమని చెప్పేడ . నాకు ఒక్కసారిగా గుండెల్లో రాయిపడింది. స్కూలు కోసం కాబట్టి పెద్ద ఇల్లు కావాలి. ఎక్కడ దొరుకుతుంది? వెతకడం మొదలైంది.

1980 ఫిబ్రవరిలో అని గుర్తు. సంపూర్ణ సూర్య గ్రహణం వచ్చింది. రేడియోలో, పేపర్లలో ఒకటే హెచ్చరికలు. ఎవరూ గ్రహణాన్ని చూడొద్దనీ, దట్టంగా మసిపట్టించిన అద్దంలో కూడా కూడదనీ భయపెట్టేసేరు. గ్రహణం మాటేమోగాని, ఆ సందర్భంగా పక్షులలో, జీవుల్లో కన్పించిన అలజడి మరచిపోలేనిది. మధ్యాహ్నం రెండు గంటల వేళ గ్రహణం పూర్తిగా పట్టి సంధ్య వేళలాగ చీకట్లు అలుముకున్నాయి. కొంగల రావి చెట్టు మీది పక్షులన్నీ తమతమ గూళ్ళకి తిరిగి వచ్చేసాయి. కుక్కల అరుపులు, పిల్లుల పరుగులు-  చిత్రమైన వాతావరణం ఏర్పడింది. రావి చెట్టు మీది ఉడత ఒకటి కంగారుగా పరుగెత్తుకొచ్చి మా ఇంగ్లీష్ టీచర్ రూం లో మంచం కింద దాక్కుంది. ఆవిడ ప్రేమగా దాన్ని చేతుల్లోకి తీసుకోబోతే చేతుల్నిండా రక్తాలొచ్చేలా రక్కి పెట్టింది. ఆ గ్రహాణాన్ని చూడడం అద్భుతమైన అనుభవం. అంతవరకూ పాక్షిక గ్రహణాలే కాని సంపూర్ణ గ్రహణం చూడడం అదే మొదటి సారి నాకు.

అప్పుడప్పుడే ఊళ్లోకి టి.వీ లు రావడం మొదలైంది. నలుపు తెలుపుల టీ.వీ లు , అయ్యారు గారింట్లో ఒకటి, బొండా రాజులు గారింట్లో ఒకటి ఉన్నాయని తెలిసి ఓ రోజక్కడికి, ఓ రోజిక్కడికి వెళ్లి అసలు టి.వీ ఎలా ఉంటుందో చూసొచ్చాం. రెండు చోట్లా క్రికెట్ మేచ్ నే పెట్టేరు.

కొంగలరావి చెట్టుకి ఆనుకుని దక్షిణం వైపు ఇంట్లో మేమున్నాం. ఉత్తరం వైపు కుప్పయాచార్యుల వారి పెద్ద మండువా లోగిలి ఉంది. ఆచార్యుల కుటుంబం హైదరాబాద్ వెళ్లిపోయాక ఆ ఇంట్లో తాళ్లూరు మాస్టారు అనే ఎలిమెంటరీ స్కూలు మాస్టారి కుటుంబం ఉంటోంది. ఆ కుటుంబం ఇప్పుడు శ్రీరామ్ నగర్ లో ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయేరు. ఇంటి బాగోగులు చూసే వాళ్లు లేక ఇల్లు పాడుపడినట్టయిపోయింది. నా చిన్నప్పటి కలల సౌధం ఈ ఇల్లు. ఎదురింటి వాళ్ల దగ్గర తాళం తీసుకుని ఇత్తడి బుడిపెలు తాపిన ఆ పెద్ద సింహ ద్వారం తెరుస్తూంటే ఏదో పులకింత. భక్తితో ఆ పెద్ద గడపకు నమస్కరించి కుడికాలు లోపల పెట్టేను. మండువా చుట్టూ ఆరు పెద్ద పెద్ద గదులు. ఆగ్నేయం మూలలో బైటి నుంచి ఉన్న మెట్లక్కి వెళ్తే మెడ మీది గది. ఇల్లు ఏనాటిదో కావడం, వెదురు గడల మీద సీమ సున్నం మెత్తి కట్టిన మిద్దె కావడం వలన గదిలో అడుగు పెడితే కింది నేల ఊగుతోంది. గది ముందు రెండు మంచాలు పట్టేటంత డాబా. గదిపైకి మెట్లెక్కి వెళ్తే పెద్ద డాబా. పాత కాలం నాటి మట్టి కూజాల డిజైన్ తో రెయిలింగ్. ఇల్లు మొత్తం గానుగ సున్నంతో కట్టిన బారెడు వెడల్పు గోడలు. వాడుక నీళ్ల కోసం ఈశాన్యం వైపు నుయ్యి. నూతి పక్కన దొడ్డి గుమ్మం. సింహ ద్వారం, దొడ్డి గుమ్మం రోడ్డు నానుకుని ఉన్నాయి. ఇంటికి ఉత్తరం వైపు, పశ్చిమం వైపు పెద్దవి, దక్షిణం వైపు సన్ననిది పెరళ్లు. పశ్చిమ పెరట్లో ఏనాటిదో పెద్ద బాదం చెట్టు. ఇంటికి ముఖ్యమైన బాత్ రూము, పాయికానా లేవు. చాలా ఎత్తైన ప్రహారీ గోడలు కావడం వల్ల నూతి చప్టా మీదే స్నానాలు చేసే వారేమో. నా చిన్నప్పుడు ఆ ఇంటికి దక్షిణం వైపు ఉండే పశువుల శాలను ఆనుకుని పాయికానా ఉండేదేమో ! ఆ స్థలాన్ని విడదీసి ఎవరికో అమ్మెయ్యడం వాళ్ల దాంట్లో వాళ్లు వరస గదులు కట్టి అద్దెల కిచ్చేసుకున్నారు. ఆ అరుగుల మీదే అమ్మలక్కలు తీరికగా కూర్చుని అందర్నీ కామెంట్స్ చేసే వాళ్లు.

ఇక గదుల్లో, మండువా హాల్లో దుమ్ము, ధూళి, ఎండు టాకులు నిండిపోయి ఉన్నాయి. అద్దె అరవయ్యే కాని, ఇంటిని మాత్రం మమ్మల్నే శుభ్రం చేసుకోమన్నారు. సెలవులిచ్చాక ఆయా, నేనూ కలిసి ఆ ఇంటిని శుభ్రం చెయ్యడానికి ఇరవై రోజులు పట్టింది. రోజుకి కొన్ని బళ్ల ఆకులయ్యేవి. అలా శుభ్రం చేస్తున్నప్పుడే మెట్ల పక్కనున్న మామిడి చెట్టు ఆకుల్లోంచి కందిరీగో, తెనేటీగో వచ్చి నా కుడి చెవి పక్క బుగ్గమీద కుట్టేసింది. అది క్రమంగా కీలాయిడ్ గా మారి ఇప్పటికీ బాధిస్తోంది. నూతి దగ్గర రాతి గోలెం ఉంది. దాన్ని కదిలిస్తే కింద బోలెడన్ని పాము పిల్లలున్నాయి.

సెలవులు ముగిసేక స్కూల్ ఓపెన్ కుప్పయ్య గారింట్లోనే చేసేం. సింహ ద్వారం పక్కన ఆగ్నేయ మూలలో ఉన్న మొదటి గదిని ఆంగ్లో ఇండియన్ టీచర్ యిచ్చేం. దాని పక్కనున్న రెండో గదిలో మా మంచం, బీరువా పెట్టుకున్నాం. ఆ రోజుల్లో బొగ్గుల పొయ్యిలు, కిరోసిన్ స్టవ్వులూ కాబట్టి స్కూలు పిల్లలు రాకముందు ఉదయాన్నే మండువాలో వంట కానిచ్చేసేదాన్ని. వేడి నీళ్ళకి నూతి పక్కనే కర్రల పొయ్యి. ఉత్తరం వైపు ఒక చిత్రమైన గది ఉండేది. ఆ గదిలోకి ఎటునుంచి రావాలన్నా రెండు మెట్లు ఎక్కిరావాలి. ఆ గదికి పెరటి వైపు ఓ పెద్ద సైజు కిటికీ అంత గుమ్మం ఉండేది . మరీ చిన్న పిల్లలు తప్ప ఆ గుమ్మంలోంచి నడవలేరు. ఆ గదిలో మా డైనింగ్ టేబుల్ వేసుకున్నాం. ఏ గదికీ కిటికీలు లేవు. పడమటి వైపు పొడవైన గది స్నానాల గది. పడమటి పెరట్లో దూరంగా తాటాకుల దడి కట్టించి పాయికానా గా వాడే వాళ్లం. స్నానాల గది స్కూల్ టైంకి  క్లాస్ రూం గా మారి పోయేది. మండువాలో సింహ ద్వారం దగ్గర నా ఆఫీస్ రూం టేబుల్, కుర్చీ ఉండేది. మండువాలోనే ఐదారు క్లాసులు నడిచేవి. ఆ సంవత్సరం చాలా మంది పిల్లలు జాయినయ్యారు. చుట్టు పక్కల పల్లెటూళ్ళ పిల్లల్ని రిక్షాల్లో పంపించే వారు.

అనుకోకుండా హరిజనపేట నుంచి నడుం వంగి పోయిన ఓ పెద్దాయన వచ్చి తనకేదైనా పని ఉంటే ఇమ్మని అడిగేడు. అతను చంద్రం పాలెంలో కృష్ణ శాస్త్రి గారి పొలాల్లో పని చేసే వాడట యువకుడిగా ఉన్నప్పుడు. తోటమాలిగా చేరేడు. ఎక్కడా ఒక్క ఎండుటాకైనా లేకుండా పెరడంతా శుభ్రం చేసేవాడు. ఇక్కడే తిని ఏదో ఓ గదిలో పడుకునేవాడు. ఆదివారం మాత్రం కూతురింటి కెళ్లి సోమవారం ఉదయం వచ్చేవాడు. గదులు తుడవడం, మంచి నీళ్ళు తేవడం, పిల్లల భోజనాల దగ్గర ఉండడం ఆయా చేసేది. ఒకో క్లాసుకీ ఇరవై లేదా పాతిక మంది పిల్లలు మాత్రమే ఉండేలా జాగ్రత్త పడేదాన్ని, బాదం చెట్టు నీడలో కూడా కొన్ని క్లాసులు నడిచేవి.

ఇక మేడ గది విషయానికొస్తే అక్కడొక ఇక్ష్వాకుల కాలం నాటి పెద్ద టేబులు, దాని మీద చెదలు పట్టి పేజీలు ఊడిపోయిన కొన్ని తమిళ గ్రంథాలు, 19 వ శతాబ్దం (1860 మొదలు) లోని గొలుసు కట్టు తెలుగు ఉత్తరాలు ఉండేవి. నేల ఊగుతూండడం వల్ల మా పిల్లల్ని ఆ గదిలోకి వెళ్ళకుండా చూసేదాన్ని. కొంత అలవాటయ్యేక సాయంకాలమైతే చాలు పిల్లలూ, నేనూ అక్కడే ఉండేవాళ్లం. ఎంత శుభ్రం చేసినా ఏదో ఒక మూల తేళ్ళో , జెర్రులో కన్పిస్తూండేవి. ఒకసారి రాత్రి పడుకోబోయే ముందు మా గీతను తేలు కుట్టేసింది. చిన్నపిల్ల, తట్టుకోలేక రాత్రంతా ఏడుస్తూనే ఉంది. మోహన్ తనని భుజం మీద వేసుకుని తేలు మంత్రం వేసే మాస్టారింటికి పరుగెత్తేడు. నేను ఉల్లిపాయ చితక్కొట్టి పట్టు వేస్తే, మోహన్ సైకిల్ డైనమో కరెంటు పెట్టేడు. ఇంకెవరో పాము మణి తెచ్చి కాటుమీద పెట్టేరు. ఎన్ని చేసినా తెల్ల వార్లూ నొప్పితో బాధ పడింది.

గీత పదేళ్ల వయసు నాటికే సైకిల్ నేర్చుకుని బైటి పనులన్నీ చేసుకొచ్చేది. బేంకుకెళ్లి డబ్బులు వెయ్యడం, తియ్యడం చేసుకొచ్చేది. అప్పటికి స్టేట్ బేంక్ హైవే మీద శ్రీరామ్ నగర్ కి వచ్చేసింది. బేగ్ లో స్లిప్పు రాసి పెడితే చాలు బేంకు వాళ్లు ఆ పని చేసి పెట్టే  వాళ్లు. ఒకసారి అత్యవసరంగా డబ్బుల కోసం నా నెక్లెస్ పంపించేను. అట్నుంచి కేషియర్ గారు డబ్బుల్తో పాటు నాకో చీటీ పంపించేడు “మేడం, పిల్లలకి డబ్బులు పొదుపు చెయ్యడం నేర్పచ్చు కాని తాకట్టు పెట్టడం నేర్పకూడదు” అంటూ.

ఇంటికి తెలిసిన వాళ్లు ఎవరొచ్చినా “అబ్బ ! ఈ ఇంటికి వాడిన టేకు కలప లక్ష పైన ఖరీదు చేస్తుంది. ఈ తలుపుల, స్తంభాల డిజైను ఎంత బావుందో” అనే వాళ్లు.

సరిగ్గా మేం ఇల్లు మారినప్పుడే దక్షిణం వరస గదుల్లోకి గ్రంథాలయం మార్చబడింది. పక్క గుమ్మమే కాబట్టి నాకూ, మా పిల్లలకీ పుస్తకాలకి లోటు లేకుండా పోయింది. స్కూల్ హోమ్ వర్క్ చేసేసిన వెంటనే ముగ్గురూ వెళ్లి లైబ్రరీలో కూర్చుని, వాళ్ల వాళ్ల అభిరుచికి తగిన పుస్తకాలు చదువుకునే వాళ్లు. లైబ్రేరియన్ శివాజీ గారు “పొద్దున్నే తెచ్చి పెట్టెయ్యండి” అంటూ అడిగిన పుస్తకమల్లా ఇచ్చేసేవారు. అలా మా పిల్లలు ముగ్గురికీ చిన్నతనంలోనే పుస్తకాలు చదవడం అలవాటైంది. “పుస్తకాలు, పత్రికలు ఊహా శక్తిని పెంచుతాయి. ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. మనలో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాయి. కొన్ని స్వప్నాలను మిగులుస్తాయి. మన జీవితాన్ని సృజన పథంలో నడిపిస్తాయి” అని నమ్మే వాళ్లలో నేనూ ఒకదాన్ని.

రచయితలంటే ఎంత అభిమానం ఉన్నా నా హైస్కూల్ రోజుల్లో ఒక్క సులోచనారాణి గారికి , ఒకే ఒక్క ఉత్తరం చలంగారికీ తప్ప ఇంకెవరికీ ఉత్తరాలు రాయలేదు . స్వాతి మంత్లీ తో అనుబంధ నవలగా వచ్చిన అంపశయ్య నవీన్ గారి “ముళ్ళ పొదలు” చదివి ఆయనకి ఉత్తరం రాసేను. ఆయన వెంటనే రిప్లై ఇచ్చేరు. మా మధ్య స్నేహపూరితమైన ఉత్తరాలు నడిచేవి. అప్పటి వరకూ ఏది దొరికితే దాన్ని చదివేసే నేను ఆయన పరిచయంతో ఎంపిక చేసిన గొప్ప రచయితల రచనల్ని చదవడం ప్రారంభించేను. నా లోపలి ప్రపంచం దానికదే విశాలం కావడం ప్రారంభమైంది. వాళ్ల ఫిలిం క్లబ్ లో చూసిన అవార్డ్ పొందిన మూవీస్ గురించి, ఆర్ట్ పిక్చర్స్ గురించి రాసేవారు. రాజమండ్రిలో ఉన్న కొద్ది రోజులూ తప్ప మామూలు హిందీ సినిమాలు కూడా చూసెరుగని నేను ఎన్నో అద్భుతమైన మూవీస్ ను ఆయన ఉత్తరాల ద్వారా చూసేదాన్ని. అవి అందరూ చదివి నేర్చుకోవాల్సిన ఉత్తరాలు కాబట్టి ఇంట్లో అందరికీ అందుబాటులో ఉంచేదాన్ని. ఉత్తరాల ద్వారా మిత్రులయ్యేక ఒక ఆత్మీయతా భావం తప్పక నెలకొంటుంది. నేను రాసే విధానం బావుంటుందనీ, కథలు రాయడానికి ప్రయత్నించమనీ రాసే వారు నవీన్ గారు.

రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ కి ఎగ్జామినేషన్స్ చీఫ్ గానో ఏమో వచ్చినప్పుడు ఆయన ఫ్రెండ్ సత్తెన్నగారితో కలిసి మా ఇంటి కొచ్చేరు. ఉత్తరాల్లోని ఆత్మీయతను ముఖాముఖి చూపించలేకపోయేను. మోహన్ తో కలిసి నలుగురం ఏదో సినిమాకి వెళ్ళొచ్చేం. వాళ్లున్నంత సేపూ బాగానే నడుచుకున్న మోహన్ తర్వాత “ఈ ఉత్తరాలేంటి, ఈ పరిచయలేంటి, నా పరువు తీసేస్తున్నావు” అంటూ నవీన్ గారి ఉత్తరాలన్నిట్నీ వాకిట్లో వేసి అగ్గిపుల్ల గీసి కాల్చేసేడు, అలా ఎంతో పరిజ్ఞానాన్నిచ్చిన ఉత్తరాల్ని కోల్పోయేను. నా జీవితం నా చేతుల్లో ఉండేది కాదు. నా చుట్టూ ఉన్న వాళ్ల చేతుల్లో ఉండేది.

*****

(ఇంకా ఉంది )

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.