
అనుసృజన
ఆడవాళ్లు
మూలం : రమాశంకర్ యాదవ్ విద్రోహీ
అనుసృజన: ఆర్ శాంతసుందరి
కొందరు స్వేచ్ఛగా ఎందులోనైనా దూకి ఆత్మహత్య చేసుకున్నారు
అలా అని పోలీసు రికార్డుల్లో నమోదై ఉంది
కొంతమంది ఆడవాళ్ళు స్వయంగా చితి మంటల్లో పడి ఆత్మాహుతి చేసుకున్నారు.
అలా అని మతగ్రంథాల్లో ఉంది
నేను కవిని, కర్తని
తొందరేముంది
ఏదో ఒక రోజు పోలీసులనీ పురోహితులనీ కట్టకట్టుకుని రమ్మని
స్త్రీల న్యాయస్థానానికి పిలిపిస్తాను
మిగతా న్యాయస్థానాలన్నిటినీ రద్దు చేసేస్తాను
స్త్రీలకీ పిల్లలకీ వ్యతిరేకంగా మగ మహారాజులు వేసిన
కేసులన్నిటినీ రద్దు చేస్తాను
సైనికులూ విద్యార్థులూ తెచ్చిన డిక్రీలని కూడా
పనికిరావని చెపుతాను
దుర్బలులు కండబలం ఉన్నవాళ్ళ పేర రాసిన విల్లులని బహిష్కరిస్తాను.
స్వేచ్ఛగా బావుల్లో దూకిన స్త్రీలనీ చితిమీద కాలి పోయిన స్త్రీలనీ
మళ్ళీ బతికిస్తాను
ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరిగి ఉంటే
చెప్పని విషయాలేమైనా ఉంటే
వాళ్ళు న్యాయాస్థానాల్లో ఏనాడో చెప్పిన మాటలని
మళ్ళీ కొత్తగా రాస్తాను.
ఎందుకంటే నాకు ఒక స్త్రీ తెలుసు
ఏడు జానల తన శరీరాన్ని జానెడు ఇంట్లో
జీవితాంతం కుదించుకుని బతికింది
బయటకు తొంగి కూడా చూడలేదు
శవంగా మారిన తర్వాత ఇంట్లోంచి ఆమె బైటికొచ్చింది.
బైటికి వస్తూనే భూమి తల్లిలా పరుచుకుంది
స్త్రీ శవం భూమాతలాగ ఉంటుంది
బైటికి రాగానే విస్తరిస్తుంది పోలీసు స్టేషన్లనుంచి న్యాయస్థానాల దాకా
అపరాధం జరిగిన రుజువులన్నిటినీ తుడిచెయ్యడం చూస్తున్నాను
చందన తిలకం దిద్దుకుని తలలెగరేసుకు తిరుగుతున్న పురోహితులూ
పతకాలతో ఛాతీలని అలంకరించుకుని విర్రవీగుతున్న సిపాయిలూ
మహారాజుకి జై అని నినాదాలు పలుకుతున్నారు.
వాళ్ళందరూ చనిపోయిన మహారాజులు
చితులు పేర్చుకుని సతీసహగమనం చేసేందుకు సిద్ధంగా ఉన్న వాళ్ళ మహారాణులు
ఇక మహారాణులే లేకపోతే పరిచారికలేం చేస్తారు?
అందుకే వాళ్ళు కూడా సిద్ధమౌతున్నారు చనిపోయేందుకు
నాకు మహారాణులకన్నా వాళ్ళని చూస్తేనే జాలి
వాళ్ళ భర్తలు బతికే ఉన్నారు…ఏడుస్తున్నారు
ఒక స్త్రీ బతికున్న తన భర్త ఏడుస్తూంటే చనిపోవడం ఎంత ఘోరం?
కానీ భర్తలకి ఏడ్చే స్త్రీని కొట్తడం తప్పుగా తోచదు ఎందుకో
ఆడవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు,మొగాళ్ళు కొడుతూనే ఉంటారు
ఆడది గట్టిగా ఏడిస్తే మగాడు మరింత గట్టిగా కొడతాడు
దాంతో ఆమె ఒక్కోసారి చనిపోతుంది
చరిత్రలో మొట్ట మొదటిసారి మంటల్లో పడేసి చంపబడిన మొదటి స్త్రీ ఎవరై ఉంటుంది?
నాకు తెలీదు
కానీ ఆమె ఎవరైనా సరే మా అమ్మే అయిఉంటుంది,
ఇప్పుడు నా విచారం
భవిష్యత్తులో అలాటి నేరానికి గురై మరణించే స్త్రీ ఎవరవుతారనేదే
ఆ ఆఖరి స్త్రీ ఎవరవుతుంది?
నాకు తెలీదు
కానీ ఆమె ఎవరైనప్పటికీ నా కూతురే అవుతుంది…
అయినా
నేనలా జరగనివ్వను కదా!
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
