
అనుసృజన
రైతుల నెత్తుటి కుండలు
హిందీ మూలం: రిషబ్ దేవ్ శర్మ
అనుసృజన: ఆర్ శాంతసుందరి
రిషబ్ దేవ్ శర్మ కవి, విమర్శకులు, స్నేహశీలి. హైదరాబాద్ లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుంచి ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. చిల్లర భవానీదేవి, పెద్దింటి అశోక్ కుమార్, సలీం లాంటి ఎందఱో తెలుగు రచయితల రచనల హిందీ అనువాదాలకు విశ్లేషనాత్మకమైన ఉపోద్ఘాతాలు రాసారు. ఈ కవిత వారి కవిత్వానుభావానికి ఒక మచ్చు తునక.
***
రైతుల నెత్తుటి కుండలు
పాతి ఉన్నాయి
ఈ నేలలోనే ! తిండిగింజలు పండిచినవాడు
బట్టల కోసం పత్తి పెంచినవాడు
నేల ఒడిని పచ్చగా ఉంచేందుకు
అనునిత్యం తన ఒంటిని ఎండబెట్టినవాడు
అతను. తడిపాడు పాదులను
తన నెత్తుటి లోహంతో
తన కన్నీటి వెచ్చదనంతో
చెమట వాసన వేసే ఉప్పుతో.
తన కోరికలని రగిలించి రగిలించి
సృష్టించాడు కలల మబ్బులను
మెరుపులా అల్లల్లాడాడు
పిడుగులతో నింపాడు దిగంతాలను. అతని కళ్ళలో…
శూన్యమా?
అతని గుండెల్లోనూ
శూన్యమేనా?
ప్రతి రుతువులోనూ వాగ్దానాలు
అన్నీ అబద్ధాలు;
ప్రతి మబ్బులోనూ
మోసం-మోసం !
నమ్మకంతో అమాయకమైన మనసుతో
నమ్మక ద్రోహం చేసే పెనుగాలులతో
ఇంకెంతకాలం పోరాడగలడు?
ఇప్పటికే ఈ నేలకి
రైతుల రక్తం బోలెడంత తాగించాడు రాజు;
భూగర్భంలో అణచిపెట్టాడు
తను చేసిన పాపాలన్నీ.
ఇంత పాపభారాన్ని ఇముడ్చుకుని తనలో
గొడ్రాలయింది ధరిత్రి,
కామధేనువు సారవంతమైన గర్భాశయం సైతం వట్టిపోయింది.
పసుపు రంగు సంతరించుకున్నాయి
కల్పతరువు ఆకులన్నీ !
గద్దెలెక్కినవారందరూ దిగండి
నేలమీదికి తక్షణం
నాగలి ఎత్తుకోండి భుజాలకి,
పదండి దున్నేందుకు పొలాలు.
నేల దున్నినవాడే ‘జనకుడు’
రాజు అతనే ఈ భూమికి,
అతనే భూపతి
కష్టకాలాన్ని ఎదిరించగలవాడూ అతనే !!
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
