
చిత్రలిపి
అమ్మా …ఆనాడే ఎందుకు చెప్పలేదు ???
-మన్నెం శారద
అవునమ్మా …నువ్వు ఆనాడే ఎందుకు చెప్పలేదూ ….తాతయ్య వడిలో కూర్చుంటే తప్పని బాబాయి భుజాలమీద ఊరేగవద్దని ఆటో అంకులు ని ముట్టుకోనివ్వద్దని పక్కింటికి పోవద్దని దోస్తుల్ని నమ్మొద్దని వెన్నెల్లో ఆడొద్దని చుట్టమిచ్చిన చాకోలెట్ అయినా తినవద్దని …..ఇల్లు దాటొద్దని ! ఎన్నో ఎన్నెన్నో ప్రతి బంధాల మధ్య నా బాల్యం ఛిద్రమవుతుంటే దారిలేక కుమిలి కునారిల్లుతున్నాను ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నది …ప్రతిక్షణమూ నువ్వు నాకోసం పడుతున్న వేదన !అనుక్షణమూ అనుభవిస్తున్న నరకం !కంట్లో వత్తులేసుకుని నువ్వు కాసే కాపలా …….ఆఫీసునుండి ఇంటికి వచ్చాకా నీ కళ్ళలో ప్రతిఫలించే ఆనందం !అమ్మా ….ఎన్నాళ్లిలా …ఎన్నేళ్ళిలా … అవునమ్మా …ఆనాడే ఎందుకు చెప్పలేదు ఆడమాంసం మరిగిన తోడేళ్ళు అంతటా తిరుగుతున్నాయని మనిషిని మించిన మృగం మరొకటి లేనేలేదని …. …. అవునమ్మా ….కడుపులో వున్నప్పుడే ఆ కఠిన విషం కక్కివుంటే నన్ను నేను ఛిద్రం చేసుకుని నీకీ నరకం తప్పించి ఉండేదాన్ని !అవునమ్మా ….నువ్వు ఆనాడే ఎందుకు ఈ నిజం చెప్పలేదు ???
*****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
