ఒక్కొక్క పువ్వేసి-25

అలీసమ్మ హత్య కేసు ఎక్కడ ఏమైంది ?

-జూపాక సుభద్ర

           కారంచేడు రుధిర క్షేత్రం భారతదేశ కులవాస్తవిక కౄరత్వానికి సాక్ష్యము. కారం చేడులో ఆధిపత్య కులంచే చంపబడిన అమరుల స్పూర్తి దినం 17-7-1985. కారం చేడులో కమ్మ కుల దురహంకారం మాదిగలను వూచకోత కోసిన దుర్దినమ్. యిది జరిగి యిప్పటికి ముప్పయెనిమిదేండ్లు (38) గడిచింది. కారంచేడు దురంతాలు భారతదేశం లో మొదటిది కాదు, చివరిది కాదు. ఆధిపత్యకుల హత్యలు అనేకం జరిగినయి, జరుగు తున్నయి. కాని కొన్నింటికి మాత్రమే జాతి జాతంతా కదులుతుంది. అట్లా కదిలించిన ఉద్యమ విజయం కారంచేడు విజయమ్.

           కారంచేడు చరిత్రను, కుల దాష్టీకాలను, ఆ ఉద్యమ చైతన్యాన్ని, స్ఫూర్తిని యితర బాధిత సమాజాలకు, ఉద్యమ సమాజాలకు యివ్వడానికి కారంచేడు రుధిర క్షేత్రాన్ని సెలెబ్రేట్ చేస్కొవాలి. బాధిత సమాజాలు ఐక్యంగా నిలబడిన ఉద్యమం. బాధిత సమూహాలకు బాసటగా అనేక ఉద్యమాలు, ఉద్యమ శక్తులు, వ్యక్తులు అండగా వున్న ఉద్యమం కారంచేడు ఉద్యమం. లక్షల మంది బాధిత శిబిరాలకు దన్నుగా వున్న ఉద్యమం కారంచేడు. అందుకే ప్రభుత్వాలు దిగొచ్చినయి. ఉద్యమం విజయవంత మైంది. అందుకే కారంచేడు రుధిర  క్షేత్రాన్ని ప్రత్యే కంగా చరిత్రలో  చెప్పాలి.

           కారంచేడు సాధించిన ప్రధానమైనవి దళితుల ప్రతిఘటనా పోరాటస్థైర్యం. దళిత ఆత్మగౌరవ పోరాటమును యింకా అంటరాని సమాజాల మీద ఎలాంటి వివక్షలు జరగ కూడదనీ, జరిగితే ఎంత శిక్షార్హమో తెచ్చిన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీస్ చట్టమే. యీ చట్టం రాకముందు దళితుల మీద ఏమి జరిగినా, ఎలాంటి దాడులు, హత్యలు జరిగిన కూడా సాధారణ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లే వుండేవి. నేరస్తులు సులువుగా ధనబలం, కుల బలంతో తప్పించుకునేవాళ్ళు. కానీ కారంచేడు ఉద్యమం భారత దేశ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తెచ్చి ఎస్సీ ఎస్టీలకు బాసటయింది. యిది సక్రమంగా అమలవుతుందా యిప్పటి దాకా ఎంత మంది శిక్షలు అనుభవించారంటే.. చెప్పలేము. కానీ అది అమలు పరిస్తే శిక్షలో ఖాయం అనే భయాలు కూడా ఉంటాయి.

           కారంచేడు రుధిర క్షేత్రానికి జూలై  ఏడున అప్పుడప్పుడు పోయి ఆ నాటి దుర్ఘట నలు బాధితుల నుంచి వినేది. వారి యిండ్లకు పొయేది. ముఖ్యంగా కారంచేడు మారణ కాండలో బాధిత మహిళలు సువార్తక్క, సలోచన, అలీసమ్మ.

           యిండ్లకు, కారంచేడు వూచకోతకు ముందు మాదిగ గూడెమ్ తాగే మంచి నీళ్ళ చెరువును ఒక కమ్మ ఆసామి బర్లను కడిగి ములికి తీస్తుంటే కత్తి చంద్రయ్యనే మాదిగ అవిటి అబ్బాయి ‘మనసులు తాగే నీళ్ళు అట్లా కంగాలి జేస్త వేంది సామి’ అన్నందుకు ‘నువ్వెవఒమని కొడతుంటే … ఆ టైముకు నీళ్ల కోసం బిందెలో వచ్చిన సువార్త అడ్డుకో బోతె ఆమెను కూడా ఆ ఆసామి కొట్టబోతె బిందె ఎత్తిందట. ఆ తర్వాత కారంచేడు మారణ కాండ జరిగింది.

           పొలాల్లో పంజేసుకుంటున్న మాదిగవాల్ల మీద గొడ్డండ్లు, బరిసెలు గడ్డపారలతో కమ్మ భూసాములు ట్రాక్టర్లమీద వచ్చి దొరికినోల్లను దొరికినట్లు చంపిండ్రు. చాలా మంది చెల్లా చెదరై పారిపోయిండ్రు. కొంత మంది చావుదెబ్బలు తిని చచ్చినట్లు పడున్నారు. కొంత మందిని తీవ్రంగా గాయ పరిచిండ్రు. టీనేజి మహిళలు పాలంల దొర్కబుచ్చుకొని కొట్టిన దెబ్బలు, గాయాలు వారి ఒంటి మీద యింకా మాయని మచ్చలుగా మిగిలి పోయిన యి. యీ మారణకాండలో మొత్తం చనిపోయింది దుడ్డు రమేష్, దుడ్డు వందనం, దుడ్డు అబ్రహం, తేళ్ళ ముత్తయ్య, తేళ్ళ యెహోషువా, అలీసమ్మ. ఆ దాడిలో నలభై మంది తీవ్రంగా గాయపడిండ్రు. కాళ్ళు చేతులో పోగొట్టుకున్నరు.

           దుడ్డు రమేష్ యిరువై ఏండ్లు కూడా నిండని యువకుడు. అతని భార్య సులోచన. సులోచనతో పాటున్న టీనేజి ఆడపిల్లలు తేళ్లమరియ, తేళ్ల విక్టోరియ, శాంతమ్మ, తాళ్లలక్ష్మి. వీల్లందర్ని కొట్టి కాల్చేద్దామన్న పథకం విఫలమైందని సజీవ చరిత్రగా మన్న సలోచన చెప్తుంటది. సులోచన తనభర్త హత్యను చూసి ఆ భయాన్ని, బాధ నుంచి చేరుకొని మళ్లీ మామూలు మనిషికావడానికి మల్లా కొత్త జీవితంలోకి అడుగిడడానికి ఉద్యమ సంగాల సహకారం చేయూతలు అండనే కారణమంటది. అయినా యిప్పటికీ ఆనాటి  మారణకాండల భీభత్సాలు భయాల వణుకు అప్పుడప్పుడు వెన్నాడుతూనే వుంటాయనంటుంది సులోచన.

           దుడ్డు అలీసమ్మ మరణము విషాదం. తన కన్నకొడుకు దుడ్డు వందనం. కమ్మ బూసాములు మాదిగల్ని వేటాడుతూ చంపుతున్నారని తెల్సి వెంటనే చీరాల పోలీస్టేషన్ కి కంప్లయింట్ యిద్దామని బైల్దేరిండు బైటకు. అంతే  గొడ్డల్లతో నరుకుతూ, బరిసెలతో పొడుస్తుంటే… ఆ అరుపులు కేకలు వీని బైట తనకొడుకుని చంపుతుంటే కళ్ళార చూసిన దుక్కమ్ అలీ సమ్మది. ఆక్రూర  ఘటనను చూసిన అలీసమ్మ బహిరంగ సభల్లో, క్యాంపు ల్లో చెపుతుంటే దళిత మహిళలు, మగవాల్లు శోకాలు బెట్టి ఏడ్చేవారంట. నాకు ఆశ్చర్యం ఐ విట్నెస్ ను బహిరంగ పర్చకూడదని చట్టం చెబుతుంది. కానీ అలీసమ్మకు బహిరంగ సభల్లో స్టేజీల మీద చెప్పించడం ఎట్లా జరిగింది? ఐవిట్నెస్ను చాలా రహస్యంగా వుంచు తరు, రక్షణలో వుంచుతరు. కానీ పోలీసులు, కోర్టులు పట్టించుకోవు, చెప్పరు కూడా యీ రహస్యంగా, రక్షణ విషయాలు. కానీ ఉద్యమ సంగాలకు, పౌరహక్కుల సంగాల క్కూడా తెలవక పోవడమేంటి? వాల్లయినా అలర్ట్ చేయాల్సి వుండింది. కానీ, అట్లా జరగలేదు. యీ ఉదాసీనత ఏమర పాటు వల్ల శత్రువు అలీ సమ్మను ఒక దొంగరాత్రి నిశ్శబ్దంగా చంపేసి పొయింది.

           విజయనగర్ కాలనీ ఏర్పాటు చేస్తున్నప్పుడు బాధితుల కోసం యింకా పూర్తికాని తలుపులు కిటికీల్లేని యింటి ముందట ఆరుబైట నిద్రబోతున్న అలీ సమ్మను మోకమ్మీద మెత్తేసి వొత్తి  చంపినారని వూపిరాడ నివ్వక చంపేసి పోయిండ్రు. తెల్లవారి ఆమె శవమై మంచాల్లో పడివుంది. ఆమె మంచం పక్కన బూటు కాళ్లఅచ్చులున్నాయని గుర్తించారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో మొకమంతా కమిలి వుంది, వూపిరాడకుండా వున్న పరిస్థితిలో చనిపోయిందని, అది సీబీ సిఐడికి యిచ్చారు. యింకే ముంది అది యింకా పూర్తి కాలేదు రిపోర్ట్ అంటారట. బాధితులు తిరిగి తిరిగి వేసారి మానుకున్నారట. అతీ లేదు  గతి లేదిప్పటికి. వ్యవస్థలు ఎంత దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా వున్నయి దళితుల పట్ల అనేది అలీసమ్మ మర్డర్ కేసే సాక్ష్యం. దోషులెవరు? అనేది యింకా తేల లేదు. ఏం జరిగినా బైటకు రాలే. ఒక మాదిగ మహిళను మర్డర్  చేస్తే—రుజువులు వున్నా, శిక్షా చట్టాలన్నా మనుస్మృతుల ముందవేమి పంజేయలే. యిది అంటరాని మహిళల దుస్థితి యీ దేశంలో.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.