
పౌరాణిక గాథలు -44
-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి
దండుడు కథ
ఇక్ష్వాకు వంశంలో చిట్టచివరగా పుట్టినవాడు దండుడు. అతడికి ఆటలంటే చాలా ఇష్టం. పిల్లలందరితో ఆటలాడుతూ అందరితో తగాదాలు పెట్టుకుని అల్లరి చేస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి పిల్లలు దండుడి చేతిలో బాగా దెబ్బలు తింటూ ఉండేవాళ్ళు.
చివరికి పిల్లల గొడవలు పెద్దవాళ్ల వరకు వెళ్లేవి. గొడవలెందుకని పెద్దవాళ్ళు పిల్లల్ని ఆడుకునేందుకు పంపించడం మానేసేవాళ్ళు. పిల్లలు ఊరుకుంటారా…? మళ్ళీ మొదలే!
దండుడు చేస్తున్న అల్లరి తెలిసి, అతడి తండ్రి అల్లరి చెయ్యకూడదని అందరితో కలిసి ఆడుకోవాలని నెమ్మదిగా చెప్తుండేవాడు. ఎవరితోను గొడవలు పెట్టుకోకూడదని, దాని వల్ల స్నేహం చెడిపోతుందని ఎన్ని సార్లు చెప్పినా వినేవాడు కాదు. విసిగిపోయిన తండ్రి దండుణ్ణి ఊళ్ళోంచి వెళ్ళగొట్టాడు. దూరంగా వింధ్య పర్వత ప్రాంతానికి వెళ్ళిపొమ్మన్నాడు.
దండుడు వింధ్య పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక నగరాన్ని నిర్మించుకుని పాలించడం మొదలెట్టాడు. ఆ నగరం పేరు ’’మధుమంతపురం’’. దండుడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి తనకు విద్య నేర్పించమన్నాడు. అతడు రాజకుమారుడు కనుక శుక్రాచార్యుడు అతడికి విద్య నేర్పడానికి అంగీకరించాడు. దండుడు శుక్రాచార్యుడికి శిష్యుడయ్యాడు. రాక్షసులందరు అతడితో స్నేహం చేశారు. వాళ్ళందరితో కలిసి మెలిసి ఉంటున్నాడు దండుడు. దుర్మార్గుడయిన దండుడికి రాక్షసులు స్నేహితులవడంతో అతడి దుర్మార్గానికి రాక్షసత్వం కూడా తోడయింది.
ఒకరోజు దండుడు శుక్రాచార్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన కూతురు ’’అరజ” తపస్సు చేసుకుంటోంది. ఆమె దగ్గరికి వెళ్ళి “నువ్వెవరు?” అని అడిగాడు.
ఆమె ““నా పేరు అరజ. నేను శుక్రాచార్యుడి కూతుర్ని!”” అని చెప్పింది.
“వెంటనే బయలుదేరి నాతో వచ్చెయ్యి!”” అన్నాడు. అమె అతడితో వెళ్ళడానికి నిరాకరించింది. దండుడు బలవంతంగా అమెని తనతో లాక్కెళ్ళాడు. శుక్రాచార్యుడికి విషయం తెలిసింది. దండుడితో “”నీవంటి వాడికి విద్య నేర్పించడమే తప్పు. నిన్ను వదిలిపెట్టను!”” అన్నాడు కోపంగా.
సకల విద్యలు తెలిసినవాడు…రాక్షస లోకానికే గురువు అయిన శుక్రాచార్యుడు మధుమంత పురానికి వెళ్ళాడు. మధుమంతపురంలోనే కాకుండా దాని చుట్టూ వంద మైళ్ల వరకూ మట్టి వర్షం కురవాలని శపించాడు.
రాక్షస గురువు శుక్రాచార్యుడికి కోపం వస్తే ఊరికే పోతుందా…? ఆయన శాపం వృధ అవుతుందా…?
ఆ ప్రదేశం మొత్తం మట్టి వర్షం కురిసి శుక్రాచార్యుడు శపించినట్టే మట్టితో కప్పబడి పోయింది. అక్కడ పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయి మధుమంత పురం మట్టిలో కూరుకు పోయింది. ఆ ప్రదేశమంతా అరణ్యంగా మారిపోయింది.
దండుడు చిన్నతనం నుంచి దుర్మార్గంగా ప్రవర్తించి, రాక్షసులతో సాహచర్యం చేసి, చివరికి తను స్థాపించుకున్న రాజ్యమే అరణ్యంగా మారిపోడానికి కారకుడయ్యాడు. దండుడి చెడు స్నేహానికి చిహ్నంగా మిగిలింది దండకారణ్యం!
*****

శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరి పేరుతో బాల సాహితీవేత్తగా అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరించిన ముంగిటిముత్యాలు బాలల గేయ కావ్యం తెలుగుభాషోద్యమ కోణంలోంచి చేసిన ప్రసిధ్ధ రచన. ఇప్పటి వరకూ 116 మహర్షుల చరిత్రలు, అవతారాల కథలు, అనే పరిశోధనాత్మక రచనలు, యోగి వేమన జీవిత చరిత్ర, బంగారుకలలు, కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లా రచయితల సంఘం ద్వారా అనేక జాతీయ సదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను. తానా, అమెరికా వారి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తెలుగువారి పండుగలపైన నా పరిశోధనాపత్రం ప్రశంసలు పొందింది. 2010లో వంగూరు ఫౌండేషన్ వారి అంతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,. శ్రీ శ్రీ బాలసాహిత్యం వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశంసలు పొందాయి. బందరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవం సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసంగం చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామంగా వస్తున్నాయి. కనకదుర్గ ప్రభ, భక్తిసుధ, చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఉయ్యూరు సరసభారతి వారు, కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అందించి గౌరవించారు. విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరించారు. వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

Thank you very much Sister
?