నడక దారిలో-19

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో మేనబావ శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి అభిమాని గా దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. నేనని తెలిసి పెళ్ళి చేసుకుందామని కోరగా అంగీకరించాను. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో వివాహం జరిగింది. తర్వాత…

***

          నా కొత్త కాపురం యథాతథంగా కొనసాగుతోంది.

          మా ఇంట్లో కూడా నాకు మా అన్నయ్యలతో ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటమే.అమ్మకి ఇంటిపనుల్లో ఏదైనా సాయం అవసరం అయితే చేయటం తర్వాత చదువుకోవటం లేకుంటే బొమ్మలు వేసుకోవటం  చేసేదాన్ని. ఇంట్లో  రేడియోలో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది.అదే సందడి.లేదా నేను తీసే రాగాలే ఇల్లంతా తీగలు సాగుతూ ఉంటాయి.
 
          ఇక్కడ మా ఇంటి కాంపౌండ్ లో మాఇల్లే పక్కా ఇల్లు. మాది కాకుండా మరో నాలుగు వాటాలు రెండు గదుల రేకుల ఇళ్ళు ఉండేవి. వాటిలో ఒకటి రామకృష్ణ శర్మ అనే మాష్టారి కుటుంబం ఉంటుంది. మరోదాంట్లో మహరాష్ట్రియనుల కుటుంబం  భార్యాభర్తలు ముగ్గురు పిల్లలు కాక ఇంట్లో తల్లితండ్రులు, తమ్ముడు రెండు గదుల్లో సర్దుకుని ఉండేవారు. అంత మంది అంత చిన్న ఇంట్లో ఎలా సర్దుకునే వారో అనిపించింది. అప్పట్లోనే అతని తమ్ముడికి పెళ్ళి జరగటం గృహహింస అనేది ప్రత్యక్షంగా వాళ్ళింట్లో చూసాను ఆ కుటుంబం నేపథ్యంగా “కంచికి పోని కథ” పేరుతో1980లో ఒక కథ కూడా రాసాను.
 
          మా వంటిల్లు ఆనుకొని ఉన్న వాటాలో చిన్న కుటుంబం కాపురం ఉండేది. వాళ్ళు ఖాళీ చేయాలనుకుంటున్నారు అనీ నేను చదువు ముగించి కొని వచ్చేనాటికి ఆ వాటా కూడా మనం అద్దెకి తీసుకుంటే మనకి వంటింట్లో పడుకునే బాధ తప్పుతుంది అని వీర్రాజు చెప్పేవారు. ఇంకొక వాటాలో రత్నం అనే ఆమె,భర్తా,కొడుకు కాపురం ఉండేవారు.
 
          పైన వాటాలో సింధీ కుటుంబం అద్దెకి ఉండేవారు. నాకు వచ్చిన సమస్య రత్నంతో. అత్త పోయినప్పుడు., ఆ తర్వాత వీళ్ళకు సాయం చేసి ఉంటుంది. అందుకని వీళ్ళంతా ఆమె అంటే అభిమానం పెంచుకున్నారు. దానిని అలుసుగా తీసుకుని ఇంట్లో పెత్తనం చేసేది.
 
          వీర్రాజు ఉన్నప్పుడు రత్నం అంతగా వచ్చేది కాదు.ఆయన వెళ్ళగానే వచ్చి నేను ఏ పుస్తకమో పట్టుకుని ఉంటే “కాలేజీ స్టూడెంట్ వదిన గారూ చదువు కుంటున్నారా “ అనేది. ఆ అనటం లోని వెటకారానికి మళ్ళా పుస్తకం తీయాలనిపించేది కాదు.
 
          నేను అప్పుడే బయటగదిలో ఉండి ఆడబడుచు ఒక్కతే వంటింట్లో గానీ ఉందంటే “ ఏంటి సత్యవతీ వదిన వచ్చినా ఆమెని కూర్చోబెట్టి నువ్వే పనంతా చేస్తున్నావా “ అనేది. దాంతో నేను పనంతా పూర్తయ్యే వరకూ వంటింట్లోనే పని ఉన్నా లేకపోయినా ఆడబడుచు తోనే వుండేదాన్ని.
 
          నేను మొదటినుంచీ బలహీనంగా ఉండి బరువైన ఇంటి పనులు చేయలేక పోయేదాన్ని. అందుకని నేను చదువుకి విజయనగరం వెళ్ళినా ఇబ్బంది లేకుండా చివరి ఇంట్లోని మాస్టారి ఇంటికి వచ్చే చాకలిని దుప్పట్లు. మగవారి బట్టలు ఉతికేందుకు మాట్లాడాను. వారానికి ఒకసారి తీసుకువెళ్ళి ఉతికి ఇచ్చేవాడు.
 
          అలాగే పనిమనిషిని సామాన్లు తోమించటానికి మాట్లాడాను.ఇంట్లో మగవాళ్ళకి ఆడవాళ్ళు చేసే ఇంటి పని మీద అవగాహన లేకపోవటంతో అంతకు ముందు పనంతా ఆడబడుచు మీద పడింది. అందుకు కూడా రత్నం “ కొత్త కోడలు రాగానే పనిమనిషిని కుదిర్చారే అన్న “అని వెటకారం చేసింది. అదేమీ నేను పట్టించుకోలేదు.
 
          నా చదువు గురించి ఎక్కడా చదవాలనే తర్జన భర్జనల నేపధ్యంలో పక్కింటి రత్నం మా ఆడబడుచును ” నేను కూడా చదువుకుంటాను అని మీ అన్నయ్యని అడుగు” అని ఎగసిన దోసింది. నేను కూడా చదవమనే ప్రోత్సహించాను. కానీ ఆమెకే ఆసక్తి లేనందున ముందుకు సాగలేదు.”ఇంట్లో వీణ ఉంది, సంగీత కళాశాల దగ్గర లోనే ఉంది కదా అదన్నా నేర్చుకోమ”ని చెప్పాను.అదీ చేయలేదు.
 
          అన్నిటి కన్నా పెద్ద సమస్యే మరొకటి. వంటింట్లోనే ఒక మూల దేవుడి పీఠం ఉంది . మా పెద్దమరిది కృష్ణ రోజూ దీపం పెడతాడు.ఐతే మేము వంటింట్లోనే పడుకోవటం వలన చీకటిలో కాలు దేవుడి పీఠానికి తగులు తుందేమో అని ఒక స్టాండ్ కొని ఆ మూలే గోడలకి కొట్టించి దేవుణ్ణి పైకి ఎక్కించాను.
 
          మా ఆడబడుచు బహిష్టు ఐనప్పుడు వంటింట్లోకి వెళ్ళేది కాదు. దాంతో పక్కింటి రత్నం వచ్చి అన్నం మా స్టౌ మీదే వండి కూరలు తెచ్చి ఇచ్చేదిట. నాకు అలా విడిగా ఉండటమూ నచ్చదూ, ఒకరిమీద ఆధారపడటమూ నచ్చదు. అంతే కాక అందరికీ అడ్వర్టైజ్ చేసేటట్లు నేనైతే ఉండను అని చెప్పి మా ఆడబడుచును ఇప్పుడు దేవుడు పైకే ఉన్నాడు కదా అని కోప్పడి మామూలుగా ఇంట్లోను తిరగటం అలవాటు చేసాను. తన మీద ఆధారపడకుండా చేసానని రత్నం నామీద కోపం పెంచుకుంది.
ఇదిగో ఇలాంటి వారి వల్లే అత్తాకోడళ్ళ మధ్యా, వదినామరదళ్ల మధ్యా,తోటికోడళ్ళ మధ్యా సంబంధాలు చెడిపోతాయి అనిపించింది.
 
          మరొక సమస్య మావాళ్ళు ఒకషాపులో అవసరమైన వెచ్చాలు అరువుగా తెచ్చుకుని జీతం వచ్చాక ఎంతో కొంత చెల్లు పెట్టేవారు. నాకు నచ్చని విషయం అదొక్కటి. దీనివల్ల వచ్చిన డబ్బుని పొదుపుగా వాడటం తెలియకుండా అవుతుంది. మేము తెచ్చుకున్న వస్తువుల బిల్లు అంతకన్నా రెట్టింపుగా అవుతూ ఎప్పుడూ బాకీ తీరకుండా ఉండటం గమనించాను. బహుశా మా అరువు అక్కౌంటులోనే ఎవరో తీసుకుంటున్నారని నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేనున్న ఈ రెండు మూడు నెలలకు దాన్ని పట్టించు కోవటం ఎందుకని ఊరుకున్నాను
 
          నిర్విరామంగా నానోట ఏదో ఒక పాట కూనిరాగాలుగా తీగెలు సాగుతూ
 వెలువడుతూనే ఉండేది. ఒక్కొక్కప్పుడు కాలేజీలో ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కూడా లాబ్ లో కూనిరాగాలు తీసేదాన్ని. అటువంటిది ఇక్కడికి వచ్చాక నా కంఠానికి తాళం పడింది.
 
          రాత్రిపూట వీర్రాజు పడుకోవటానికి వచ్చేవరకూ ఓగంటో రెండుగంటలో నేను చదువుకోటానికైనా, రాసుకోటానికైనా, బొమ్మలేసుకోటానికైనా నాదైన సమయం ఉండేది. ఇంట్లో బాపు బొమ్మలతో జనార్దనాష్టకం చూసీ భలే ఆనందం అనిపించింది. ఆ తీరిక సమయంలోనే ఆ బొమ్మలను చూసి అన్నీ వేసాను. అవి చూసి వీర్రాజే కాకుండా మిత్రులు కూడా అచ్చం బాపు చిత్రాలు లాగే ఉన్నాయని అనేవారు. ఒకసారి హైస్కూల్ లో చదివే రోజుల్లో విజయనగరం కోటలోని రౌండ్ మహాల్ లో బాపూ బొమ్మలు ప్రదర్శించారు. అవి చూసిన దగ్గర నుండి బాపు సీరియల్స్ కి వేసిన చిత్రాలు వేయటం అలవాటు. జనార్దనాష్టకం లోని నేను వేసిన చిత్రాన్ని ఒకనెల స్వాతి పత్రిక ముఖచిత్రం గా కూడా వేసారు.
 
          నాకు చాలా సంతోషం కలిగించేదీ ఎదురుచూసేది ఆదివారం సాయంత్రం. ఎందుకంటే ఆదివారం రోజు ఆంధ్ర సారస్వత పరిషత్తులో యువభారతి నిర్వహించే కావ్యలహరి ఉపన్యాస పరంపర ఉంటుంది. దానికి మాత్రం ఇంట్లో వాళ్ళనందరిని బయల్దేరదీయరు. అయితే మేమిద్దరమే వెళ్ళేదీ తక్కువే. ఎందుకంటే సెలవురోజు కనుక మధ్యాహ్నమే సాహితీ మిత్రులు వచ్చి ఉండేవారు. ఎప్పుడూ సాహిత్యసభలకు వెళ్ళలేదేమో కావ్యలహరి పేరిట మనుచరిత్ర ,పారిజాతాపహరణము ,వసుచరిత్రము , విజయవిలాస కావ్యాలపై ఉపన్యాస పరంపరగా ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారి తో ఉపన్యాసాలను  యువభారతి సారథులు ఇరివెంటి కృష్ణమూర్తి గారు, వంగపల్లి విశ్వనాధం గారూ నిర్వహించేవారు. 
 
          ప్రాచీన సాహిత్యం మీదే ఉపన్యాసాలు ఉన్నా గంభీరస్వరంతో ఆయన పద్యాలు చదువుతూ వివరించటం అద్భుతంగా అనిపించేది. మొదట్లో పరిషత్తు హాలులోనే జరిగేవి. కానీ సభకు అశేషంగా జనం వచ్చి వరండాలోను బయటా నిండిపోవటమేకాక ముందు ఖాళీ ప్రదేశం లోనూ నిలబడి వినేవారు. దాంతో తర్వాత్తర్వాత పరిషత్తు వెనుక ఓపెన్ వేదిక పై ఏర్పాటు చేయటం మొదలుపెట్టారు.
 
          ఉపన్యాసాలు సరేకానీ వాలంటీర్లుగా ఆ సమావేశం ఆవరణంతా గలగలా సందడిగా ఉత్సాహం గా ఎగిరే సీతాకోక చిలుకల్లా తిరిగే యువతీయువకులను చూస్తుంటే నాకు నా కాలేజీ గుర్తువచ్చి గుబులుఅయ్యేది.వాళ్ళంతా కూడా సుమారుగా నా వయసు వాళ్ళు కావటం వలన వాళ్లలో నన్ను చూసుకుని మళ్ళా అలా తిరగ్గలనా అనిపించేది.చెవులు ఉపన్యాసం వింటున్నా ,నా చూపులు వారి వెనకెనకే తిరిగేవి.
 
          తర్వాత్తర్వాత ఆ యువభారతీయులైన సుధామ, నాగినేని భాస్కర్రావు,కె.బి.లక్ష్మి, కామేశ్వరరావు,రత్నమాల మొదలైన వారంతా మాకు కుటుంబమిత్రులు అయ్యారు.
 
          యువభారతి ప్రచురణలు వందకి పైగానే ముఖచిత్రాలు వీర్రాజే వేసారు.నా పరిచయం, వివాహం తర్వాత  వీర్రాజుగారు రాసిన తొలి దీర్ఘ కావ్యం” మళ్ళీవెలుగు “ యువభారతి ప్రచురణే.నాకు అంకితం ఇచ్చిన ఈ పుస్తకావిష్కరణ సభ కి 1973 లో మూడునెలల పసిపాప పల్లవిని తీసుకొని హాజరయ్యాను.మాకు యువభారతి సంస్థతో చిరకాల అనుబంధం కొనసాగుతూనే ఉంది.
 
          రాజధాని నగరం కావటాన ఆఫీసు పనులమీదో,చుట్టపు చూపుగానో, స్నేహంగానో, మరే అవసరార్ధం వలనో  మాయింటికి వచ్చే పోయే అతిథులు చాలా ఎక్కువ.వీళ్ళుకాక ముఖచిత్రాలు కోసం వచ్చేవాళ్ళు సరేసరి.ఇంట్లో అందరికీ బంధుప్రీతి, అతిథి మర్యాదలు ఎక్కువే. అందువలన రోజంతా టీ పొయ్యి మీద మరుగుతూనే ఉండేది. రాత్రి అయినా సరే ఎవరైనా వస్తే మా పెద్దమరిది  అప్పు చేసైనా చికెన్ కొనుక్కోచ్చేసే వాడు. ఓపిక లేకపోయినా దేవుడా అనుకుని స్టౌ వెలిగించి కూర ,అన్నం చేయాల్సి వచ్చేది. ఒక్కొక్కప్పుడు ఓపిక లేకపోతే వచ్చిన వారికి ఉన్నది పెట్టేసి అడుగుబొడుగుతో కడుపు నింపు కోవటం కూడా జరిగేది. ఇటు వంటివన్నీ ఇంట్లో ఉన్నవాళ్ళే ఆడవాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి కానీ ఏం చెప్పుకుంటాం.
 
          అందుకే ‘నిన్ను గ్రాడ్యుయేట్ చేసే పూచీ నాదీ’అని వీర్రాజు అంటున్నా ఒకవేళ ఇక్కడే చదివేటట్లైతే నేను అక్షరం ముక్కైనా చదవగలనా అని బెంగ పెట్టుకున్నాను .
 
          అయితే వీర్రాజు మిత్రులు  అందరూ ఈ ఏడాది విజయనగరం లో చదివించటమే మంచిది అనటంవల్ల కావచ్చు, నాస్నేహితురాలు ఉషా ” కాలేజీలో పాఠాలు మొదలయ్యాయి. లెక్చరర్లు సుభద్ర చదువు మానేసిందా అని అడుగు తున్నారు. మరి ఏం నిర్ణయించుకున్నావు?”అంటూ ఉత్తరం రాయటం వల్ల కావచ్చు,.అన్నయ్య కూడా”సుభద్రను విజయనగరం లోనే చదివిస్తారా? కాలేజీలు మొదలైనాయి”అని రాయటం వలన కావచ్చు,నాకు ఇచ్చిన మాట వలన కావచ్చు  నాకు విజయనగరానికి రిజర్వేషన్ చేయించారు.
 
          చదువు మీద మోహంతో విజయనగరానికి బయల్దేరినా ఒంటరిగా రైలెక్కి ఫ్లాట్ ఫాం మీద దిగులు పరుచుకున్న ముఖంతో ఉన్న వీర్రాజును చూసి దుఃఖం పొంగుకు వచ్చింది. రైలు బయల్దేరటం వలనో చూపుకు అడ్డంగా ఉన్న కన్నీటి పొరవలనో ఆయన రూపం మసకబారింది. చదువు పూర్తి చేయాలనే నా కోరిక కన్నీటి పొరను తుడిచేసింది.

*****

Please follow and like us:

4 thoughts on “నడక దారిలో(భాగం-19)”

  1. చాలా చక్కగా వివరంగా రాస్తున్నారమ్మా

Leave a Reply

Your email address will not be published.