నడక దారిలో-32

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాల తో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయిం ది. ఉమ్మడి కుటుంబం విడిపోయి వేరు కాపురాలు అయ్యాయి. వీర్రాజు గారు స్నేహితుని తో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, మాకు పుట్టిన బాబు అనారోగ్యం, ఎమ్మే తెలుగు పరీక్షలకు చదవటం, తర్వాత—

***

 
          కొత్త ఇల్లు మాకు విశాలంగానే ఉంది. ముందుగదిని వీర్రాజుగారు ఆఫీసు రూంలా అమర్చుకున్నారు. మూడు గదులు దాటాక పెరటిలో దేశీ గులాబిచెట్టునిండా పూలతో బాగుంది. అయితే పెరటిగోడని ఆనుకొని క్షత్రియ హాస్టల్ ఉండేది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గోడ పక్కనే అబ్బాయిల ఆటలు, కేకలు, కబుర్లతో గోలగోలగా ఉండేది.
   
          వీథి గుమ్మం పక్కన కూడా మొక్కలు పెంచుకొనే వీలుంది. అదే కాంపౌండ్ లో లలితా వాళ్ళ చెల్లెలు భాగ్యలక్ష్మి కుటుంబం, ఆమె తల్లిదండ్రులతో సహా ఉండటం నాకు కొంత ధైర్యం కలిగించింది. భాగ్యలక్ష్మి భర్త “నిజం” పేరుతో కవిత్వం రాసే జర్నలిస్టు శ్రీరామ్మూర్తి గారు. భాగ్యలక్ష్మి, శ్రీరామ్మూర్తి గార్ల పెళ్ళిమాటలు మేము రాంకోఠీ లో ఉన్నప్పుడు మా ఇంట్లోనే జరిగాయి.
 
          మా కాంపౌండ్ పక్కనే ఉన్న ఇంటిలో యువభారతి సభ్యులు బసలింగప్పగారు ఉండేవారు. ఆయనకు పల్లవి వయసు అమ్మాయిలు ఉండటంతో పల్లవి సంతోషంగా ఆడుకునేది.
 
          ఈ ఇంటికి వచ్చాక పల్లవిని తిలక్ నగర్ లోని శ్రీవిద్యా సెకండరీ స్కూల్ లో జాయిన్ చేసాము. అదే స్కూల్లో యువభారతి సభ్యులు మాడభూషి రంగాచార్యులు గారి శ్రీమతి లలితాదేవి ఉపాధ్యాయురాలు. అప్పటి నుండీ వారితో మాకు స్నేహం మరింత పెరిగింది. మా ఇంటి ఎదురుగా ఉండే అమ్మాయితో కలిసి పల్లవి స్కూల్ కి వెళ్ళేది. అక్కడకి దగ్గరలో ఎవరో సంగీతం నేర్పిస్తారని తెలిసి పల్లవిని చేర్చాను.
 
          ఎమ్మే రెండో సంవత్సరం పరీక్షలకు కూడా ఫీజుకట్టి కొన్ని పుస్తకాలు తీసుకు వచ్చారు వీర్రాజుగారు. కానీ బాబు ఆరోగ్యం మరీ క్షీణించింది. తరుచూ ఏదో ఒక హడావుడి చేస్తుండటంతో హాస్పిటల్స్ చుట్టూ తిరగటం అవుతోంది.
 
          మెలకువగా ఉన్నప్పుడు చాపమీద బోర్లా పడుకుని బొమ్మలతో ఆడిస్తే బాగానే ఉండేవాడు. ఈ వయసుకి గంతులు వేస్తూ ఆటలు ఆడుతూ, కబుర్లు చెప్పాల్సిన మూడున్నర ఏళ్ళ వాడు బోర్లా మాత్రమే పడి అర్థంలేని కేకలే తప్ప అమ్మా అనే పిలవ టం కూడా రాని రబ్బరు బొమ్మ లాంటి వాడిని చూస్తుంటే కడుపు తరుక్కు పోయినట్లు దుఃఖం నన్ను ముంచెత్తేది. వాడిని నిద్రపోయినప్పుడు కాళ్ళమీద పడుకోబెట్టుకున్నంత సేపూ నిద్రపోయేవాడు. మెల్లగా పక్కమీద చేర్చే సరికి ఉలికి పడి ఫిట్స్ వచ్చేసేది. దాంతో రాత్రంతా నేను కొంతసేపు, వీర్రాజు గారు కొంతసేపు కాళ్ళమీద బాబుతో కూర్చునే ఉండాల్సి వచ్చింది.
 
          పల్లవి బడికి, ఆయన ఆఫీస్ కి వెళ్ళాక పగలు కూడా కాళ్ళమీద బాబుని పడుకోబెట్టు కుని పుస్తకాలు చదువుకునేదాన్ని. ఈ సారి పరీక్షలు రాయగలనా అనుకున్నాను.
 
          పరీక్షలకు ముందు విశ్వవిద్యాలయం నిర్వహించే కాంట్రాక్ట్ తరగతులకు ఈసారి కూడా హాజరు కాలేకపోయాను. సంస్కృతం పేపర్లో కాళిదాసు రఘువంశం, హితోపదేశం లో విగ్రహము, సంధి భాగాలు పాఠ్యాంశంగా ఉన్నాయి. విశ్వవిద్యాలయం వాళ్ళు రఘు వంశం నోట్స్ ఇచ్చారు కానీ సంధి ఇవ్వలేదు. బయట షాపులలో కూడా దొరకలేదు. చిన్ననాటి స్నేహితురాలు లలితకు ఉత్తరం రాసాను. ఆమెకు కూడా దొరకలేదుట. లలిత పనిచేస్తున్న స్కూల్లో సెలవు దొరక నందున ఆమె కూడా విశ్వవిద్యాలయం క్లాసుల కు హాజరు కాలేదట. ‘హాజరైయ్యుంటే నోట్స్ దొరికేది ‘ అంది. ఇక నా దగ్గర ఉన్న పుస్తకాలే చదువుకున్నాను.
 
          ఎప్పటిలాగే అమ్మని పరీక్షల సమయంలో రమ్మన్నాను. పల్లవికి స్కూలు సెలవులే కనుక బాబుని ఆడించటానికి సహాయంగా ఉంది.
 
          ఈ సారి కూడా రెడ్డి కాలేజీలోనే ఎగ్జామ్స్ సెంటరు. లలిత ఎప్పటిలాగే అక్కడ కలిస్తే మాట్లాడుకున్నాం. సంస్కృత పరీక్ష ముందురోజు హితోపదేశంలో సంధి, విగ్రహముల భాగాలు ఎవరో కొన్ని పేజీలు పంచారు. అవి కూడా చదువుకుని పరీక్షలు నిర్విఘ్నంగా రాసాను. పరీక్ష రాసి వచ్చాక అమ్మ మలకపేట పెద్దక్క ఇంటికి వెళ్ళిరెండు రోజులు ఉండి వస్తానంటే వీర్రాజు గారు తీసుకు వెళ్ళి అక్కడ ఇంట్లో దింపి వచ్చారు..
 
          “ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎలా అయితేనేం పట్టుదలతో ఎమ్మే పూర్తి చేసేసావు” అని ఆ రాత్రి ఆయన నన్ను ప్రశంసించారు. “ఇక పై తిరిగి సాహిత్యం వైపు దృష్టి పెట్టు” అని హెచ్చరించారు.
 
          ఫలితాలు గురించి ఏ మూలో భయం ఉన్నా, ఎమ్మెస్సీ చేయలేకపోయినా ఏదో ఒక పీజీ చేసినందుకు నాకు తృప్తిగా అనిపించింది.
       
          ఇంకా పడుకుందామనుకుంటూనే సరికి బాబు అకస్మాత్తుగా లేచి ఏడవటం మొదలుపెట్టాడు. ముదురు మట్టిరంగులో వాంతులు చేసుకోవటంతో మందుల వలన అలా వాంతి చేసుకుంటున్నాడు అనుకున్నాం. రాత్రంతా కాసేపు నిద్రపోవటం సడెన్ గా లేచి ఏడవటం ఫిట్స్ రావడం, వాంతి చేసుకోవడంతో ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ఎప్పుడు తెల్లవారుతుందా అనుకుంటూ జాగరణ చేసాం.
 
          ఉదయమే పల్లవిని పక్కనే ఉన్న శ్రీరామ్మూర్తి గారింట్లో అప్పగించి మేము బాబు చికిత్స కోసం సాధారణంగా ఎప్పుడూ తీసుకుని వెళ్ళే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాము. ఆయన చూసి నిలోఫర్ కి తీసుకు వెళ్ళమన్నారు. నిలోఫర్ హాస్పిటల్ కి తీసుకెళ్తే వెంట నే చేర్చుకుని సెలైన్ అమర్చి దానిగుండా మందులు వెళ్ళేలా చేసారు.
 
          ఈ వార్త తెలిసి మా పెద్దమరిది రామకృష్ణా, మల్లేష్ మొదలైనవారు నిలోఫర్ హాస్పిటల్ కి వచ్చారు. ఇంట్లో పల్లవిని చూసుకోవటానికి మా అమ్మను అక్కయ్య ఇంటి నుంచి పిలిపించాము. అక్కయ్య హాస్పిటల్ కి మా ఇద్దరికీ భోజనం పంపించేది.
         
          రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడి మూడోరోజు మమ్మల్ని తన వైకల్యం చూసి ఇంక కుమిలి పోవద్దనేనేమో ఈ లోకం నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు మా చైతన్యబాబు.
 
          ముద్దులు మూటగట్టేలా ఉన్న బాబుని చూసి నిత్యచైతన్యవంతుడిలా ఉండాలని చైతన్య అని పేరుపెట్టుకున్నాము. ఏ స్పందనా లేని గాజుబొమ్మలా ఉండి మూడున్నర ఏళ్ళ పాటు ఎప్పటికప్పుడు మా మనసుల్లో ఆశని రాజేసుకుంటూ గడిపిన మమ్మల్ని ఇంక సెలవంటూ మా ఒడి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు.
 
          రాత్రీ పగలు నిద్రకాచుకుంటూ గడిపిన నాకు ఒక్కసారిగా ఖాళీ అయిన ఒడిని చూసుకునే సరికి నిర్వేదం ఆవరించింది.
 
          నా పరీక్షలకు ఆటంకపరచకూడదనుకునేనేమో ప్రాణం నిలబెట్టుకుని మరీ వెళ్ళిపోయిన బాబుని గుర్తు తెచ్చుకుంటే దుఃఖం ముంచుకొచ్చింది.
 
          మూడున్నర ఏళ్ళుగా మా యింట అడుగు పెట్టని తోటి కోడళ్ళు మిఠాయిలు పట్టు కొని పరామర్శకి వచ్చేసరికి గుండెల్లో అగ్గి రాజుకుంది దుఃఖం ఆవిరైపోయింది.
 
          విషయం తెలిసి నా బాల్యస్నేహితురాలు కుమారి, వాళ్ళ ఆడబడుచు లక్ష్మి వచ్చారు. నన్ను ఓదారుస్తూ “సుభద్రా నువ్వు బియ్యెడ్ ఎంట్రన్స్ రాయకూడదా? నీ టేలెంట్స్ కి, మనస్తత్వానికి టీచర్ ఉద్యోగం బాగుంటుంది. పిల్లల మధ్య వుంటే నువ్వు మామూలు మనిషి అవుతావు. ఆలోచించు. పల్లవి కూడా కొంచెం పెద్దదయ్యింది కనుక ఇబ్బంది ఏమీ ఉండదు”అంది.
 
          కానీ ఇప్పుడు ఎంట్రన్స్ రాయగలనా అని సందేహం వెల్లడిస్తే ” ఏమీ పర్వాలేదు సుభద్రా 8,9,10 తరగతుల పుస్తకాలు ఓసారి తిరగెయ్యు సరిపోతుంది.” అంది.
       
          నాకు కూడా ఏమైనా చేయాలనిపించింది. ఇలా నాలుగు గోడల మధ్య వుంటే ఏమైపోతానో అనిపించింది.
         
          వీర్రాజు గారు రాగానే ఈ విషయం చెప్పాను. వీర్రాజుగారితో పాటూ వచ్చిన సిధారెడ్డి “నేను రేపు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఎంట్రెన్స్ ఫాం తీసుకు వస్తాన”న్నాడు.
         
          అదే విధంగా సిధారెడ్డి మర్నాడు ఉదయమే ఫాం తీసుకురావడమే కాదు అదేరోజు సబ్మిషన్ కు ఆఖరురోజని చెప్పి ఫాం నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి యూనివర్సిటీలో సబ్మిట్ చేసారు.
 
          ఇంటికి చుట్టుపక్కల పిల్లల్ని పుస్తకాలు అడిగి చదవటం మొదలెట్టాను. బియస్సీ చేసి పదేళ్ళయ్యింది. కానీ నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టు కనుక గణితం, సూత్రాలు వెంటవెంటనే గుర్తు వచ్చాయి. చదువులో పడేసరికి మనసు కొంత కుదుట పడింది. మొత్తం మీద ఎంట్రెన్స్ బాగానే సంతృప్తికరంగానే రాసాను.
 
          ఈలోపు ఎమ్మే రిజల్ట్ వచ్చింది.సెకెండ్ క్లాస్ లో పాసయ్యాను. ఆ పరిస్థితుల్లో పరీక్ష కు చదివినా మంచి మార్కులు రావటం సంతోషం కలిగింది. నా పరీక్ష పూర్తయ్యే వరకూ ప్రాణాలుగ్గబెట్టుకున్న బాబు గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి.
 
          ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి ఎంఫిల్ అడ్మిషన్ ప్రకటన చూసి మనసు అటువైపు ఊగింది. వీర్రాజుగారు కూడా “ఒక ప్రయత్నం చేయు. ఇదివస్తే ఎంఫిల్ చెయ్యు. బియ్యీడి సీటు వస్తే అదిచెయ్యు” అన్నారు. వచన కవిత్వంలో కావ్యాలు పేరుతో రెండు పేజీలు నోట్స్ తయారు చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాను. అప్పట్లో ఎంఫిల్, పీహెచ్డీ లకు ఇంటర్వ్యూ తప్ప ఎంట్రన్స్ లేదనుకుంటాను.
 
          మొదటిసారి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కుతుంటే ఉద్వేగం ఆవరించింది. అటువైపు బస్సులోని ఆటోలోనో వెళ్ళినప్పుడల్లా ఎప్పుడన్నా ఆ మెట్లు ఎక్కి రూముల్లో చదువుకొనే అవకాశం వస్తుందా అనుకునేదాన్ని. ఎమ్మే కాంటాక్ట్ క్లాసులకి వెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది.
 
          డా.కులశేఖరరావుగారూ, డా.నాయని కోటేశ్వరి, బిరుదురాజు రామరాజు గార్లు ఇంటర్వ్యూ చేసారు. అప్పటికే పుస్తక రూపంలోకి వచ్చిన ఆకలినృత్యం కవితాసంపుటి, కథలు, వ్యాసాలు చూసారు. కానీ నాకు సీటు రాలేదు. ఆ ఏడాది రెగ్యులర్ గా ఎమ్మే చదివిన వారికే ఇచ్చారని తెలిసింది.
 
          ఈ లోగా బియ్యిడీ ఎంట్రెన్స్ లో నాకు 56 రేంకు వచ్చినట్లు కార్డు వచ్చింది. మంచి రేంకు వచ్చింది తప్పని సరిగా కాలేజీలో సీటు వస్తుందని మిత్రులు చెప్పారు.
 
          ఒక్కసారి సంతృప్తిగా ఊపిరి తీసుకున్నాను.
*****
Please follow and like us:

2 thoughts on “నడక దారిలో(భాగం-32)”

  1. ఈ భాగం పూర్తి చేసేసరికి మనసంతా దుఃఖం తో నిండిపోయింది. బిడ్డను కాళ్ళపై పడుకోబెట్టుకొని చదువుకునే ఆ తల్లికి ఒకవైపు ఆవేదన మరోవైపు పట్టుదల. ప్రతి చిన్న సమస్యకు తీవ్రంగా ఆందోళన పడడం, ఆత్మహత్య చేసుకునే అమ్మాయిలకు లవ్ స్టొరీ లు కాదు, ఈ కఠిన జీవిత చరిత్ర ను వినిపించాలి. మూడున్నరేళ్ళు ఓపిగ్గా, ఆశతో, కళ్ళలో పెట్టుకుని చూసుకున్న తల్లికి , ఆమె చదువుకీ, ఆమె భవిష్యత్తు కు భంగం కలగకుండా పరీక్షలు అయ్యేదాకా ప్రాణాలుగ్గపట్టుకుని మూడు రోజులుండి శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆ చిన్న చైతన్య ఆమె జ్ఞాపకాల్లో చిరంజీవి.

    1. మీ ఆత్మీయ స్పందనకు బహు ధన్యవాదాలు సుశీలగారూ

Leave a Reply

Your email address will not be published.