నడక దారిలో-36

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ :తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతిపత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహా లతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయిం ది. ఉమ్మడి కుటుంబం విడిపోయి వేరు కాపురాలు అయ్యాయి. వీర్రాజు గారు స్నేహితుని తో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, మాకు పుట్టిన బాబు అనారోగ్యం, ఎమ్మే తెలుగు పరీక్షలు పూర్తయిన మూడురోజులకు బాబు అస్వస్థతతో చనిపోయాడు. బియ్యీడీ ఎంట్రెన్స్ పరీక్ష రాసి రేంకు రావటంతో ఆంధ్రమహిళాసభ బియ్యీడీ కాలేజిలో చేరి హార్డిల్ రేసులా ఒడిదుడుకులతో బియ్యీడీ పుర్తిచేసాను. ఒకటి రెండు స్కూల్స్ లో తాత్కాలికంగా పనిచేసి, ఎట్టకేలకు ఆర్టీసి హైస్కూల్ లో ఉద్యోగం వచ్చింది. తర్వాత—

***

          రాజమండ్రిలో పిత్రార్జితమైన ఇల్లు ఉంది. అది అమ్మేస్తే ఇక్కడ ఇల్లు సమకూర్చు కోవచ్చు అనే ఆలోచన అన్నదమ్ములకు చాలా కాలంగా ఉంది. ఆఖరుకు ఆ సమయం రానే వచ్చింది.
 
          ఇల్లు అమ్మకంలో రాతకోతల కోసం ముగ్గురు అన్నదమ్ములు రాజమండ్రి బయలు దేరి ఆ పని పూర్తి చేసుకుని వచ్చారు.
 
          వీర్రాజుగారు ఆడపిల్లలకు కూడా పంచాలని అనుకుంటే మా మరుదులు పడనీయ లేదు. సరికదా ‘వదినకు వాళ్ళన్నయ్యలు పొలం అమ్మినప్పుడు ఇవ్వలేదు కదా’ అంటూ లా పాయంట్లు లాగారు. పోనీ అందరం అయిదు వేల చొప్పున వేసుకుని ఇద్దరికీ ఏడున్నర చొప్పునా ఇద్దామన్నారు. దానికి కూడా గొణుక్కుంటూ, సణుక్కుంటూ ఇద్దరూ కలిసి అయిదు వేలిచ్చారు వీర్రాజు గారు పది కలిపి ఇద్దరు ఆడబడుచులకూ ఏడున్నర వేల చొప్పున ఇచ్చారు.
 
          పెద్దమరిది కృష్ణతో “నీ వాటా సొమ్ము ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తాను. ఇల్లు ఏదైనా కొనుక్కుందూ గానీ, లేకపోతే విలాసాలకు ఖర్చుపెట్టేస్తావని “అన్నారు. దాంతో అతనికి కోపం వచ్చి అన్నగారి మీద “నన్ను చాతకాని వెధవలా మీరంతా చూస్తున్నారు” అంటూ మీద మీదకి వచ్చి ఫైర్ అయ్యాడు. దాంతో కోపం వచ్చి అతని వాటా డబ్బు అతనికి ఇచ్చేసారు.
 
          చిన్న మరిది అంతకు ముందు ఎప్పుడో కొన్న స్థలంలో ఇల్లు కట్టుకోవటం మొదలు పెట్టాడు.పెద్దమరిది ఇంట్లోకి కావలసిన ఫర్నీచర్ కొనేసి మిగిలినదంతా ఖర్చు పెట్టేసాడు.
 
          అక్కయ్య వాళ్ళ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ అంతకు ముందు ఎప్పుడో అమ్మకానికి ఉందంటే డబ్బు లేక వదిలేసాము. అది ఇంకా ఉందా అమ్మకం అయిపోయిందా అని కనుక్కోమని అక్కయ్యతో చెప్పాము. వాళ్ళు మంచి బేరం కోసం చూస్తూ ఇంకా అమ్మ లేదని తెలిసింది. వెంటనే ఇవ్వవలసినది యాభైఅయిదువేలనీ, మిగతాది కోపరేటివ్ సొసైటీకి ప్రతీ ఏడాదీ కట్టాలని తెలిసింది. ఇల్లమ్మగా వచ్చిన దాంట్లో ఆడబడుచులకూ పదివేలు తీయగా మిగిలిన దానికి ఇంకా మరో ఇరవైవేలకు పైనే కావాలి, మా పేరుకి సేల్ డీడ్ డాక్యుమెంట్ లకు మరికొంత కావాలి. మిగతా డబ్బుకి ఏం చెయ్యాలని తర్జన భర్జనలో పడ్డాము.
 
          అనుకోకుండా అప్పుడే నా ఉద్యోగం అప్రూవల్ అయ్యి పదినెలల జీతం ఒకేసారి వచ్చింది. నా బంగారం ఎక్కడో పెట్టి కొంత తెచ్చారు. మా మామయ్య కొంత ఇస్తానన్నా డు. స్వాతి బలరాంకి ఈ విషయం తెలిసి అతనూ ఇస్తానని చెప్పాడు. కానీ వీర్రాజుగారు బలరాంతో “మీరు అప్పుగా ఇస్తేనే తీసుకుంటాన”ని తన షరతుని ఖచ్చితంగా చెప్పారు.
 
          అన్నీ కలిసి వచ్చి ఎలా అయితేనేం మలక్ పేట బ్రహ్మానందం నగర్ కాలనీలో మా కొరకు గూడు ఏర్పాటు చేసుకోగలిగాము. అదే 2/C అపార్ట్మెంట్.
 
          వేసవి సెలవులు రావటంతో పక్కనే అక్కయ్య వాళ్ళు ఉండటం, వాళ్ళ పనిఅమ్మా యి సాయంతో ఇల్లు శుభ్రం చేయించి, కడిగించాము.
 
          అంతకు ముందు ఎప్పుడూ మా ఇంట్లో పూజలు చేసేవాళ్ళం కాదు కనుక పూజా సామగ్రీ, దేవుడి బొమ్మలు లేవు. వీర్రాజు గారికి గల కళాకృతుల సేకరణ అభిలాష వల్ల ఏవో చిన్న చిన్న విగ్రహాలు ఉండేవి. కానీ, మేమున్న ఇంట్లో నుంచి సామాను మార్చినట్లు గా ఏదయినా ఒకబొమ్మని తీసుకొని వెళ్ళి పాలు పొంగించుదాం అనుకున్నాం. ఏది తీసుకు వెళ్దామా అని ఆలోచించి బుద్దుడు విగ్రహం తీసుకు వెళ్ళి అక్కయ్య ఇంట్లోంచి కిరోసిన్ స్టౌ తీసుకొచ్చి పాలు పొంగించి కాఫీ చేసి , బిస్కెట్లుతో పాటు ఇచ్చాము. ఆ రోజు మేము పిలిచినది మా పెద్దక్క కుటుంబాన్ని, మా మరుదులు కుటుంబాల్ని మాత్రమే.
 
          వాళ్ళంతా వెళ్ళాక ఆ రాత్రి అక్కడే పడుకున్నాము.
 
          రెండు రోజుల తర్వాత బయలుదేరి విజయనగరం వెళ్ళాము, అక్కడ ఓ వారం ఉండి భువనేశ్వర్ పెద్దాడబడుచు ఇంటికి వెళ్ళాము. భువనేశ్వర్ లో ఒక వారం పాటు పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగి చూసాము. మా ఇద్దరు ఆడబడుచులకు మేము ఇల్లు కొనుక్కున్న సందర్భంగా బట్టలు పెట్టాము.
 
          హైదరాబాద్ తిరిగి వచ్చాక కొత్త ఇంటికి సామానుతో పాటు షిఫ్ట్ అయ్యాము. సామాన్లు షిఫ్ట్ చేయటంలో పెద్దమరిది కృష్ణ, మల్లేష్, బాలాజీ ప్రెస్ బాలప్రసాద్, శంకరం మొదలైనవారు సహకారం అందించారు.
 
          అనుకోని విధంగా వీర్రాజు గారికి ఒక ప్రభుత్వ సంస్థకు వేసిన చిత్రాలు తాలూకు సొమ్ము అందటంతో చాలా తొందరగానే మా మామయ్యకు, బలరాంకూ అప్పులుతీర్చేయ గలిగాము. అప్పుడు మాకు ప్రశాంతత లభించింది.
 
          అక్కయ్య చిన్నమ్మాయి శర్వాణి డిగ్రీ చదువుతుంది, పెద్దమ్మాయి శ్రీదేవి డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. పక్కనే అక్కయ్య వాళ్ళు ఉన్నారని ఎంత సంతోషించాను. కానీ, ఒక విషయంలో బాధా కలిగింది. ఎందుకంటే అక్కయ్యకు గత రెండు మూడేళ్ళుగా కొంత న్యూరో సమస్యతో బాధపడుతుంది. సరియైన సమయంలో చికిత్స మొదలు పెట్టటం వలన తొందరగానే కోలుకోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నాం.
 
          మా ఇంటికి ఎదురులైను నుండి బీబ్లాక్స్ అంతా గవర్నమెంట్ క్వార్టర్లు. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కట్టిన ఇళ్ళు. కాలనీలోకి ఆఫీసు సమయంలో ఉద్యోగుల కోసం రెండు మూడు బస్సులు వస్తాయి. వీర్రాజుగారు ఆఫీసుకు బస్సులో వెళ్ళేవారు.
 
          ఇంట్లోకి పూర్తిగా మారిన తర్వాత ఒకరోజు మా స్కూల్లో టీచర్లకు, వీర్రాజు గారి ఆఫీసు స్టాఫ్ నీ మా ఇంటికి ఆహ్వానించి చిన్న పార్టీ ఇచ్చాము.
 
          పల్లవికి స్కూలుమార్చ లేదు. తిలక్ నగర్ లోని శ్రీవిద్యా సెకెండరీ స్కూల్ కి  ముసారాం బాగ్ వరకూ వెళ్ళి అక్కడ నుంచి బస్సులో వెళ్తుంది. మా పక్క బిల్డింగ్ లో సంగీతం టీచర్ ఉందని తెలిసి పల్లవిని సంగీతం క్లాసులకు పంపేదాన్ని. మరో రెండేళ్ళ కే వాళ్ళు మా కింద అపార్ట్మెంట్ కొనుక్కుని వచ్చేసారు. సంగీతం టీచర్ యజ్ణప్రభగారి అన్నయ్య శ్రీపాద పట్టాభి రాజమండ్రిలో బాగానే పేరున్న నాటకనటుడు. ఆమె తమ్ముడు జిత్ మోహన్ మిత్ర  విశ్వనాథ, బాపూ మొదలగువారి చిత్రాల్లో తరుచుగా నటిస్తాడు. యజ్ణప్రభగారికి ఇద్దరూ మగపిల్లలు కావటం వలన కావచ్చు పల్లవిని స్వంతకూతురులాగే ప్రేమించేవారు. పల్లవి చేత ఢిల్లీ గంధర్వ విద్యాలయం సంగీతకాలేజీ సర్టిఫికేషన్ చేయించారు. పాటల పోటీలకు కూడా తీసుకువెళ్తూ ఉండేవారు. ఆ తర్వాత ఆకాశవాణి లో బిగ్రేడ్ లో కూడా ఎంపిక అయ్యి పల్లవి రేడియోలో లలిత సంగీతం కార్యక్రమాల్లో పాల్గొనేది.
 
          మళ్ళీ నా కబుర్లకు వస్తే నేను పనిచేస్తున్న స్కూల్ ఆర్టీసి హైస్కూల్ కనుక నాకు స్టాఫ్ బస్ పాసు ఇచ్చారు. వేసవి సెలవులు అనంతరం స్కూలు మొదలైంది. స్కూల్లో మరో ముగ్గురు కొత్త టీచర్లు వచ్చారు. అందులో ఉమారాణి నాకన్నా ఏడేళ్ళు చిన్నది. తర్వాత్తర్వాత నాకు మంచి స్నేహితురాలు అయ్యింది. మరొకరు గంటి వెంకటరమణ అప్పటికే పేరున్న రచయిత్రి. వాళ్ళిద్దరూ సంతోష్ నగర్ లో నివాసం కనుక ముగ్గురం కలిసే స్కూల్ కి వెళ్ళి వస్తూ ఉండటంతో మాకు స్నేహం పెరిగింది.
 
          ఆర్టీసీ మేనేజ్మెంట్ లో మా స్కూలు నడుస్తున్నది కావటాన గతంలో ప్రతీ ఏడాదీ ఎక్స్ కర్షన్ కోసం బస్సులు, డ్రైవర్లనూ ఎరేంజ్ చేసేవారట. అది కొంత కాలంగా ఆగి పోయింది. మళ్ళా ఆ ఏడాది పునరుద్ధరించారు. దాంతో ఆ ఏడాది అజంతా, ఎల్లోరా, ఔరంగాబాద్ మొదలగు ప్రాంతాలకు విజ్ణానయాత్ర దసరా సెలవులలో నిర్ణయించారు.
 
          హైస్కూల్ టీచర్లు అందరూ వారివారి కుటుంబ సమస్యలతో ప్రయాణానికి ఇష్టపడ లేదు. మా మేడం నన్ను వెళ్ళమన్నారు. పల్లవి ఇంకా తొమ్మిదో తరగతి పిల్ల వదిలి వెళ్ళటానికి నేను ఇష్టపడలేదు. కానీ మేడం “మీ అమ్మాయికి కూడా పెర్మిషన్ ఇస్తాను. తీసుకొని వెళ్ళు . హైస్కూల్ టీచర్లు ఒకరైనా ఉండక పోతే వాళ్ళని కంట్రోల్ చేయటం కష్టం”అన్నారు. కానీ మిగతా టీచర్లు ఏమనుకుంటారో అనీ, బాగుండదని పల్లవిని తీసుకు వెళ్ళలేదు.
 
          నాకు చిన్నప్పటి నుంచి ఊళ్ళు తిరిగి అన్నీ చూడటం ఇష్టం. కానీ విజయనగరం చుట్టు పక్కలవే చూడలేదు. కృష్ణశాస్త్రి పాట ‘ పుడమినల్లా లవలేశము విడువక తిరగాలి ‘ అని ఎన్నిసార్లు పాడుకునే దాన్నో.
 
          సరే ఎలా అయితేనేం అయిదు రోజులు ఇల్లువదిలి, పల్లవిని వదిలి మొదటిసారి బయలు దేరాను. పక్కనే అక్కయ్యవాళ్ళు ఉన్నారని కొంత ధైర్యం.
 
          వీర్రాజు గారికి ఫోటోగ్రఫీ అంటే గల ఇష్టంతో కెమేరాల్ని కొంటూ ఉండే వారు. అటు వంటి ఒక చిన్న కెమేరాలో అజంతా శిల్పాలను, ఎల్లోరా చిత్రాలన్నీ బంధించాను. నన్ను మగపిల్లల బస్సుకు ఇంఛార్జిగా డ్యూటీ వేయటం వలన నా వెనుక తొమ్మిది, పది తరగతుల పిల్లలు తిరిగేవారు. వాళ్ళు కూడా ఫొటోలకు ఫోజులు పెట్టేవారు. ఆ విధంగా కుటుంబాన్ని మర్చిపోయి పిల్లలతో ఆరురోజులూ గడిచిపోయాయి. ఆ రోజులలో ఫోన్లు లేనందున కాంటాక్ట్స్ కూడా ఉండదు. ఏమైతేనేం అందరం క్షేమంగా వచ్చేసాము.
 
          ఇన్నాళ్ళూ అద్దెయిల్లు ఉండటం వలననే ఇంటిని మా అభిరుచి మేరకు అలంక రించుకునే అవకాశం లేదు. ఇప్పుడు మా కంటూ ఇల్లు ఉండటం ఎంతో ఆనందం కలిగింది. ఇంటికి అవసరమైన ఫర్నీచర్ ఒకటొకటిగా అమర్చుకున్నాము. వీర్రాజుగారు అవార్డులు వచ్చినా, ముఖచిత్రాలకు ఏవైనా ఎక్కువ సొమ్ము వచ్చినా కళాకృతులు కొనటం మొదలుపెట్టారు. దాంతో రానురానూ  ఇల్లంతా బొమ్మలకొలువులా అయిపోయింది.
 
          ఎన్టీఆర్ పాలనలో వారసత్వం మీద ఆధారపడిన పటేల్-పట్వారీ వ్యవస్థను రామారావు రద్దు చేయటం, హైదరాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్‌గా మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నిర్మించటం, బౌద్ధ వారసత్వాన్ని, చరిత్రను హైలైట్ చేయడానికి హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేయటం, హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై తెలుగువారిలో మహనీయుల విగ్రహాలతో అలంకరించటం, విద్యావ్యవస్థలో మేలైన మార్పులు చేయటం జరిగింది.
 
          కానీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి 55కి తగ్గించారు. దాంతో ఇంకా బాధ్యతలు తీరని ఉద్యోగులకు మనస్థాపంతో గుండెలు పగిలాయి.
 
          దీని ప్రభావం మామయ్య (పెద్దక్కయ్య భర్త)పై కూడా పడింది. యాభైఅయిదు నిండి పదవీ విరమణ చేయకతప్పలేదు. రెండో అమ్మాయి శర్వాణి హెచ్.సి.యు లో తెలుగు ఎమ్మేలో చేరింది.పెద్దమ్మాయి శ్రీదేవికి సంబంధాలు చూస్తున్నారు. విజయ నగరంలో వాళ్ళ ఇల్లు పూర్తిచేసుకొని వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని సామాను పంపించే సారు. తీరా అప్పుడే పెళ్ళివారు శ్రీదేవిని చూడటానికి వస్తానంటే మా ఇంట్లోనే ఎరేంజ్ చేసాము. పెళ్ళి హైదరాబాద్ లోనే చేయాలని పెళ్ళివారు కోరటంతో అక్కయ్యవాళ్ళున్న ఇల్లు ఓనర్స్ కి ఇవ్వకుండా అట్టే పెట్టుకోవాలను కుంటే ఇంటివాళ్ళు ఒప్పుకోక తాళాలు తీసుకోవటం కొంతబాధ, కోపం కలిగించింది. ఎందుకంటే ఏడేళ్ళుగా అద్దెకి ఉన్నవాళ్ళు అవసరం కోసం అడుగుతే మొండిగా అర్జంటుగా తాళాలు తీసుకు వెళ్ళిపోవటం ఒకటైతే, ఆ ఇంటివాళ్ళు అక్కయ్యకు స్నేహితులమని చెప్పుకునే సాహితీ దంపతులుకావటం మరోకారణం.
 
          పక్కనే అక్కయ్య వాళ్ళు ఉంటారన్న సంబరం తీరకుండానే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళా పెళ్ళికి ముందు వస్తాం అని వెళ్ళిపోయారు. మొత్తం మీద అక్కయ్య కూతురు శ్రీదేవి పెళ్ళికి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళం అందరం మా ఇంట్లోనే కలవటం చాలా ఆనందం కలిగించింది .
 
          అక్కయ్య వాళ్ళు ఉన్న ఆ ఇంట్లోకి పల్లవి క్లాస్మేట్ సుధ వాళ్ళు రావటం కొంత మేలైంది‌. వాళ్ళతో మాకు మంచి స్నేహసంబంధాలు ఏర్పడ్డాయి.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.