
జ్ఞాపకాల మలాము ( కవిత)
-సుభాషిణి వడ్డెబోయిన
గతకాలపు వాసనలన్నీ
గాయాలై సలుపుతున్నా…
చిరునవ్వు పులుముకొని
కాంతిలో నిశీధిని మోస్తున్నాను.
నీ తలపుల కిరణాలు
నన్ను తాకుతుంటే…
పొద్దు వాలినా…
ప్రొద్దుతిరుగుడు పువ్వునయ్యాను.
మనలో మొలచిన ఆశలన్నీ
మోడుబారిపోతుంటే…
నాకు నేనే సాంత్వనయ్యాను.
కాలమేసిన కాటుకి
విడివడిన మనం…
రైలు పట్టాల్లా
కలవని దూరంతో
రాజీ పడి బ్రతకడమే…
ప్రేమ చిగురించిన వేళనుంచే
చింతలన్నీ మన చెంత చేరాయి…
నైరాశ్యపు నీడలు కమ్ముకున్నా…
మనసు మోస్తున్న గాయాలకు
మధుర జ్ఞాపకాల మలాము
రాసుకుంటున్నాను.
*****

సుభాషిణి వడ్డెబోయిన ఓ యేడాది నుండి వచన కవిత్వం వ్రాస్తున్నాను. నేను ఓ సామాన్య గృహిణి. ఇంటర్ మాత్రమే చదువుకున్నాను. ప్రకాశం జిల్లా పొందూరు అనే గ్రామంలో ఉంటాను. మన నెచ్చెలి పత్రిక చాలా నచ్చింది.. మంచి మంచి కవితలు, వ్యాసాలు చదివి నేను కూడా వ్రాసి పంపాను
